PIB Headquarters
ప్రైవేటు రంగం కన్నా మరింత ఎక్కువ సామర్థ్యం మాకుంది: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి. ఉదయ్ భాస్కర్
దేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దడం లో మిధాని ముఖ్య పాత్రను పోషించింది: మిధాని సిఎమ్డి డాక్టర్ దినేశ్ కుమార్ లిఖి
Posted On:
22 JUN 2018 6:44PM by PIB Hyderabad
వ్యూహాత్మకమైన సామగ్రికి మిధాని ఒక గని గా ఉంది. అంతే కాకుండా ఇది దేశం లోని అన్ని ముఖ్యమైన రంగాలకు వ్యూహాత్మక సామగ్రిని అందిస్తోందని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి. ఉదయ్ భాస్కర్ అన్నారు. ‘45 సంవత్సరాల విఖ్యాత భాగస్వామ్యం’ అనే ఇతివృత్తంతో మిధాని హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన ‘వినియోగదారుల సమావేశం: 2018’ కార్యక్రమంలో శ్రీ వి. ఉదయ్ భాస్కర్ ప్రసంగించారు.
మిధాని సేవలను, మరీ ముఖ్యంగా క్షిపణుల రంగంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఎటిజిఎమ్) శకం నుండి సమకాలీన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎల్ఆర్ఎస్ఎఎమ్) వరకు చూస్తే డిఆర్డిఒ, ఇంకా బిడిఎల్ ల అనుబంధంతో మిధాని అందించిన తోడ్పాటు ను ఆయన సగర్వంగా గుర్తుకు తెచ్చారు. మారుతున్న భద్రత సంబంధ వాతావరణం మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధ అవసరాలను గురించి ఆయన ఏకరువు పెడుతూ, అన్ని సవాళ్ళకు తట్టుకొని నిలచే శక్తి సామర్ధ్యాలతో పాటు దేశం అవసరాలకు తగ్గట్టుగా లోహ శోధన శాస్త్ర సంబంధ అత్యుత్తమ సేవలను అందించే శక్తి సామర్ధ్యాలు మిధాని కి ఉన్నాయంటూ ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వివిధ సంస్థలను మరియు పిఎస్యు లను ఒక చోటుకు చేర్చి, ప్రైవేటు రంగం యొక్క ముప్పును ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా కృషి చేయడంలో మిధాని సిఎండి డాక్టర్ దినేశ్ కుమార్ లిఖి చొరవ తీసుకొని చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా తయారీ విభాగం యొక్క వినియోగదారు సంస్థలతో సమన్వయాన్ని పెంచుకొంటూ, ఆర్డర్ ల పురోగతిని పర్యవేక్షించేందుకు రిమోట్ యాక్సస్ ను సమకూర్చుకోవలసిన అవసరం చాలా కాలం కిందటి నుంచే ఉందని చెబుతూ, ఈ విషయంలో ఒక ‘కస్టమర్ సర్వీస్ పోర్టల్’ ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వి. ఉదయ్ భాస్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిధాని చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ లిఖి మాట్లాడుతూ, వినియోగదారులకు మరియు నూతన వస్తు సామగ్రి అభివృద్ధి దిశగా మిధాని యొక్క సుదృఢమైన నిబద్ధతను గురించి చెప్పుకొచ్చారు. వైడ్ ప్లేట్ మిల్ అనే బృహత్ పథకానికి భూమి పూజ తో పాటు రోహ్తక్ లో గల ఐఎమ్టి లో ఆర్మరింగ్ యూనిట్ తో పాటు కొత్తగా అమలు చేస్తున్న పథకాలను కలుపుకొని ఆధునికీకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు సభకు హాజరైన వారి దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ‘మేక్ టు స్టాక్’ (నిల్వ ఉంచడం కోసం తయారు చేయడం) అనే సాంప్రదాయక పని విధానం నుండి మరింత చొరవతో కూడిన ‘మేక్ ఫర్ యాంటిసిపేటెడ్ ఆర్డర్’ (సంభవనీయమైన ఆర్డర్ల కోసం తయారు చేయడం) విధానానికి మిధాని వ్యూహాత్మకంగా మళ్ళినట్లు ఆయన వివరించడంతో వినియోగదారులు ప్రశంసా పూర్వకంగా హర్షధ్వానాలు చేశారు.
పరిశోధన, అభివృద్ధి, తయారీ మరియు కీలకమైన మిశ్రిత లోహాల సరఫరా రంగాలతో పాటు, దేశ భద్రత మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన రంగాలలో స్వయం సమృద్ధి కోసం దేశానికి మిధాని సేవలను అందించడంతో పాటు ముఖ్యమైన భూమిక ను పోషించింది. ప్రస్తుతం భారతదేశం లో వాణిజ్య సరళి వినియోగం కోసం - నికెల్-టైటానియమ్ షేప్ మెమరీ అలాయ్ స్ ను దేశీయంగా తయారు చేసే ప్రక్రియను చేపట్టడం లేదని, ఈ కారణంగా పూర్తిగా దిగుమతులపై ఆధారపడ్డామని మిధాని సిఎమ్డి శ్రీ దినేశ్ కుమార్ లిఖి అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కాన్ పుర్ కు చెందిన ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ జిఎమ్ శ్రీ శైలేంద్ర నాథ్, హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సిఇఒ శ్రీ దినేశ్ శ్రీవాత్సవ లతో పాటు న్యూ ఢిల్లీ కి చెందిన సశస్త్ర సీమా బల్ యొక్క ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ.కె. నేగి లు వారి వారి ప్రాజెక్టుల విషయంలో మిధాని అందిస్తున్నటువంటి కీలకమైన అండదండలను అభినందిస్తూ ప్రసంగించారు.
దేశీయంగా ఉత్పత్తి చేయడంలోను, జాతీయ భద్రతకు అవసరమయ్యే సామగ్రిని తయారు చేయడంలోను మిధానికి చెందిన సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ఉన్నతాధికారులు హర్షించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, వ్యూహాత్మక రంగాలకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రక్షణ/పోలీసు తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
***
(Release ID: 1536334)
Visitor Counter : 98