ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లోని బీబీనగర్ ఎయిమ్స్ పురోగతిని సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
గత శతాబ్ది చివర వరకూ దేశంలో ఉన్నది ఒకే ఒక్క ఎయిమ్స్
ప్రస్తుతం దేశంలో వాటి సంఖ్య 23
"తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సంస్థలను బలోపేతం చేస్తూనే... ద్వితీయ శ్రేణి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను విస్తరిస్తూ, పటిష్ఠం చేయడం ద్వారా ఏకరీతి, సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన ప్రభుత్వం"
దేశంలోని 1.85 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దాదాపు 150 కోట్ల మందికి అందుతున్న సేవలు
బీబీనగర్ ఎయిమ్స్లోని అన్ని ప్రధాన స్పెషాలిటీల్లో అందుబాటులో ఔట్ పేషెంట్ సేవలు
ప్రస్తుతం రోజుకు సుమారు 1,800 మంది రోగులకు అందుతున్న సేవలు
ఆరు గ్రామాలను దత్తత తీసుకుని 547 మొబైల్ వైద్య శిబిరాలు నిర్వహించిన బీబీనగర్ ఎయిమ్స్
దాని ఆర్హెచ్టీసీ, యూహెచ్టీసీ విభాగాల ద్వారా 66,148 మంది రోగులకు లబ్ధి
మానవ వనరులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శ్రీ నడ్డా
మరింత మంది సీనియర్ రెసిడెంట్లను నియమించుకుని మరిన్ని గొప్ప అవకాశాలు కల్పించాలని సూచన
प्रविष्टि तिथि:
09 JUL 2026 5:08PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన ఏడో దశ కింద హైదరాబాద్లోని బీబీనగర్లో 2019లో ఏర్పాటు చేసిన జాతీయ ప్రాముఖ్యత గల సంస్థ బీబీనగర్ ఎయిమ్స్ పురోగతిని ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు రూ. 1110.55 కోట్ల వ్యయంతో 2022 జూన్ నెలలో ప్రారంభమైంది.
ఈ సమీక్ష సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ నడ్డా మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాలు, సామర్థ్య విస్తరణ పరంగా గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. 20వ శతాబ్దం చివరి నాటికి దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదనీ, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో అదనంగా ఆరు ఎయిమ్స్లు ఏర్పాటయ్యాయని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి 16 కొత్త ఎయిమ్స్లు ఏర్పాటు చేయడంతో, దేశవ్యాప్తంగా వాటి మొత్తం సంఖ్య 23కి చేరిందన్నారు. వీటిలో 18 ఎయిమ్స్లు ఇప్పటికే పనిచేస్తుండగా, మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు.
తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సంస్థలను బలోపేతం చేస్తూనే... తమ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను విస్తరిస్తూ, పటిష్ఠం చేసిందన్నారు. తద్వారా ఏకరీతి, సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు 1.85 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు దాదాపు 150 కోట్ల మందికి సేవలందిస్తున్నాయని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2014 నాటికి దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 387 కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య 820కి పెరిగిందనీ ఆయన తెలిపారు.
సంస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధన కార్యకలాపాలు, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా సిబ్బంది సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.
బీబీనగర్ ఎయిమ్స్లో ప్రస్తుతం 132 మంది అధ్యాపకులు, 133 మంది సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతోనే ఇక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు బ్యాచుల విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేశారు. 24 ఎమ్డీ విభాగాల్లో, అయిదు డీఎం/ఎంసీహెచ్ స్పెషాలిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లూ నిర్వహిస్తున్నారు. 60 సీట్ల ప్రవేశంతో బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్ 2024లో ప్రారంభం కాగా... అయిదు స్పెషాలిటీల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సును అందిస్తున్నారు. అనుబంధ ఆరోగ్య విద్య కోర్సులనూ ఇక్కడ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 902 మంది విద్యార్థులు ఉన్నారు. త్వరలో ఎంబీబీఎస్ విద్యార్థుల కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ సంస్థ అన్ని ప్రధాన స్పెషాలిటీల్లో ఔట్ పేషెంట్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 1,800 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో ఇన్పేషెంట్ సంరక్షణ కోసం 250 పడకలు ఉన్నాయి. ఇటీవల అత్యవసర సేవలూ ప్రారంభమయ్యాయి. సీటీ, ఎంఆర్ఐ, డెక్సా సహా చాలా వరకు రోగనిర్ధారణ పరీక్ష సదుపాయాలు, రేడియోలాజికల్ రోగనిర్ధారణ సదుపాయాలూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ తెలంగాణలోని 33 జిల్లాలకు ఇ-సంజీవని ద్వారా టెలికన్సల్టేషన్ సేవలనూ అందిస్తోంది. పీఎంజేఏవై-ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరిస్తోంది. సుమారు 90 శాతం మంది రోగులు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నమోదు చేసుకున్నారు.
పరిశోధన రంగంలోనూ బీబీనగర్ ఎయిమ్స్ 129 ప్రాజెక్టుల ద్వారా రూ. 64 కోట్ల విలువైన పరిశోధన నిధులను సాధించడంతో పాటు... 1,156 పరిశోధన పత్రాలనూ ప్రచురించింది. కార్బన్-ఇంప్రెగ్నేటెడ్ లెగ్ ప్రోస్థెసిస్ (కృత్రిమ కాలు) 'ఏడీఐడీవోసీ' తయారీలోనూ ఈ సంస్థ డీఆర్డీవోతో కలిసి పనిచేస్తోంది.
బీబీనగర్ ఎయిమ్స్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ నడ్డా ప్రశంసించారు. ఈ సంస్థ ఆరు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు 547 సంచార వైద్య శిబిరాలను నిర్వహించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. "ఈ సంస్థ తన గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం (ఆర్హెచ్టీసీ), పట్టణ ఆరోగ్య శిక్షణ కేంద్రం (యూహెచ్టీసీ) ద్వారా సమీప ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తోంది. ఇప్పటి వరకు 66,148 మంది రోగులకు లబ్ధి చేకూర్చింది. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రసారమయ్యే సామర్థ్యం కలిగిన ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్నూ ప్రారంభించి, దాని ద్వారా 43 విద్యాసంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది" అని కేంద్ర మంత్రి తెలిపారు.
నిర్మాణ పనుల పురోగతి సమీక్షలో... సుమారు రూ. 902 కోట్ల విలువైన నిర్మాణ పనులు అంటే దాదాపు 87.4 శాతం పనులు పూర్తయినట్లు సిబ్బంది కేంద్ర మంత్రికి వివరించారు. ఆసుపత్రికి చెందిన సి, ఎఫ్ బ్లాకులు, ఆయుష్ భవనం, అమృత్ నివాస్, అకడమిక్ బ్లాక్, అండర్ గ్రాడ్యుయేట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. పాత భవనాల ఆధునీకరణ (రెట్రోఫిటింగ్) పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రేడియోథెరపీ, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ పనులు త్వరలోనే పూర్తవుతాయని భావిస్తున్నారు.
క్యాంపస్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్నీ కేంద్ర మంత్రి శ్రీ నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సమయం తీసుకునే ప్రక్రియే... దీనికి సహనం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ వనరులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ... మరింత మంది సీనియర్ రెసిడెంట్లను నియమించుకోవడం, వారికి మరిన్ని గొప్ప అవకాశాలు కల్పించాల్సిన ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అధ్యాపకుల కొరతను పరిష్కరించడానికి, స్టాండింగ్ సెలక్షన్ కమిటీ సమావేశాలను సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఇతర ఎయిమ్స్ సంస్థలతో ఎక్స్చేంజ్ కార్యక్రమాలనూ అన్వేషించాలని, విజిటింగ్ ఫ్యాకల్టీని నియమించుకోవాలనీ ఆయన సూచించారు.
సమీక్ష అనంతరం సంస్థలోని ఇన్పేషెంట్ వార్డులు, కార్డియాలజీ విభాగంలో ఏర్పాటు చేయనున్న క్యాత్ ల్యాబ్, రేడియాలజీ విభాగంలోని ట్యూమర్ అబ్లేషన్, బయాప్సీ కోసం ఏర్పాటు చేసిన రోబోటిక్ నావిగేషన్ సిస్టమ్ వంటి వివిధ సౌకర్యాలను శ్రీ నడ్డా పరిశీలించారు. ఆయుష్ బ్లాక్లోని టీకా కేంద్రం, యోగా కేంద్రం, కమ్యూనిటీ రేడియో స్టేషన్నూ సందర్శించి... అక్కడ ఒక సంక్షిప్త సందేశం ఇచ్చారు. సంస్థ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి అభినందించారు. క్యాంపస్లో జరుగుతున్న నిర్మాణ పనులను సమీక్షించి, ఆసుపత్రి మౌలిక సదుపాయాలపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధన రంగాల్లో అత్యుత్తమ కేంద్రంగా ఎదిగేందుకు కృషి చేస్తూనే... సామాజిక ఆరోగ్య సంరక్షణలోనూ తన సహకారాన్ని బలోపేతం చేసుకుంటోంది.
***
(रिलीज़ आईडी: 2283084)
आगंतुक पटल : 13