మంత్రిమండలి
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఒ) ‘‘ఎంప్లాయ్ మెంట్ అండ్ డీసెంట్ వర్క్ ఫర్ర పీస్ అండ్ రెజిలియన్స్ (నం.- 205)’’కు సంబంధించి రూపొందించిన నూతన పత్రాన్ని పార్లమెంటు ముందు ఉంచేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
07 FEB 2018 8:18PM by PIB Hyderabad
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఒ) ‘‘ఎంప్లాయ్ మెంట్ అండ్ డీసెంట్ వర్క్ ఫర్ర పీస్ అండ్ రెజిలియన్స్ (నం.- 205)’’కు సంబంధించి రూపొందించిన నూతన పత్రాన్ని పార్లమెంటు ముందు ఉంచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐఎల్ఒ 2015 జూన్ లో జెనీవా లో నిర్వహించిన 106 వ సదస్సు లో ఈ సిఫారసు లను ఆమోదించింది. ఈ సిఫారసులకు భారతదేశం మద్దతు పలికింది.
ఐఎల్ఒ లో సభ్యత్వం కలిగివున్న ప్రతి దేశం ఈ సిఫారసులను తమ దేశానికి సంబంధించిన సమర్ధాధికార వ్యవస్థ ముందు ఉంచాలి. మన దేశంలో దీనిని పార్లమెంటు ముందు ఉంచాలి. అయితే పార్లమెంటుకు సమాచారం తెలిపేందుకు ఈ సిఫారసులను పార్లమెంటు ముందు ఉంచినంత మాత్రాన తక్షణం దీనిని చేపట్టాలన్నదేమీ లేదు. ఐఎల్ఒ సిఫారసు సభ్యత్వ దేశాలు తప్పకుండా అమలు చేయాల్సిన పత్రమేమీ కాదు. ఇది ఆయా దేశాల జాతీయ విధాన రూపకల్పన ప్రక్రియలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఉద్దేశించినటువంటిది.
ఘర్షణలు, విపత్తుల కారణంగా ఏర్పడే సంక్షోభ సమయంలో ఘర్షణల నివారణ, శాంతిస్థాపన, తిరిగి కోలుకునే పరిస్థితులు నెలకొనేలా చేయడం, ఉత్సాహపూరిత పరిస్థితులు నెలకొనేటట్టు మంచి పని పరిస్థితులు, ఉపాధి కల్పనకు తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ సిఫారసులు మార్గదర్శకంగా నిలుస్తాయి.
అలాగే ఇది అన్నిరకాల మానవ హక్కులు, చట్టబద్ధ పాలన, ప్రాథమిక సూత్రాలు, పని ప్రదేశంలో హక్కులు, ఉపాధి, మంచి పని పరిస్థితులకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాల పట్ల గౌరవం చూపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది.
సంక్షోభ పరిస్థితులు ఏర్పడకుండా చూడడంలో భాగంగా సామాజిక రక్షణ చర్యలను బలోపేతం చేసే దిశగా, తిరిగి కోలుకునే, విపత్తుల నుండి తట్టుకునే పరిస్థితులను తీసుకురావలసిన అవసరాన్ని ఈ సిఫారసులు తెలియజేస్తున్నాయి. సంక్షోభ పరిస్థితులు నెలకొనకుండా చూడడం, శాంతియుత పరిస్థితులను ప్రోత్సహించడం, తిరిగి మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడడం వంటి చర్యలను సభ్యత్వ దేశాలు దశలవారీగా, బహుముఖంగా చేపట్టాలని ఈ సిఫారసులు సూచిస్తున్నాయి. ఈ విధానంలో స్థానిక ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేటట్టు చేయడం, ఉపాధి కల్పించడం, తగిన పని పరిస్థితులను కల్పించడం, సామాజిక, ఆర్థిక సమీకృత చర్యలు, సామాజిక భద్రత, సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుపోవడం, సుస్థిర అభివృద్ధి, సుస్థిర వాణిజ్య అవకాశాలను కల్పించడం (ప్రత్యేకించి చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు), సంప్రదింపులకు వీలు కల్పించడం, తిరిగి కోలుకుని హుషారుగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళిక, అమలు, పర్యవేక్షణకు సంబంధించిన చర్యల అమలులో ఉద్యోగులు, కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించడం వంటివి ఉంటాయి.
ఐఎల్ ఒ చేసిన 205 నంబరు సిఫారసులు కార్మికులకు, ఉపాధి కోరుకునే వారందరికీ వర్తిస్తాయి. అలాగే ఘర్షణలు, విపత్తుల కారణంగా తలెత్తే సంక్షోభ పరిస్థితులు సంబంధించి ఆర్థిక వ్యవస్థ లోని అన్ని రంగాల యజమానులకు, విపత్తు ప్రతిస్పందనలో పని చేసే కార్మికులకు, తక్షణ ప్రతిస్పందన వ్యవస్థలో పనిచేసే వారికీ వర్తిస్తాయి.
***
(Release ID: 1519967)
Visitor Counter : 50