ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘‘ఎండ్ టిబి’’ సమిట్ శిఖర సమ్మేళనం ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
13 MAR 2018 3:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ‘‘ఎండ్ టిబి’’ శిఖర సమ్మేళనం ప్రారంభ సదస్సులో ప్రసంగించారు.
క్షయవ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించడంలో ది ఢిల్లీ ఎండ్ టిబి సమిట్ ఒక మైలురాయి వంటి కార్యక్రమం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని అంతమొందించే దిశగా వేసే ప్రతి అడుగూ పేదల జీవితాలను మెరుగుపరచడంతో కూడాను ముడి పడి ఉంటుంది అని ఆయన అన్నారు.
క్షయవ్యాధిని 2030వ సంవత్సరం కల్లా నిర్మూలించాలని ప్రపంచం లక్ష్యంగా పెట్టుకొందని, అయితే భారతదేశం మాత్రం 2025వ సంవత్సరానికే ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకొందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం సమగ్ర కృషిని చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన పాత్ర ఉందని, మరి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రులు అందరికీ స్వయంగా తాను లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
క్షయవ్యాధిని పారదోలే పనిలో ముందు వరుసలో ఉండే టిబి వైద్యులు మరియు కార్యకర్తలు ఒక కీలకమైన పాత్రను పోషించాలని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఈ వ్యాధిని అధిగమించిన రోగులు ఇతరులకు ప్రేరణగా కూడా నిలుస్తారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాల దిశగా పయనించడంలో ఎంత వేగంగా వెళుతోందీ చాటి చెప్పేందుకు ప్రధాన మంత్రి ‘స్వచ్ఛ్ భారత్’ మరియు ‘మిషన్ ఇంద్రధనుష్’ లను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
***
(Release ID: 1524246)
Visitor Counter : 132