ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్ -19పై పోరాటానికి 'అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీకి రూ.15,000 కోట్లు'

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కేటాయింపు

జాతీయ, రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ప్రయోగాలకు అధిక నిధులు

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు

Posted On: 22 APR 2020 3:45PM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌పై పోరాటానికి భారీగా నిధులు విడుదలకు ఆమోదం తెలుపుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత కొవిడ్ -19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీకి రూ.15,000 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని మూడు దశల్లో ఖర్చు చేస్తారు. కొవిడ్‌-19 అత్యవసర సన్నద్ధతకు రూ.7,774 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని మిషన్‌ మోడ్‌ విధానంలో 1-4 సంవత్సరాల మధ్యకాలిక మద్దతుగా వినియోగిస్తారు. 

కొవిడ్-19 కేసుల వృద్ధిని తగ్గించడం, పరిమితం చేయడమే లక్ష్యం
ఈ నిధుల విడుదల లక్ష్యం భారతదేశంలో కొవిడ్‌ కేసులను తగ్గించడం, వాటిని పరిమితం చేసే దిశలో అత్యవసర వైద్య ప్రతిస్పందనను పెంచడం. వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత మెరుగుపరచడం, కొవిడ్‌ చికిత్స విధానాలు, అవసరమైన వైద్య పరికరాల సేకరణ, వైరస్‌ సోకిన రోగులకు అవసరమైన ఔషధాల సేకరణను కేంద్రీకృతం చేయడం, భవిష్యత్‌లో వ్యాధులు విజృంభించకుండా నివారించడానికి జాతీయ, రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రయోగశాలల ఏర్పాటు మరియు నిఘా, బయో-సెక్యూరిటీ సంసిద్ధత, వ్యాధుల పరిశోధన సంస్థలను ముందస్తుగా భాగస్వాములను చేయడం మరియు రిస్క్ కమ్యూనికేషన్ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాలన్నీ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతాయి. 


13 లక్షల వైరస్‌ నిర్ధరణ కిట్లను సేకరించేందుకు ఆదేశాలు
మొదటి దశ కింద, ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కొవిడ్‌ డెడికేటెడ్‌ ఆస్పత్రులు, డెడికేటెడ్‌ కొవిడ్ ఆరోగ్య కేంద్రాలు, డెడికేటెడ్‌ కొవిడ్ సంరక్షణ కేంద్రాల బలోపేతానికి రూ.3,000 కోట్లు అదనంగా ఇప్పటికే మంజూరు చేసింది. క్వారంటైన్‌, ఐసోలేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, వ్యాధి నిరోధకత, సామాజిక దూరం మరియు నిఘా కోసం వివరణాత్మక మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌లు, సలహాలను అందించింది. హాట్‌స్పాట్లను గుర్తించి తగిన నియంత్రణ వ్యూహాలను అమలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను విస్తరించారు. పరీక్షల సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోంది.  జాతీయ టీబీ నిర్మూలన పథకం కింద ప్రస్తుతమున్న మల్టీ టెస్టింగ్ ఫ్లాట్‌ఫామ్‌లపై కొవిడ్‌-19 పరీక్షలను పెంచడానికి 13 లక్షల వైరస్‌ నిర్ధరణ కిట్లను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ పథకం కింద ఆశా వర్కర్లు సహా కొవిడ్‌-19 విధుల్లో ఉన్న అందరు ఆరోగ్య సిబ్బందికి బీమా కల్పించారు. వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE),  N95 మాస్కులు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ కిట్లు, చికిత్స కోసం మందులు సేకరిస్తున్నారు.

కొవిడ్ విషయంలో బలమైన అత్యవసర స్పందనతోపాటు జాతీయ, రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థలు, వ్యాధుల పరిశోధనలు, బహుళ రంగ జాతీయ సంస్థలు, ఒన్‌ హెల్త్‌ ఫ్లాట్‌ఫామ్‌లు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, రిస్క్ కమ్యూనికేషన్స్, అమలు, కార్యనిర్వహణ, సామర్థ్యం పెంపు, పర్యవేక్షణ, మూల్యాంకన సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నిధులను ప్రధానంగా ఖర్చు చేస్తారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీలోని వివిధ విభాగాల విషయంలో, అమలు చేసే సంస్థలకు (జాతీయ ఆరోగ్య మిషన్‌, సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌, రైల్వేలు, ఆరోగ్య పరిశోధన డిపార్టుమెంటు/ICMR, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం‌) వనరుల విషయంలో మార్పులు చేయడానికి  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అధికారం ఉంది. 



(Release ID: 1617232) Visitor Counter : 137