సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
టెలికాం, బ్రాడ్కాస్టింగ్, విమానాశ్రయ, సైబర్ రంగాల్లో నిపుణుల ద్వారా సకాలంలో వివాద పరిష్కారానికి పిలుపునిచ్చిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
నిర్దేశిత నిర్ణయాధికారుల ద్వారా రూ.5 కోట్ల వరకు సైబర్ వివాదాల పరిష్కారం... టీడీశాట్ ద్వారా అప్పీలుకు అవకాశం: జస్టిస్ డీ.ఎన్. పటేల్
నాడు పోస్టు చేయడమైనది:
22 AUG 2026 2:06PM by PIB Hyderabad
టెలికాం, బ్రాడ్కాస్టింగ్, విమానాశ్రయ సుంకాలు, సైబర్ సాంకేతికతల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సమర్థవంతంగా, సకాలంలో, ప్రత్యేక విధానాల ద్వారా వివాదాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలియజేశారు.
"విమానాశ్రయ సుంకాలు, టెలికాం, బ్రాడ్కాస్టింగ్, సైబర్ రంగాల్లో వివాదాల పరిష్కార విధానాలు" అంశంపై నిర్వహించిన సదస్సునుద్దేశించి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూ.. సాంకేతికంగా క్లిష్టమైన నియంత్రణ వివాదాలను ఎదుర్కోవటంలో ప్రత్యేక న్యాయ నిర్ణేత సంస్థలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను వెల్లడించారు.

టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రత్యేక వివాద పరిష్కార విధాన పరిణామ క్రమాన్ని వివరిస్తూ... టెలికాం రంగంలో సరళీకరణ, ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో నూతన నియంత్రణ, న్యాయ నిర్ణయ విధానాల ఆవశ్యకత ఏర్పడిందని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 2000 సంవత్సరంలో టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలు ట్రిబ్యునల్ (టీడీశాట్) ఏర్పాటు ఈ పరిణామ క్రమంలో కీలకంగా నిలిచాయని చెప్పారు.
టీడీశాట్ పరిధి కేవలం టెలీకమ్యూనికేషన్స్కే పరిమితం కాకుండా.. బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్, విమానాశ్రయ సుంకాల వ్యవహారాల వంటి రంగాలకు కూడా విస్తరించిందన్నారు. విషయ నైపుణ్యాన్ని, న్యాయ ప్రక్రియలను ఒకచోట చేర్చటం ద్వారా సాంకేతికంగా క్లిష్టమైన నియంత్రణ వివాదాలను పరిష్కరించటంలో ప్రత్యేక ట్రిబ్యునళ్లు కీలక వేదికలుగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ట్రిబ్యునళ్ల పాలనకు సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ... ప్రత్యేక విచారణ విధానాలు చట్టబద్ధమైన పాలన పరిధిలోనే పనిచేయాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఎల్. చంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉటంకిస్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టులు నిర్వహించే న్యాయ సమీక్ష భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లు న్యాయవ్యవస్థకు సహాయకారిగా పనిచేస్తూనే, రాజ్యాంగపరంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.
న్యాయ నిర్ణయాధికార సంస్థలు... నియంత్రణ స్వయంప్రతిపత్తి, ప్రత్యేక నైపుణ్యం, న్యాయపరమైన జవాబుదారీతనం మధ్య సమతుల్యతను పాటించాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. నియంత్రణకు ప్రత్యామ్నాయంగా న్యాయ నిర్ణయాన్ని అనుమతించటం లేదా నియంత్రణ నిర్ణయాలను సమర్థవంతమైన పరిశీలనకు విరుద్ధంగా చేయడం ఉండకూడదని ఆయన హెచ్చరించారు. సకాలంలో వివాదాల పరిష్కారం కూడా ముఖ్యమని... సుదీర్ఘ కాలం పాటు నలిగే వ్యాజ్యాలు నియంత్రణ లక్ష్యాలను దెబ్బతీస్తాయని, పరిశ్రమలకు, వినియోగదారులకు అనిశ్చితిని కలిగిస్తాయని చెప్పారు.
విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణపై మాట్లాడుతూ... విమానాశ్రయాలు బహుళ వాటాదారులు, పరస్పరం అనుసంధానమైన సేవలతో కూడిన సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థలని తెలిపారు. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా టారిఫ్ నిర్ణయాలను, అప్పీలేట్ వివాద పరిష్కారాన్ని నియంత్రణ వ్యవస్థ అందిస్తుందని... సంబంధిత వివాదాలను పరిష్కరించటంలో టీడీశాట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
టెలికాం, ప్రసార రంగాల గురించి చర్చిస్తూ... లైసెన్సింగ్, స్పెక్ట్రమ్, ఇంటర్కనెక్షన్, సేవా నాణ్యత, సిగ్నల్స్ అందుబాటు, ధరల నిర్ణయానికి సంబంధించిన అంశాలను జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రస్తావించారు. ఈ రంగాల్లో సమర్థవంతమైన నియంత్రణ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించటంతో పాటు ఆరోగ్యకరమైన పోటీని, స్థిరమైన వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.

సైబర్, కృత్రిమ మేధ రంగాల్లోని నూతన సవాళ్లపై ఆయన మాట్లాడారు. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి వల్ల సైబర్ సంబంధిత వివాదాలు, మోసాలు, బాధ్యత, పర్యవేక్షణకు సంబంధించిన ప్రశ్నలు మరింత జటిలమయ్యాయని తెలిపారు. న్యాయపరంగా నిర్ణయాత్మక ప్రక్రియలకు సాంకేతికత, కృత్రిమ మేధ సహాయపడగలవు. కానీ, అవి న్యాయ నిర్ణయ విశ్లేషణ, జవాబుదారీతనం, మానవ పర్యవేక్షణ స్థానాన్ని భర్తీ చేయలేవని స్పష్టం చేశారు.
ప్రత్యేక వివాదాల్లో మధ్యవర్తిత్వం, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారాల ప్రాముఖ్యతను జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కీలకంగా ప్రస్తావించారు. విధానపరమైన ముసాయిదా మధ్యవర్తిత్వం, స్వచ్ఛంద ఒప్పందాలకు టీడీశాట్ అవకాశం కల్పిస్తుందని... పార్టీలు సమర్థవంతమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలను పొందేందుకు సహాయపడుతుందని చెప్పారు.
బెంచ్ల లభ్యతను పెంచటంతో సహా దేశవ్యాప్తంగా ప్రత్యేక న్యాయనిర్ణయ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు కూడా ఆయన మద్దతిచ్చారు. జస్టిస్ డీ.ఎన్. పటేల్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ఆయన అభినందించారు. జ్ఞానాన్ని పంచుకునేందుకు, ప్రత్యేక వివాద పరిష్కార విధానాలపై అవగాహనను బలోపేతం చేయటానికి సెమినార్లు, భాగస్వాముల పరస్పర చర్చలు కీలక వేదికగా నిలుస్తాయని ఆయన తెలిపారు.

ప్రారంభ ఉపన్యాసంలో టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలు ట్రిబ్యునల్ (టీడీశాట్) చైర్పర్సన్ జస్టిస్ డీ.ఎన్. పటేల్ మాట్లాడుతూ... టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్టు సుంకాలు, సైబర్ రంగాల్లో ప్రత్యేకమైన, నిర్ణీత కాలపరిమితిలో వివాదాలను పరిష్కరించటంలో ట్రిబ్యునల్ పాత్రను స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మాట్లాడుతూ... సైబర్ విషయాల్లో అప్పిలేట్ అధికార పరిధి, విమానాశ్రయ సుంకాల వివాదాల్లో దాని పాత్రతో సహా సాంకేతిక, నియంత్రణ అభివృద్ధికి అనుగుణంగా టీడీశాట్ అధికార పరిధి విస్తరించిన తీరుని వివరించారు.
వివాద పరిష్కార విధానాల గురించి విధానకర్తలు, నియంత్రకులు, పరిశ్రమ వర్గాలు, న్యాయ నిపుణులు, ఇతర భాగస్వాముల మధ్య మరింత అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకతను జస్టిస్ డీ.ఎన్. పటేల్ స్పష్టం చేశారు.
సైబర్ వివాదాల పరిష్కార విధానాన్ని వివరిస్తూ... సమాచార సాంకేతిక చట్టం ప్రకారం సివిల్ నష్టపరిహార దావాలను మొదట నిర్దేశిత నిర్ణయాధికారి విచారిస్తారని, రూ. 5 కోట్ల వరకు నష్టపరిహార దావాలు ఆ అధికార పరిధిలోకి వస్తాయని జస్టిస్ డీ.ఎన్. పటేల్ తెలిపారు. నిర్ణయాధికారి ఉత్తర్వులపై అప్పీల్ చేయటానికి టీడీశాట్ వేదికగా పనిచేస్తుందని, రూ.5 కోట్లకు మించిన దావాలు ఆ అధికార పరిధి వెలుపల సమర్థవంతమైన సివిల్ కోర్టుల ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. బాధితులు సమర్థవంతంగా సముచితమైన చట్టపరమైన పరిష్కారాలను పొందటానికి పోలీసు అధికారులు, నిర్ణయాధికారి, ఐటీ అధికారుల్లో ఈ నిబంధనలపై అవగాహనను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎస్. సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ శ్రీ ఎ. సుదర్శన్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవ శ్రీ జస్టిస్ పి. సామ్ కోషి పాల్గొన్నారు.
వేగంగా సాంకేతిక మార్పులకు లోనవుతున్న రంగాలను నియంత్రించే చట్టపరమైన, నియంత్రణా విధానాన్ని బలోపేతం చేయటంపై న్యాయవ్యవస్థ, న్యాయ నిపుణులు, నియంత్రణ సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య అభిప్రాయాలను పరస్పరం మార్చుకునేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలిచింది.

***
(రిలీజ్ ఐడి: 2302306)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57