సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర: ఆశిష్ సాంగ్వాన్

నషా ముక్త్ భారత్ అభియాన్, సైబర్ సెక్యూరిటీపై వార్తలాప్ మీడియా వర్క్‌షాప్‌

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 3:10PM by PIB Hyderabad

ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్ అన్నారు.

 

కామారెడ్డిలో నిర్వహించిన ‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం, అవగాహనా సందేశాలను విస్తృత ప్రజానీకానికి చేరవేయడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్, మీడియా ఔట్‌రీచ్‌ ఎంతో ముఖ్యమని అన్నారు.

 

ఈ వర్క్‌షాప్‌లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’, ‘సైబర్ సెక్యూరిటీ’ అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి.

నషా ముక్త్ భారత్ అభియాన్ పై ఈగల్ ఫోర్స్ డీఎస్పీ శ్రీ సోమనాథం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. యువత, కుటుంబాలు, సమాజంలోని వివిధ వర్గాలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించగలదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ముకుంద్ రెడ్డి అన్నారు.

రెండవ అంశమైన సైబర్ సెక్యూరిటీపై సీ-డాక్ సీనియర్ సైంటిస్ట్ శ్రీ జగదీష్ బాబు మాట్లాడుతూ, సైబర్ ముప్పులు, ఆన్‌లైన్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించేటప్పుడు సురక్షితమైన పద్ధతులను పాటించాలని సూచించారు.

ప్రారంభోపన్యాసంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మనస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, టియర్-2, టియర్-3 నగరాల్లోని ప్రజలకు చేరువ కావడం, ముఖ్యమైన అంశాలపై ప్రజలను మీడియా ద్వారా చైతన్యపరచడం లక్ష్యంగా సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ ఎన్.వై. గిరి, పీఐబీ మీడియా & కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీ శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు.

‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ లో మీడియా ప్రతినిధులు, సంబంధిత వర్గాలు పాల్గొని ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహనా సందేశాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే అంశాలపై కూడా చర్చ జరిగింది.

***


(రిలీజ్ ఐడి: 2310824) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English