ఆయుష్
వ్యాధులకు చికిత్సతో పాటు నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం: శ్రీ ప్రతాపరావు జాదవ్
భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక శాస్త్రీయ పరిశోధన, ఆధారాలతో అనుసంధానించాలి: శ్రీ ప్రతాపరావు జాదవ్
ఆయుష్ మంత్రిత్వ శాఖ అయిదో పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్
విద్య, పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేయటం ద్వారా ప్రకృతి వైద్య వ్యవస్థలను బలోపేతం చేయటంపై చర్చ
प्रविष्टि तिथि:
10 AUG 2026 9:13PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఇవాళ జరిగిన ఆయుష్ మంత్రిత్వశాఖ అయిదో పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రతాపరావు జాదవ్ అధ్యక్షత వహించారు. "యోగా, ప్రకృతి వైద్యం"పై ఈ సమావేశం జరిగింది. నివారణతో కూడిన ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, పునరావాసం, సంపూర్ణ సంక్షేమం వంటి వాటికి పెరుగుతున్న ప్రాముఖ్యతపై చర్చించారు.
భారతదేశ సంప్రదాయాల్లో యోగా, ప్రకృతి వైద్యానికి ప్రత్యేక స్థానం ఉందని కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అన్నారు. ఇవి ఆరోగ్య పరిరక్షణ, సంపూర్ణ సంక్షేమంపై దృష్టి సారించే, మందుల అవసరం లేని సమగ్ర విధానాలను అందిస్తాయని తెలిపారు. శారీరక, మానసిక, భావోద్వేగ సంక్షేమానికి యోగా దోహదపడుతుందని… పోషకాహారం, జీవనశైలి మార్పులు, సహజ చికిత్సలు, శరీరంలో అంతర్గత శక్తికి ప్రకృతి వైద్యం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.
ఆధునిక జీవనశైలితో ముడిపడున్న అసంక్రమిక వ్యాధులు, ఒత్తిడి, మానసిక ఆరోగ్య సవాళ్లతో పెరుగుతున్న భారాన్ని శ్రీ ప్రతాపరావు జాదవ్ స్పష్టం చేశారు. కేవలం వ్యాధులకు చికిత్స మాత్రమే కాకుండా… వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించటంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవశ్యకతను తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండటం, పునరావాసం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, నొప్పి నివారణ, మాతా, శిశు సంక్షేమం, సంపూర్ణ ఆరోగ్యానికి యోగ, ప్రకృతి వైద్యం ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ.. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నందున శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం, చలనశీలత, స్వయంప్రతిపత్తి, జీవన నాణ్యతను కాపాడుకోవటం అవసరమని అన్నారు. ఆరోగ్యకరమైన, ఉత్సాహకరమైన వృద్ధాప్యానికి మద్దతివ్వటంలో యోగా, ప్రకృతి వైద్యం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించి సంస్థాగత వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారు. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై), యోగా సర్టిఫికేషన్ బోర్డు (వైసీబీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్ వైఎన్), నేచురోపతి రిజిస్ట్రేషన్ బోర్డు (ఎన్ఆర్బీ) ద్వారా ఈ అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్య, శిక్షణ, సర్టిఫికేషన్, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ, నాణ్యతా ప్రమాణాలు, వృత్తిపరమైన ప్రామాణీకరణలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రకృతి వైద్యంలో రిజిస్ట్రేషన్, నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేయటంలో నేచురోపతి రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటు కీలకమని తెలిపారు.
సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారు. "సంప్రదాయమే మన బలం. శాస్త్రీయతే ఆధారం, నాణ్యతే ప్రాధాన్యత" అని అన్నారు. ఆధునిక వైద్యానికి యోగా, ప్రకృతి వైద్యం అనుబంధంగా ఉండాలని… వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, కోలుకునేలా చేయటం, సంపూర్ణ ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు.
యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించి సంస్థాగత, విద్యాపరమైన, పరిశోధనా, ప్రచార వ్యవస్థలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అలర్మేళ్ మంగై డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 22 సీసీఆర్వైఎన్ యూనిట్లు, యోగా కోర్సులు అందిస్తున్న 100కి పైగా విశ్వవిద్యాలయాలు, 5,000కి పైగా యోగా కేంద్రాలు, 113 గుర్తింపు పొందిన సంస్థలు, 29 గుర్తింపు పొందిన పర్సనల్ సర్టిఫికేషన్ సంస్థల గురించి ఈ ప్రజెంటేషన్ లో చెప్పారు. వీటితో పాటు భారతదేశంలో పెరుగుతున్న 10,500కి పైగా నిపుణులతో సమీక్షించిన పబ్మెడ్-జాబితాలోని ప్రచురణల పరిశోధనా రంగం, పరిశోధనా సహకారం, డిజిటల్ ప్రచారం, ఆరోగ్యకమైన పర్యాటకం, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాల గురించి వివరించారు.
పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి హాజరైన లోక్సభ సభ్యుల్లో డా. స్వామి సచ్చిదానంద్ హరి సాక్షి, శ్రీ అష్టీకర్ పాటిల్ నాగేశ్ బాపురావ్, శ్రీ ఖలీలుర్ రెహమాన్, శ్రీ నీలేశ్ ధ్యాన్ దేవ్ లంకే, శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఉన్నారు. రాజ్యసభ నుంచి శ్రీ ఘన్శ్యామ్ తివారీ, శ్రీ సదానంద్ మ్హాలు షెట్ తనవడే, శ్రీ బాబూభాయ్ జెసంగ్భాయ్ దేశాయ్, డా. లక్ష్మీకాంత్ బాజ్పేయ్ పాల్గొన్నారు. శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్సభ నుంచి శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి, శ్రీమతి జ్యోత్స్న చరణ్దాస్ మహంత్, రాజ్యసభ నుంచి శ్రీమతి ధర్మశిల గుప్తా, శ్రీమతి రేణుకా చౌదరి హాజరయ్యారు. యోగా, ప్రకృతి వైద్య విద్య కోసం ఒకే విధమైన ఏకీకృత నియంత్రణ వ్యవస్థ అవసరం ఉందని పార్లమెంటు సభ్యులు, నిపుణులైన సభ్యులు అంగీకరించారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా, ఆయుష్ మంత్రిత్వశాఖ సలహాదారు (యునాని) డాక్టర్ ముక్తార్ అహ్మద్ ఖాస్మీ, యోగా, ప్రకృతి వైద్య నిపుణులు, భాగస్వాములు, మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏడు కీలక ప్రాధాన్యతా రంగాల ద్వారా యోగా, ప్రకృతి వైద్య వ్యవస్థల బలోపేతానికి ప్రణాళికలను మంత్రిత్వశాఖ రూపొందించింది.
యోగా, ప్రకృతి వైద్య రంగంలో విద్య, సంస్థాగత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం.
రెండు వ్యవస్థల్లోనూ శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాల సేకరణను ప్రోత్సహించటం.
యోగలో సర్టిఫికేషన్, గుర్తింపు, వృత్తిపరమైన ప్రమాణాలను బలోపేతం చేయటం.
ప్రకృతి వైద్యంలో రిజిస్ట్రేషన్, నాణ్యతా ప్రమాణాలు, ప్రామాణీకరణను మెరుగుపరచటం.
యోగ, ప్రకృతి వైద్యం ఆధారిత నివారణ, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించటం.
ఆరోగ్య పర్యాటకం, వైద్య పర్యాటకం వంటివి ముఖ్యమైన అంశాలుగా భారతదేశంలో యోగా, ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించటం.
శాస్త్రీయ ఆధారాలు, నాణ్యతా ప్రమాణాల మద్దతుతో భారతదేశంలోని యోగా, ప్రకృతి వైద్యం సంప్రదాయాలను ప్రపంచ వేదికపై నిలపటం.
ఆరోగ్యకరమైన భారత్, వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా… యోగా, ప్రకృతి చికిత్సను ఆధారాలతో, అందరికీ అందుబాటులో ఉండే నివారణతో కూడిన ఆరోగ్య వ్యవస్థలుగా మరింత బలోపేతం చేయటంలో మంత్రిత్వశాఖ, పార్లమెంటు, భాగస్వాముల మధ్య నిరంతర సహకార ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసింది.
****
(रिलीज़ आईडी: 2297534)
आगंतुक पटल : 11