వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కనీస మద్దతు ధరపై పంటల సేకరణ

రూ. 54147.38కోట్ల మేర కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరణ,

దాదాపు 24.78 లక్షలమంది రైతులకు ప్రయోజనం

మొత్తం 286.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో

పంజాబ్ వాటా 199.32లక్షల మెట్రిక్ టన్నులు (69.41శాతం)

Posted On: 18 NOV 2020 5:29PM by PIB Hyderabad

  ప్రస్తుతం కొనసాగుతున్న 2020-21వ సంవత్సరపు  ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ఖరీఫ్ పంటల సేకరణను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2020-21వ సంవత్సరపు ఖరీఫ్ పంటలను ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకాల ప్రకారం రైతులనుంచి సేకరిస్తున్నారు.

   2020-21 ఖరీఫ్ ధాన్యంసేకరణ ప్రక్రియ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సజావుగా సాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్.లలో సేకరణ ప్రక్రియ సాగుతోంది. 2020 నవంబరు 11నాటికి 286.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో 241.78 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరణ జరిగింది. అంటే ఈ ఏడాది ధాన్యం సేకరణలో 18.61శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 286.79 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 199.32 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. అంటే, సేకరించిన మొత్తం ధాన్యం పరిమాణంలో ఇది 69.41శాతం. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో రూ. 54147.38 కోట్ల విలువైన కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరణ ద్వారా దాదాపు 24.78లక్షల మంది రైతులకు ఇప్పటికే ప్రయోజనం చేకూరింది.

 

 దీనికి తోడు ఆయా రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనలమేరకు,..2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్.కు సంబంధించి, 45.10లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకు అనుమతి లభించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్దతు ధర పథకం (పి.ఎస్.ఎస్.) కింద సేకరణకు అనుమతి ఇచ్చారు.  ఇక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లక్షా 23వేల మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల సేకరణకు కూడా అనుమతి లభించింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతిపాదనలు అందిన వెంటనే పప్పు దినుసులు, నూనె గింజలు, కొబ్బరి కురిడీల సేకరణకు అనుమతి మంజూరవుతుంది. 2021 సంవత్సరానికి, కనీస మద్దతు ధరకంటే మార్కెట్ రేటు తక్కువగా ఉన్న పక్షంలో నోటిఫై చేసిన కనీస మద్దతు ధరపైనే పేర్లు నమోదు చేసుకున్న రైతులనుంచి నేరుగా ఎఫ్.ఎ.క్యు.గ్రేడ్ పంటల సేకరణకు చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీలు, ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసిన ఏజెన్సీలు ఈ ప్రక్రియను నిర్వహిస్తాయి.

  2020 నవంబరు 17 నాటికి, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 60,100.06 మెట్రిక్ టన్నుల పెసలు, ఉద్దిపప్పు, వేరుశనగ కాయలు, సోయాబీన్ పంటలను రూ. 324.43 కోట్ల విలువైన కనీస మద్దతు ధరతో సేకరించింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ  సేకరణ ద్వారా 34,918మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 33,976.48 మెట్రిక్ టన్నులమేర పంటలను మాత్రమే సేకరించారు. అంటే, పప్పు దినుసులు, నూనె గింజల సేకరణ 76.89  శాతం పెరిగింది.

 

  ఆలాగే,.. 2020 నవంబరు 17 నాటికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రూ. 52.40కోట్ల విలువైన కనీస మద్దతు ధరతో 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల సేకరణ జరిగింది. దీనితో ఆ రెండు రాష్ట్రాల్లోని 3,961మంది రైతులకు ప్రయోజనం కలిగింది. గత ఏడాది ఇదే సమయంలో 293.34 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీలు సేకరించారు. అయితే,.. కొబ్బరి కురిడీలు, ఉద్ది పప్పుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకంటే మార్కెట్ ధరే ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్.కు సంబంధించిన పప్పు దినుసులు, నూనెగింజల చేతికందే సమయాన్ని బట్టి, ఆయా రాష్ట్రాలు నిర్ణయించే తేదీనుంచి పంటల సేకరణ ప్రారంభించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

   ఇక, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరపై విత్తన పత్తి పంట సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. 2020 నవంబరు 17 నాటికి, రూ. 5,023.70 కోట్ల రూపాయల విలువైన 16,04,413 బేళ్ల పత్తిని సేకరించారు. దీనితో 3,14,384 మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరింది.

 

**********



(Release ID: 1673882) Visitor Counter : 100