వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో ఎంఎస్పీ కార్యకలాపాలు
Posted On:
25 NOV 2020 7:38PM by PIB Hyderabad
ప్రస్తుత 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో, 2020-21 ఖరీఫ్ పంట ఉత్పత్తుల సేకరణను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతమున్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పథకాల ప్రకారం కనీస మద్దతు ధరల వద్ద రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తోంది.
ఈ ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్ము&కశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలో 24.11.2020 నాటికి, 304 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. గతేడాది ఇదే సమయానికి సేకరించిన 258.02 ల.మె.ట. కంటే ఇది 17.82 శాతం అధికం. ప్రస్తుత 304 ల.మె.ట. సేకరణలో, ఒక్క పంజాబ్ నుంచే 202.38 ల.మె.ట. ధాన్యం గోదాములకు చేరింది. దేశవ్యాప్త సేకరణలో ఇది 66.57 శాతం.
కనీస మద్దతు ధర వద్ద కేంద్రం చేపట్టిన కొనుగోళ్ల ద్వారా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 27.18 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వారికి కనీస మద్దతు ధరగా రూ. 57395.74 కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది.

రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు; ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) ప్రకారం, ప్రస్తుత సీజన్లో 45.24 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్కు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరి సేకరణకు కేంద్రం అనుమతినిచ్చింది. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పీఎస్ఎస్ ప్రకారం, ఎఫ్ఏక్యూ రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండుకొబ్బరి సేకరణకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ
కనీస మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే, నమోదిత రైతుల నుంచి 2020-21 ఎంఎస్పీ ప్రకారం, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా నేరుగా పంటలను సేకరిస్తారు.
24.11.2020 వరకు; 47,160 మంది తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రైతులకు ప్రయోజనం కలిగిస్తూ, రూ. 441.74 కోట్ల కనీస మద్దతు ధరతో, 81813.04 మె.ట. పెసలు, మినుములు, వేరుశనగ, సోయాబీన్ను నోడల్ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది.
అదేవిధంగా, 5089 మె.ట. ఎండు కొబ్బరిని రూ.52.4 కోట్ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసింది. దీనివల్ల, 24.11.2020 వరకు తమిళనాడు, కర్ణాటకలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గతేడాది ఇదే సమయానికి ఈ సేకరణ 293.34 మె.ట.గా ఉంది. ప్రధాన సేకరణ రాష్ట్రాల్లో ఎండుకొబ్బరి, మినుముల మార్కెట్ రేట్లు ఎంఎస్పీ కంటే ఎక్కువగా ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి, పంటల రాక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సేకరణల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో గింజ పత్తి (కపస్) సేకరణ కూడా సాఫీగా సాగుతోంది. 24.11.2020 వరకు, 4,84,352 మంది రైతుల నుంచి 24,08,501 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా 7,162.88 కోట్ల రూపాయలు చెల్లించింది.

*****
(Release ID: 1675991)