పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
46వ వ్యవస్థాత్మక దినోత్సవం నిర్వహించుకున్న కేంద్రకాలుష్య నియంత్రణ బోర్డు; మరింత శాస్త్ర ఆధారిత పర్యావరణ నిర్వహణ మేనేజ్ మెంట్ కు అనుగుణంగాసాంకేతిక నాయకత్వం అందించనున్నట్టు ప్రకటన
వాయు నాణ్యత పెంచడం అందరి ఉమ్మడి బాధ్యత : శ్రీ బాబుల్ సుప్రియో
Posted On:
23 SEP 2020 8:43PM by PIB Hyderabad
దేశంలో వాయు స్వచ్ఛతను పరిరక్షించాల్సిన ఉమ్మడి బాధ్యత ప్రజలు, ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో పిలుపు ఇచ్చారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి) 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక వెబినార్ లో మాట్లాడుతూ కాలుష్యానికి సంబంధించిన గణాంకాలు సేకరించి ప్రభుత్వానికి విధానరూపకల్పనకు అవసరమైన కీలక సమాచారం అందించడంలోను, వాయు నాణ్యత మెరుగుపరచడంలోను సిపిసిబి విశిష్టమైన కృషి చేస్తున్నదని ఆయన కొనియాడారు. సిపిసిబి అందిస్తున్న వాస్తవికత ఆధారిత సమాచారం అత్యంత ప్రశంసనీయమైనదన్నారు.
పర్యావరణ ప్రక్షాళనకు అత్యవసర మీట నొక్కడానికి కోవిడ్-19 మహమ్మారి సహాయపడిందని శ్రీ సుప్రియో అన్నారు. పంటలపై ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని ఆయన అన్నారు. కోవిడ్-19 కాలంలో బయో మెడికల్ వ్యర్ధాలను సమర్థవంతంగా నిర్మూలించడంలో సిపిసిబి పాత్రను ఆయన ప్రశంసించారు.
దేశంలో పర్యావరణ పరిశోధన, పర్యవేక్షణ, నియంత్రణ, నిబంధనల అమలుకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక హస్తంగా నీటి (కాలుష్య నివారణ, నిరోధ) చట్టం-1974 కింద 1974 సెప్టెంబర్ 23వ తేదీన సిపిసిబిని ఏర్పాటు చేశారు.
ప్రారంభం నుంచి సిపిసిబి దేశంలో పర్యావరణ పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. రంగాలవారీగా నిర్దిష్ట ప్రమాణాలు (86) రూపొందించడం, 5 వేలకు పైగా పరిశ్రమలపై వాస్తవిక సమయం ఆధారంగా నిఘా వేయడం, గంగానదీ కార్యాచరణ ప్రణాళిక అవసరమైన నదీపరీవాహక అధ్యయనాలు చేపట్టడం, బహుళ నగరాల్లో విభాగాలవారీ అధ్యయనాలు చేపట్టడం, విస్తృత పర్యవేక్షణ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, ప్రజలకు పంపిణీ చేయడానికి అవసరం అయిన డేటా నిర్వహణ, జాతీయ స్థాయిలో వాయునాణ్యత ప్రమాణాల రూపకల్పన, జల నాణ్యత అర్హతలు నిర్ణయించడం సిపిసిబి చేపట్టిన క్రియాశీల చర్యల్లో ప్రధానమైనవి.
త్వరితగతిన పారిశ్రామిక, వాణిజ్య, జనాభా వృద్ధి పరంగా తీవ్రంగా దిగజారుతున్న వాయుకాలుష్యం దృష్ట్యా సిపిసిబి తీసుకున్న కార్యాచరణలు అత్యంత కీలకమైనవి. నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణపరమైన సవాళ్లు, పెరుగుతున్న ప్రజల అంచనాల నేపథ్యంలో కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాలు, నిర్వహణ వ్యూహాలు పునర్ నిర్వచించేందుకు సిపిసిబి నిరంతరాయంగా కృషి చేస్తోంది.
2030 నాటికి నిర్దేశించుకున్న సిపిసిబి పరివర్తిత లక్ష్యాలు, వాటికి అనుగుణంగా అనుసరిస్తున్న పర్యావరణ లక్ష్యాలు, వినూత్నమైన కాలుష్య నివారణ వ్యూహాలు అమలుపరిచేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై అందరికీ వివరించేందుకు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ వెబినార్ ను నిర్వహించింది.
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో ప్రారంభించిన ఈ వెబినార్ లో ఈ దిగువ అంశాలపై సాంకేతిక నివేదికలు విడుదల చేశారు.
- చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల పర్యావరణ నిర్వహణ సిబ్బందికి రెడీ రెకనర్
- జాతీయ వాయునాణ్యత స్థితి, ధోరణులు 2019
- లాక్ డౌన్ సమయంలో నదీ జలాల నాణ్యత
- లాక్ డౌన్ సమయంలో వాయునాణ్యత
దేశంలో 1641 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్ టిపి) డేటా సేకరణ, త్వరిత రిపోర్టింగ్ కోసం ఎస్ టిపి మొబైల్ అప్లికేషన్ ను కూడా మంత్రి ప్రారంభించారు. నీటి వనరుల్లోకి వదిలే ముందు మురుగునీటిని తగినంతగా శుద్ధి చేసేందుకు తగినన్ని వసతులు ఉండడం కూడా అవసరం. ఆ కోణంలో సిపిసిబి విడుదల చేసిన ఈ పర్యవేక్షణ యాప్ అత్యంత కీలకమైనది.
వాతావరణ స్వచ్ఛత ప్రయత్నాల్లో సిపిసిబి ముందువరుసలో ఉన్నదని ఎంఓఇఎఫ్ & సిసి అదనపు కార్యదర్శి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చాలా సంవత్సరాలుగా సాంకేతిక పరిజ్ఞానాలు అప్ గ్రేడ్ చేయడంలోను, నిరంతర మెరుగదలకు స్ఫూర్తి ఇవ్వడంలోను సిపిసిబి ప్రశంసనీయమైన కృషి చేసిందన్నాను, ఎక్యుఐ, ఎన్ సిఏపి, వ్యర్థాల నివారణ చర్యలు ఆరోగ్యవంతమైన, అనుకూలమైన పర్యావరణం అభివృద్ధికి దోహదపడతాయి.
గత 46 సంవత్సరాలుగా సిపిసిబి సాధించిన విజయాలను సిపిసిబి చైర్మన్ శ్రీ శివదాస్ మీనా వివరించారు. భవిష్యత్తులో బోర్డు ముందున్న సవాళ్లను ఆయన వివరిస్తూ కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు బోర్డు ఉద్యోగులు సమాయత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.
2030 నాటికి సాధించుకునేందుకు సిపిసిబి రూపొందించుకున్నపరివర్తిత లక్ష్యాలను సిపిసిబి సభ్య కార్యదర్శి శ్రీ ప్రశాంత్ గౌర్ వివరించారు. కాలుష్య నిఘా, విశ్లేషణ వ్యవస్థల పునరుజ్జీవానికి సిపిసిబి విజన్ ను, సైన్స్ ఆధారిత కార్యాచరణ ప్రణాళిక మార్గదర్శకంగా అనుసరిస్తున్న విధానాలను, పరిశోధన-అభివృద్ధి విభాగం పటిష్ఠతకు తీసుకున్న చర్యలను, అనుసరిస్తున్న ఐటి పరికరాలను, భవిష్యత్ అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించిన విభాగాల వివరాలను ఆయన తెలియచేశారు.
ఎంఓఇఎఫ్ సిసి మాజీ కార్యదర్శి శ్రీ సికె మిశ్రా, సిపిసిబి మాజీ చైర్మన్లు శ్రీ ఎస్ పిఎస్ పరిహార్, శ్రీమతి ఎస్ పి గౌతమ్, ప్రస్తుత చైర్మన్ శ్రీ శివదాస్ మీనా, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సునీతా నారాయణ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యారణ రక్షణకు సిపిసిబి చేస్తున్నప్రయత్నాలను వారు ప్రశంసించారు. సామర్థ్యాల నిర్మాణంలో భవిష్యత్ పాత్ర, పెట్టుబడులపై దృష్టి సారించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
రాష్ర్టాల ప్రిన్సిపల్ కార్యదర్శులు (పర్యావరణం), రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డులు, కాలుష్య అదుపు కమిటీల చైర్మన్లు, సభ్య కార్యదర్శులు, సిపిసిబి బోర్డు సభ్యులుఎంఓఇఎఫ్ సిసి, సిపిసిబి సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1658941)