మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

"టాయ్‌కాథన్ -2021" లో పాల్గొన్న వారితో సంభాషించిన - ప్రధానమంత్రి


‘టాయ్ ఎకానమీ’ లో మంచిగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చిన - ప్రధానమంత్రి

అత్యవసరమైన విభాగాలకు తగిన అభివృద్ధి మరియు పురోగతిని సాధించే సామర్ధ్యం ఆట బొమ్మల రంగానికి ఉందని నొక్కి చెప్పిన - ప్రధానమంత్రి

స్థానిక ఆట బొమ్మల కోసం మనం మౌఖిక ప్రచారం చేయవలసిన అవసరం ఉంది : ప్రధానమంత్రి

Posted On: 24 JUN 2021 5:38PM by PIB Hyderabad

"టాయ్‌కాథన్ -2021" లో పాల్గొన్న వారితో ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంకా - కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ ఖరే;  జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్;  ఎ.ఐ.సి.టి.ఇ., ఛైర్మన్, ప్రొఫెసర్ అనిల్ డి. సహస్రబుధే;  ఇన్నోవేషన్ సెల్, విద్యా మంత్రిత్వ శాఖ, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి, డాక్టర్ అభయ్ జెరె;  ఎ.ఐ.సి.టి.ఇ., వైస్ చైర్మన్, డాక్టర్ ఎం.పి. పూనియా;  విద్యా మంత్రిత్వ శాఖ, ఇన్నోవేషన్ సెల్, డైరెక్టర్, డాక్టర్ మోహిత్ గంభీర్ ప్రభృతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 5-6 సంవత్సరాల్లో, దేశంలోని యువత "హాకథాన్స్" వేదిక ద్వారా దేశంలోని ముఖ్య సవాళ్లతో అనుసంధానించబడ్డారని తెలిపారు.   దీని నేపధ్యం గురించి ఆలోచిస్తే దేశ సామర్థ్యాలను నిర్వహించడం, వారికి ఒక మాధ్యమాన్ని సమకూర్చడం అని ఆయన పేర్కొన్నారు. 

పిల్లల మొదటి స్నేహితుడిగా బొమ్మల ప్రాముఖ్యతతో పాటు, బొమ్మలు, గేమింగ్ యొక్క ఆర్థిక అంశాలను కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  దీనినే, ఆయన,  ‘టాయ్ ఎకానమీ’ అని పిలిచారు.  ప్రపంచ వ్యాప్తంగా పిల్లల ఆట బొమ్మల మార్కెట్ సుమారు 100 బిలియన్ డాలర్లు కాగా, ఈ మార్కెట్లో భారతదేశానికి 1.5 శాతం వాటా మాత్రమే ఉందని ప్రధానమంత్రి చెప్పారు.  భారతదేశం తన ఆట బొమ్మలలో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకుంటోంది.  అంటే మన దేశ ఆర్ధిక వ్యవస్థ నుండి కోట్లాది రూపాయలు బయటకు పోతున్నాయి.  ఈ పరిస్థితి మారాలని, ప్రధానమంత్రి, ఆకాంక్షించారు.  సమాజానికి అవసరమైన విభాగాలకు తగిన పురోగతి మరియు అభివృద్ధిని తీసుకువచ్చే సామర్థ్యం ఈ రంగానికి ఉందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.  ఆట బొమ్మల పరిశ్రమ స్వతహాగా, గ్రామీణ జనాభా, దళితులు, పేద ప్రజలు మరియు గిరిజన జనాభా కలిగిన చేతివృత్తులవారితో కూడిన, చిన్న తరహా పరిశ్రమగా కొనసాగుతోంది.   ఈ రంగంలో మహిళల సహకారాన్ని ప్రధానమంత్రి  ప్రత్యేకంగా గుర్తించారు.  ఈ విభాగాలకు ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా స్థానిక ఆట బొమ్మల కోసం మనం మౌఖిక ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.  ప్రపంచ స్థాయిలో భారతీయ ఆట బొమ్మలను పోటీగా నిలపడానికి వీలుగా కొత్త ఆవిష్కరణల నమూనాలతో, పెట్టుబడులు పెట్టాలని, ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  కొత్త ఆలోచనలను రూపొందించి, కొత్త అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ, సాంప్రదాయ బొమ్మల తయారీదారులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, కొత్త మార్కెట్ డిమాండ్‌ను సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన, సూచించారు.  "టాయ్కాథన్" వంటి కార్యక్రమాల నిర్వహణ వెనుక ఉన్న ప్రేరణ ఇదే అని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

ఇంటర్నెట్ నేతృత్వంలోని గ్రామీణ కనెక్టివిటీ యొక్క చౌక డేటా మరియు వృద్ధిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, భారతదేశంలో వర్చువల్, డిజిటల్ మరియు ఆన్‌లైన్ గేమింగ్‌లో అవకాశాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.  మార్కెట్లో లభించే ఆన్‌-లైన్ మరియు డిజిటల్ ఆటలు చాలావరకు భారతీయ భావనల ఆధారంగా లేవని ప్రధానమంత్రి పేర్కొంటూ, ఇలాంటి అనేక ఆటలు హింసను ప్రోత్సహిస్తున్నాయనీ, మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయనీ, ఆందోళన వ్యక్తం చేశారు.  భారతదేశ సామర్థ్యాలు, కళ, సంస్కృతి మరియు సమాజం గురించి అంతర్జాతీయ సమాజం తెలుసుకోవాలనుకుంటోందన్న విషయాన్ని, ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు.   ఈ విషయంలో పిల్లల ఆట బొమ్మలు పెద్ద పాత్ర పోషించనున్నాయని, ఆయన అన్నారు.  భారతదేశంలో డిజిటల్ గేమింగ్ కు అవసరమైన విషయ పరిజ్ఞానం, సామర్ధ్యం సమృద్ధిగా ఉన్నాయని కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు.  భారతదేశానికి ఉన్న సామర్థ్యాలు, ఆలోచనలను తెలియజేసే వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియజెప్పే బాధ్యతను చేపట్టాలని, శ్రీ నరేంద్రమోదీ,  యువ ఆవిష్కర్తలకు, అంకురసంస్థలకు పిలుపునిచ్చారు.

ఆట బొమ్మల పరిశ్రమకు చెందిన ఆవిష్కర్తలు మరియు సృష్టికర్తలకు, భారతదేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవం, ఒక గొప్ప అవకాశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనేక సంఘటనలు, మన స్వాతంత్య్ర సమరయోధుల కథలు, వారి శౌర్యం, నాయకత్వానికి చెందిన సంఘటనలను గేమింగ్ భావనలుగా సృష్టించే అవకాశం ఉంది.   ‘జానపదాలను భవిష్యత్తుతో’ అనుసంధానించడంలో ఈ ఆవిష్కర్తలకు పెద్ద పాత్ర ఉంది. "నిమగ్నమవ్వండి, వినోదం ఇవ్వండి, అవగాహన కల్పించే’ ఆసక్తికరమైన, పరస్పరం సంప్రదించే అవకాశం ఉన్న ఆటలను సృష్టించాల్సిన అవసరం ఉందని, ప్రధానమంత్రి, వివరించారు. 

"టాయ్‌కాథన్" నిర్వహణలో, ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, మొదటి నుండీ మార్గదర్శకత్వం అందించినందుకు మరియు పాల్గొన్న వారి తో సంభాషించి, వారికి మార్గనిర్దేశం చేసినందుకు విదేశాంగ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, ప్రధానమంత్రి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

భారతదేశాన్ని ఆట బొమ్మల ఉత్పత్తి కేంద్రంగా మార్చడంలో, "టాయ్‌కాథన్" సమర్థవంతంగా పనిచేస్తుందని శ్రీ ధోత్రే ఉద్ఘాటించారు. భారతదేశం లోని ఆట బొమ్మల పరిశ్రమ రంగాన్ని, అన్ని వయసుల ఆవిష్కర్తలు, పరిశోధకులతో అనుసంధానం చేయడం ద్వారా కొత్త మార్గాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రయత్నమని, ఆయన, ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.  ఈ "టాయ్‌కాథన్"  ద్వారా, భారతీయ సంప్రదాయం, చరిత్ర, సంస్కృతికి అనుగుణంగా ఆట బొమ్మలను అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగిందని కూడా, ఆయన తెలియజేశారు.

దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ "టాయ్‌కాథన్" లో దేశవ్యాప్తంగా విద్యార్థులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు.  2021 జనవరి 5వ తేదీన ప్రారంభమైన, "టాయ్‌కాథన్ -2021" భారీ ముగింపు ఉత్సవం 2021 జూన్, 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఏర్పాటు చేశారు.  విజేతల వివరాలు 2021 జూన్, 26వ తేదీన ప్రకటిస్తామని, వారికి 60 లక్షల రూపాయల మేర నగదు పురస్కారాలను ప్రదానం చేయనున్నామని కూడా ఆయన తెలియజేశారు.



(Release ID: 1730226) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi