ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎన్ సి డి సి నియంత్రణ కేంద్రం సందర్శన

గట్టి సామాజిక పర్యవేక్షణ మరియు పరిచితులు, సంబంధికుల గుర్తింపునకు ఉద్ఘాటన

Posted On: 24 MAR 2020 2:07PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంగళవారం జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సి డి సి) కంట్రోలు రూమ్ మరియు ప్రయోగ శాలలను సందర్శించి దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ ఎస్. కె. సింగ్ మరియు ఇతర సీనియర్ అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు  ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

సాంక్రమిక వ్యాధుల అధ్యయనం మరియు రోగ నిర్ధారణ సాధనాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఏవైనా కేసులు బయటపడినప్పుడు పరీక్షలు జరపడంలో ముందు ఉంటున్నది. ఎన్ సి డి సి ఏర్పాటు చేసిన కోవిడ్ -19 హెల్ప్ లైన్ ప్రజారోగ్య నిఘా, నిర్వహణ, సాంకేతిక సలహాలు/నిర్దేశకత్వం, ప్రయోగశాల మద్దతు ద్వారా ఈ వ్యాధిని గురించి ప్రజలకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తున్నందుకు ఆయన  వారిని అభినందించారు.

ఆయన ఎన్ సి డి సి కంట్రోలు రూమ్ సందర్శించి అక్కడ పనిచేస్తున్న వారితో ముచ్చటించి వారి పనితీరును ప్రజల ప్రశ్నలకు వారు స్పందిస్తున్న తీరును చూశారు. కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ సిబ్బంది, పరీక్షలు పరిశోధనలు జరిపే శాస్త్రజ్ఞుల పనిని ఆయన అభినందించారు.  “ఇప్పుడు దేశం చేస్తున్న యుద్ధంలో ముందుంది మీరు ప్రాణాలకు వెరవక పోరాడుతున్న యోధులు” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.  “విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ప్రయోగాలు చేస్తున్న శాస్త్రజ్ఞులకు నా వందనాలు” అని కూడా ఆయన అన్నారు.

కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి రోజు రెండు లక్షలకు పైగా ఫోన్ కాల్స్ కు సమాధానం ఇస్తారు. దాదాపు 52,000 మెయిల్స్ కు బదులిస్తారు.

అంకిత భావంతో, నిజాయితీతో పనిచేస్తున్న నిఘా అధికారులను కూడా మంత్రి ప్రశంసించారు.  ఈ పోరాటాన్ని ద్విగుణీకృత ఉత్సాహంతో కొనసాగించాలని ఆయన వారిని ప్రోత్సహించారు.

జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారులతో కోవిడ్ -19 గురించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా  సమీక్ష సందర్బంగా గట్టి సామాజిక పర్యవేక్షణ మరియు పరిచితులు, సంబంధికుల గుర్తింపునకు చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.  వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడమే కాక వయోవృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

భారత పౌరులు ప్రభుత్వ అధికారులతో సహకరించి  కోవిడ్ -19 గురించి  కేవలం విశ్వసనీయ సమాచారం మాత్రమే ఇతరులతో పంచుకోవాలని, అపార్ధాలను, వదంతులను అణచివేయాలని డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకు దేశం మొత్తం మీద 1,87,904 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉండగా దాదాపు 35,073 మంది 28 రోజుల పరిశీలన పూర్తి చేశారు. ఇప్పటివరకు దేశంలో పరీక్షించిన 12872 నమూనాలలో 2023 నమూనాలను ఎన్ సి డి సి లో పరీక్షించడం జరిగింది.  వాటిలో 52 కేసులు కోవిడ్ -19 పాజిటివ్ కేసులుగా తేలాయి.

*****

 



(Release ID: 1608221) Visitor Counter : 149


Read this release in: English , Hindi , Bengali