భారత ఎన్నికల సంఘం
కోవిడ్-19 వ్యాప్తి కాలంలో ఎన్నికల నిర్వహణ
అనుభవాలను పంచుకున్న ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలు
‘కోవిడ్-19లో ఎన్నికల నిర్వహణా సవాళ్లు, సమస్యలు, నియమావళి: దేశం అనుభవాలు’ అన్న అంశంపై ఎన్నికల కమిషన్ అంతర్జాతీయ వెబినార్
రెండు ప్రచురణల విడుదల; ‘ఎన్నికలపై ఎ-వెబ్ జర్నల్’
వెలువరించనున్న . ఇండియా ఎ-వెబ్ సెంటర్.
బీహార్ ఎన్నికలపై వెబినార్,లో ప్రస్తావన;
ఆ రాష్ట్ర సందర్శనపై త్వరలో కమిషన్ నిర్ణయం.
Posted On:
21 SEP 2020 4:52PM by PIB Hyderabad
ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం (ఎ-వెబ్, ఎ .డబ్ల్యు.ఇ.బి.) అధ్యక్షహోదాలో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న భారతీయ ఎన్నికల కమిషన్, ఈ సందర్ఫభంగా ఒక అంతర్జాతీయ వెబినార్ సదస్సును నిర్వహించింది. ‘కోవిడ్-19లో ఎన్నికల నిర్వహణ, సవాళ్లు, సమస్యలు, నియమావళి: దేశం అనుభవాలు’ అన్న ఇతివృత్తంతో 2020 సెప్టెంబరు 21న ఈ వెబినార్ జరిగింది. కోవిడ్-19 కాలంలో ఎన్నికల నిర్వహణా అనుభవాలను పంచుకునేందుకు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ కలసి రావడానికి ఒక సందర్భంగా వెబినార్ నిలిచింది.
రెండేళ్ల గడువు (2019-21) తో ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం- ఎ-వెబ్ (ఎ-డబ్ల్యు.ఇ.బి.) సారథ్యాన్ని 2019, సెప్టెంబరు 3వ తేదీన భారత్ స్వీకరించిన విషయం ఇక్కడ గమనార్హం. బెంగుళూరులో జరిగిన ఎ-వెబ్ 4వ సర్వసభ్య సమావేశంలో భారత్ ఈ బాధ్యతను స్వీకరించింది. ఎ-వెబ్ అధ్యక్ష హోదాలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెబినార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలా? వద్దా? ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి? అనే విషయమై ప్రపంచంలోని ఎన్నికల సంఘాలన్నీ "క్లిష్ట పరిస్థితి"ని ఎదుర్కొంటున్నాయని అన్నారు.
కోవిడ్ వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రతి దేశం పరిస్థితి విభిన్నంగా ఉందని, అందుకే కరోనా వ్యాప్తి, దాని ప్రవర్తనా తీరును, పతాక స్థాయిలో అది చూపుతున్న ప్రభావాన్ని బట్టి ఏ దేశానికాదేశం ప్రతిస్పందిస్తూ వచ్చాయని అన్నారు. దక్షిణ కొరియా, మలవాయ్, తైవాన్, మంగోలియా తదితర దేశాలు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లాయని, ఎన్నికలు నిర్వహిస్తూనే, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు అవసరమైన ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపట్టాయని అరోరా చెప్పారు. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలుగా పరిణమించిందని, భారీ సంఖ్యలో ఓటర్లు, భౌగోళిక విస్తృతి, వాతావరణ పరిస్థితుల్లో విభిన్నత్వం ఇందుకు కారణాలన్నారు. రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల స్థాయిని గురించి ఆయన వివరంగా ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.29కోట్లని అన్నారు.
ఎన్నికలపై కోవిడ్-19 వైరస్ ప్రభావాన్ని గురించి అరోరా వివరించారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఏర్పడిన విభిన్న పరిస్థితుల్లో ప్రత్యేక అవసరాలు, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలతో ఎన్నికల కమిషన్ ప్రస్తుత నిబంధనలను పూర్తిగా సవరించుకోవలసి ఉంటుందన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకునే వోటర్ల గరిష్ట సంఖ్య 1500నుంచి వెయ్యికి తగ్గిందని, అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 65 వేలనుంచి లక్షకు అంటే, 40శాతం పెరిగిందని అన్నారు. దీనితో నిర్వహణా పద్ధతులు, మానవ వనరుల వినియోగంలో మార్పులు కూడా భారీ స్థాయిలో ఉండవచ్చన్నారు. బీహార్ ను సందర్శించే అంశంపై ఎన్నికల కమిషన్ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా వయోజనులకు, మహిళలకు, వికలాంగులకు తగిన సదుపాయాలు కల్పించడానికి కమిషన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, కోవిడ్ పాజిటివ్ వోటర్లు, క్వారంటైన్ లో ఉంటున్న వారూ కూడా తమ వోటు వేసేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 2019 డిసెంబరులో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను, 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను సునీల్ అరోరా ప్రస్తావించారు. అప్పట్లో 80ఏళ్లు దాటిన వోటర్లకు, వికలాంగులకు, కొన్ని ప్రత్యేక నిత్యావసర విధుల్లో ఉండే వారికి పోస్టల్ బ్యాలట్ సదుపాయాన్ని కల్పించినట్టు చెప్పారు. ప్రస్తుతం క్వారంటైన్లో లేదా ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ పాజిటివ్ బాధితులకు కూడా పోస్టల్ బ్యాలట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు.
కోవిడ్ కాలంలో ఎన్నికల నిర్వహణకోసం రూపొందించుకున్న ప్రత్యేకమైన, సవివరమైన మార్గదర్శక సూత్రాలను సునీల్ అరోరా ప్రస్తావించారు. 2020 జూన్ నెలలో రాజ్యసభలోని 18 స్థానాలకు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని కూడా గుర్తు చేశారు. 2021వ సంవత్సరం తొలి ఆరునెలల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.
2019 సెప్టెంబరులో బెంగుళూరులో ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం (ఎ-వెబ్) సర్వసభ్య సమావేశం జరిగిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఎ-వెబ్ అధ్యక్ష హోదాలో భారత్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వెబినార్ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విడుదలవుతున్న రెండు ప్రచురణలను గురించి ఆయన ప్రస్తావించారు. ‘ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం సభ్యులు, భాగస్వామ్య సంఘాల వివరాలు’, ‘కోవిడ్-19, అంతర్జాతీయ ఎన్నికల అనుభవాలు’ అనే శీర్షికలతో రెండు ప్రచురణలు విడుదలవుతున్నట్టు చెప్పారు. పరిశోధకులకు, ఎన్నికల నిర్వాహకులకు ఈ రెండు ప్రచురణలూ, మంచి ఉపకరణాలవుతాయన్నారు. ఎ-వెబ్ భారతీయ కేంద్రమైన ఎ-వెబ్ ఇండియా సెంటర్ కూడా గణనీయమైన ప్రగతి సాధించిందని,..“ ఎన్నికలపై ఎ-వెబ్ జర్నల్’ పేరిట ఒక సమాచార పత్రికను ఇండియా సెంటర్ వెలువరించబోతోందని చెప్పారు. తొలి సంచిక 2021వ సంవత్సరం మార్చిలో విడుదలవుతుందన్నారు..
45దేశాలకు చెందిన 120మంది ప్రతినిధులు ఈ వెబినార్ లో పాలుపంచుకున్నారు. అంగోలా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బోస్నియా-హెగ్జెగోవినా, బోట్స్వానా, బ్రెజిల్, కంబోడియా, కేమరూన్, కొలంబియా, కాంగో డెమెక్రటిక్ రిపబ్లిక్, డొమినికా, ఎల్ సాల్వడార్, ఇతియోపియా, ఫిజీ, జార్జియా, ఇండోనేసియా, జోర్డాన్, కజకిస్తాన్, కొరియా రిపబ్లిక్, కీర్గిజ్ రిపబ్లిక్, లైబీరియా, మలవాయ్, మాల్దీవులు, మోల్డోవా, మంగోలియా, మొజాంబిక్, నైజీరియా, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, రుమేనియా, రష్యా, సావో టోమ్-ప్రిన్సిపే, సోలోమన్ దీవులు, సియారా లియోన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూరినామ్, స్వీడన్, తైవాన్, టోంగా, టర్కీ, ఉజ్బెకిస్తాన్, జాంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు వెబినార్ లో పాల్గొన్నారు. అలాగే నాలుగు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా వెబినార్ లో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య, ఎన్నికల సహాయక సంస్థ (ఇంటర్నేషనల్ ఐ.డి.ఇ.ఎ.), అంతర్జాతీయ ఎన్నికల ఫౌండేషన్ వ్యవస్థ (ఐ.ఎఫ్.ఇ.ఎస్.), ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం (ఎవెబ్-ఎ.డబ్లు.ఇ.బి.), యూరప్ ఎన్నికల కేంద్రం ప్రతినిధులు కూడా వెబినార్ లో పాల్గొన్నారు.
ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం లేదా ఎ-వెబ్ అనేది,.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నికల నిర్వహణా సంస్థలతో (ఇ.ఎం.బి.లతో) కూడిన అతిపెద్ద సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థలో 115 ఎన్నికల నిర్వహణా సంస్థలు, 16 ప్రాంతీయ సంఘాలు, సంస్థలు, అసోసియేట్ సభ్యులు ఉన్నారు. ఎ-వెబ్ రూపకల్పన, ఏర్పాటు ప్రక్రియ తదితర అంశాలపై భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ.) 2011-12వ సంవత్సరం నుంచి చాలా సన్నిహితంగా చొరవతో వ్యవహరిస్తూ వస్తోంది.
***
(Release ID: 1657591)
Visitor Counter : 210