సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2026 ఆగస్టు 4, 5 తేదీల్లో రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృంద సమావేశం
प्रविष्टि तिथि:
05 AUG 2026 4:28PM by PIB Hyderabad
బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం రెండో సమావేశం, ఆస్తుల పునరుద్ధరణపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశాలు కేంద్ర సిబ్బంది, శిక్షణ (డీవోపీటీ) శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని హైదరాబాద్లో విజయవంతంగా ముగిశాయి. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న ఈ సమయంలో.. 2026 ఆగస్టు 4, 5 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహించారు.
భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న బ్రిక్స్ సమావేశాల ఇతివృత్తమైన.. ‘పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల కోసం నిర్మాణం’ లక్ష్యానికి అనుగుణంగా ఈ సమావేశాలను నిర్వహించారు. అన్ని బ్రిక్స్ సభ్య దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉన్నతస్థాయి విధాన రూపకర్తలు, నిపుణులు, కార్యకర్తలతోపాటు.. అవినీతి నిరోధక, ఆర్థిక నిఘా, చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు హాజరై వివిధ అవినీతి నిరోధక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈ సమావేశాన్ని ప్రారంభించి ప్రతినిధులకు స్వాగతం పలికారు. అవినీతిని ఎంతమాత్రం సహించని భారత విధానాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, ప్రజా విశ్వాసాలకు.. నైతికత, సమగ్రతలే అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. బలమైన సంస్థలు, సాంకేతికత ప్రాతిపదికగా పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, నిరంతర అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.
బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం సాధారణ అవగాహనను పెంచుకునే వేదికగానే కాకుండా.. ఆచరణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టే దిశగా వేగంగా పరివర్తన చెందుతోందని కార్యదర్శి వ్యాఖ్యానించారు. ప్రభావవంతమైన అంతర్జాతీయ సహకారం సాధ్యపడాలంటే.. సకాలంలో సమాచార మార్పిడి, సంబంధిత అధికారిక సంస్థల మధ్య సత్వర సమన్వయం అవసరమని ఆమె పేర్కొన్నారు. అలాగే అధికారిక పరస్పర చట్టపరమైన సాయం, నేరగాళ్ల అప్పగింత విధానాలకు తోడుగా.. క్షేత్రస్థాయి నిపుణుల మధ్య నమ్మకమైన సమాచార వినిమయ వ్యవస్థలూ అత్యంత కీలకమైనవన్నారు.

అవినీతికి పాల్పడి దేశం దాటి పరారైన నేరగాళ్లను పట్టుకోవడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం, నేరస్తుల అప్పగింత ప్రక్రియకు తోడ్పడడం లక్ష్యంగా.. బ్రిక్స్ దేశాల కోసం చట్టాలను అమలు చేసే నిపుణులతో అనుసంధానం కోసం అధ్యక్ష స్థానంలో భారత్ కీలక ప్రతిపాదన చేసింది. దానికి సభ్య దేశాల నుంచి విశేష మద్దతు లభించింది. ఈ ప్రతిపాదిత నెట్వర్క్ లక్ష్యాలు, పరిధి, కార్యాచరణ విధానాలపై సభ్య దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించి, సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. క్షేత్రస్థాయి నిపుణుల కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు చర్చలను కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమంతో అనధికారిక సహకారం పెరగడంతోపాటు.. పరారీలో ఉన్న నేరగాళ్లను గుర్తించడం సులభతరమవుతుందని, అధికారికంగా నేరస్తుల అప్పగింత కోసం ప్రస్తుతమున్న యంత్రాంగానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
అవినీతికి పాల్పడి పరారైన నేరగాళ్లను గుర్తించడానికి, వారి అప్పగింతకు తోడ్పడటానికి ఉద్దేశించిన అనధికారిక సహకారంపై బ్రిక్స్ సమాచార నిధి (రిపాజిటరీ)ని కూడా సభ్య దేశాలు స్వాగతించాయి. వివిధ దేశాల అమలు విధానాలు, అందుబాటులో ఉన్న అనధికారిక సహకార మార్గాల సమాచారాన్ని ఒకే చోటికి చేర్చే ఒక ఆచరణాత్మక, నిపుణుల ప్రాతిపదికన నడిచే ఆధారంగా ఇది ఉపయోగపడుతుంది.

ఆస్తుల పునరుద్ధరణపై ఏర్పాటైన బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశం.. సంబంధిత అధికారిక సంస్థల మధ్య ప్రత్యక్ష సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన ఆచరణాత్మక అంశాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. అధికారిక పరస్పర చట్టపరమైన సహాయ విధానాలకు తోడ్పడుతూనే.. దర్యాప్తు ప్రాథమిక దశల్లో క్షేత్రస్థాయి నిపుణుల మధ్య సకాలంలో సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రమాణీకృత విధానాలపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
బ్రిక్స్ దేశాల్లోని అధికారిక సంస్థల మధ్య మరింత ప్రత్యక్ష సమాచార మార్పిడికి తోడ్పడే ప్రధాన అంశాలు, నిపుణుల డైరెక్టరీని కూడా నిపుణుల నెట్వర్క్ స్వాగతించింది. ఈ జాబితా ఎప్పటికప్పుడు కచ్చితంగా, కార్యాచరణోపయోగంగా ఉండేందుకు వీలుగా.. అదనంగా నిపుణులను నామినేట్ చేయడంతోపాటు, భవిష్యత్ బ్రిక్స్ అధ్యక్ష దేశాలు ఈ డైరెక్టరీని క్రమానుగతంగా సమీక్షించి నవీకరించేందుకు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి.
అంతర్జాతీయ ఆస్తుల రికవరీకి సంబంధించి తమ అనుభవాలు, సంస్థాగత విధానాలు, ఆచరణాత్మక కేస్ స్టడీలను బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పరం పంచుకున్నాయి. బ్రిక్స్ దేశాల్లోని పరిశోధకులు, నిపుణుల మధ్య నిరంతర జ్ఞాన భాగస్వామ్యం, మెరుగైన సహకారం విలువను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
"ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక విలువలతో కూడిన పాలన" అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం... సాంకేతికత ఆధారిత పాలనలో ఆచరణాత్మక ఆవిష్కరణలను పంచుకోవడానికి సభ్య దేశాలకు ఒక వేదికను అందించింది. సమగ్ర డిజిటల్ సేకరణ వేదికలు విచక్షణారహిత జోక్యాలను, అవినీతి ముప్పును తగ్గిస్తూ... పారదర్శకత, ట్రేసబిలిటీ, నిష్పక్షపాత పోటీ, సామర్థ్యాలనూ మెరుగుపరుస్తాయని ఈ చర్చలు స్పష్టం చేశాయి.
సరైన సంస్థాగత భద్రతా చర్యలు, మానవ పర్యవేక్షణల మద్దతుతో ఎప్పటికప్పుడు ప్రమాదాలను గుర్తించడం, ధ్రువీకరించడం ద్వారా... నివారణపరమైన అప్రమత్తత దిశగా పర్యవేక్షణను మళ్లించడంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, బిగ్-డేటా అనలిటిక్స్ సామర్థ్యాన్నీ సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించారు. పౌరులకు సాధికారత కల్పించడంలో, సంస్థాగత జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించడంలో ఓపెన్ డేటా, డిజిటల్ సామాజిక ఆడిట్లు, ఫిర్యాదు పరిష్కార వేదికలు, ఉమ్మడి నిఘా ప్రాముఖ్యతనూ ఈ చర్చలు పునరుద్ఘాటించాయి.
“ఫైనాన్షియల్ టెక్నాలజీ, వర్చువల్ డిజిటల్ అసెట్స్ ద్వారా తలెత్తుతున్న ప్రమాదాలు: అవినీతి సొమ్మును దాచడం, లాండరింగ్ చేయడంలో వాటి దుర్వినియోగాన్ని పరిష్కరించడం” అనే అంశంపై చర్చ జరిగింది. ఫిన్టెక్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఆర్థిక సమ్మిళితాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నప్పటికీ... వాటి వేగం, పరిమితులు లేని స్వభావం, పారదర్శకత లోపం కారణంగా అక్రమ సొమ్మును దాచిపెట్టడానికి, బదిలీ చేయడానికీ వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని సమావేశం గుర్తించింది.
వర్ధమాన సాంకేతికతల చట్టబద్ధమైన నూతన ఆవిష్కరణ సామర్థ్యాన్ని పరిరక్షిస్తూనే... మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిధుల నిరోధక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసే స్పష్టమైన, ముప్పు-ఆధారిత నియంత్రణ విధానాల ఆవశ్యకతను సభ్యులు స్పష్టం చేశారు. వర్ధమాన వర్గీకరణలు, పర్యవేక్షణ సంబంధిత అభిప్రాయాలను పంచుకోవడం... ఎఫ్ఐయూ-టు-ఎఫ్ఐయూ, సరిహద్దు సహకారాన్ని మరింతగా పెంపొందించడం... అక్రమ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు జరిగే వేగానికి అనుగుణంగా సమాచార మార్పిడినీ అందుబాటులోకి ఉంచడంపై బ్రిక్స్ సహకారం దృష్టి సారించాలనీ వారు ఉద్ఘాటించారు.
భారత్ బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో కొనసాగిన కాలంలో సాధించిన పురోగతిని ఈ సమావేశాలు చర్చించాయి. ఆస్తుల రికవరీ, సరిహద్దు అవినీతి నిర్మూలన, పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, కొత్తగా తలెత్తుతున్న ఆర్థికపరమైన నష్టాలను పరిష్కరించడం సహా పారదర్శకమైన, జవాబుదారీ, సాంకేతికత ఆధారిత పాలనను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల బ్రిక్స్ సభ్య దేశాల సమష్టి నిబద్ధతనూ ఈ సమావేశాలు పునరుద్ఘాటించాయి.
భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశాల ఫలితాలు... భవిష్యత్తులో బ్రిక్స్కు అధ్యక్షత వహించే దేశాలు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన పునాది వేశాయి. అవినీతి నిరోధక, చట్టాన్ని అమలు చేసే అధికారుల మధ్య సహకారం కోసం వాటిని క్రమంగా సమర్థమైన, విశ్వసనీయమైన కార్యాచరణ వేదికలుగా అభివృద్ధి చేశాయి.
***
(रिलीज़ आईडी: 2295026)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English