సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్థిక అభద్రత నుంచి శాస్త్రీయ పరిశోధన దాకా: మల్లెల పృథ్వీ రాజు సాధికారతకు ఎన్ఎఫ్ఎస్సీ మద్దతు
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 6:44PM by PIB Hyderabad
ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం స్థిరమైన ఆర్థిక సహాయం లేకుండా ఉన్నత విద్యను, పరిశోధనను కొనసాగించడం కష్టమవుతుంది. సకాలంలో అందే ఫెలోషిప్ సహాయం... విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి, వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి అవసరమైన స్థిరత్వాన్నీ అందించగలదు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్సీ) పథకం కింద లభించిన మద్దతు ప్రభావాన్ని ప్రదర్శిస్తూ... ఎస్సీ-III సామాజిక వర్గానికి చెందిన 34 ఏళ్ల పరిశోధకుడు శ్రీ మల్లెల పృథ్వీ రాజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తన పీహెచ్డీని పూర్తి చేయడంతో పాటు, శాస్త్రీయ పరిశోధన రంగంలో తన వృత్తి జీవితంలో ముందుకు వెళుతున్నారు.
నిరుపేద ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన శ్రీ రాజు, తన చదువును కొనసాగించడంలో సహాయపడటానికి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన విద్యా ప్రస్థానంలో నెలవారీ, ఆరు నెలలవారీ ఫెలోషిప్ ప్రక్రియకు అవసరమైన సంతకాల కోసం ప్రయత్నిస్తున్న సందర్భాల్లోనూ విశ్వవిద్యాలయ అధికారుల నుంచి పరిపాలనాపరమైన జాప్యాలు, వివక్షనూ ఎదుర్కొన్నారు.
ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రీ రాజు తన విద్యా, వృత్తిపరమైన లక్ష్యాల పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకుసాగారు. ఆయన ఒక పరిశోధన శాస్త్రవేత్తగా విజయవంతమైన వృత్తిని నిర్మించుకోవాలనే ఆకాంక్షతో, శాస్త్రీయ పదవుల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు.
శ్రీ రాజు డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2024 వరకు ఎన్ఎఫ్ఎస్సీ పథకం కింద ఫెలోషిప్ సహాయం పొందారు. ఈ సహాయంలో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దశలో నెలకు రూ. 37,000, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దశలో నెలకు రూ. 42,000 అందుకున్నారు.
ఆ ఫెలోషిప్ ఆయనకు ఏకైక ఆర్థిక ఆసరాగా మారింది. అది అతని విద్య, పరిశోధన, ప్రాథమిక జీవన వ్యయాలకు సాయపడుతూ... ఆయన పరిస్థితులను సంపూర్ణ ఆర్థిక అభద్రత నుంచి సుస్థిరమైన ఆర్థిక స్వాతంత్య్రానికి మార్చివేసింది.
ఈ మద్దతుతోనే శ్రీ రాజు తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, పరిశోధనపై దృష్టి సారించారు. తన పీహెచ్డీనీ విజయవంతంగా పూర్తి చేయగలిగారు.
శ్రీ రాజు ప్రస్తుతం హెచ్సీయూలో ప్రాజెక్ట్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. శాస్త్రీయ పదవుల కోసం సన్నద్ధమవుతూనే... పూర్తికాల పరిశోధనా శాస్త్రవేత్తగా స్థిరపడాలనే తన దీర్ఘకాలిక ఆకాంక్ష దిశగా ఆయన పురోగమిస్తున్నారు.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కాలాన్ని విద్యాపరమైన విజయం, వృత్తిపరమైన పురోగతి సాధించే కాలంగా మార్చడంలో ఎన్ఎఫ్ఎస్సీ పథకం ఆయనకు ఎంతగానో సహాయపడింది. ఈ ఫెలోషిప్, తన పరిశోధనా ఆశయాలను వదులుకోకుండానే ఆయన తన ఉన్నత విద్యను పూర్తి చేసేందుకూ వీలు కల్పించింది.
చదువు పట్ల ఆయనకు గల పట్టుదల మూడు పరిశోధనా పత్రాల ప్రచురణకూ దోహదపడింది. ఇది శాస్త్రీయ పరిశోధనతో ఆయన నిరంతర అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రచురితమైన పత్రాలు కింది లింకుల్లో అందుబాటులో ఉన్నాయి:
1. https://doi.org/10.1007/s11356-023-27100-3.
2. https://www.frontiersin.org/journals/marine-science/articles/10.3389/fmars.2025.1604055.
3. https://doi.org/10.1007/s10661-025-14670-7.
ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులు నిరంతర ఫెలోషిప్ సహాయం ద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి, డాక్టరేట్ పరిశోధనను పూర్తి చేయడం సహా, విజ్ఞాన శాస్త్ర రంగంలో తమ వృత్తి జీవితంలోనూ పురోగమించగలరని శ్రీ రాజు ప్రయాణం నిరూపిస్తుంది.
ఫెలోషిప్ ప్రభావం గురించి శ్రీ రాజు ఇలా అన్నారు...
నేను నిరుపేద ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చాను. ఈ ఫెలోషిప్ నాకు ఉన్న ఏకైక ఆశాకిరణం. ఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, నా పీహెచ్డీని విజయవంతంగా పూర్తి చేయడంతో సహా, ప్రస్తుత ప్రాజెక్ట్ సైంటిస్ట్ బాధ్యతలు చేపట్టేందుకూ వీలు కల్పించింది.
ఆయన పట్టుదల, ఎన్ఎఫ్ఎస్సీ పథకం కింద లభించిన మద్దతుతో శ్రీ మల్లెల పృథ్వీ రాజు... ఆర్థిక అభద్రత నుంచి డాక్టరేట్ సాధించడం, శాస్త్రీయ పరిశోధనలో కీలక బాధ్యతలు చేపట్టడం వరకు పురోగమించారు. పరిశోధనా ఆకాంక్షలను బలోపేతం చేయడంలోనూ, వృత్తిపరమైన అవకాశాలను విస్తరించడంలోనూ విద్యాసంబంధిత మద్దతు పోషించే కీలక పాత్రను ఆయన ప్రయాణం ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2305847)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9