రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-వియత్నాం సముద్రయాన, శాస్త్రీయ సహకారాన్ని పెంపొందిస్తున్న ఐఎన్ఎస్ సాగర్ధ్వని
నాడు పోస్టు చేయడమైనది:
10 MAY 2026 12:30PM by PIB Hyderabad
భారత నౌకాదళ సముద్ర పరిశోధన నౌక ఐఎన్ఎస్ సాగర్ధ్వని మే 4 నుంచి 08, 2026 వరకు వియత్నాంలోని కామ్ రాన్హ్ నగరంలో విజయవంతంగా పర్యటించింది. ఈ పర్యటన భారత్, వియత్నాం దేశాల మధ్య సముద్రయాన, శాస్త్రీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది.
ఈ పర్యటనలో భాగంగా ఖాన్ హోవా మిలిటరీ కమాండ్ డిప్యూటీ హెడ్ సీనియర్ కల్నల్ ట్రాన్ వాన్ కుయోంగ్, నేవల్ రీజియన్ 4 డిప్యూటీ పొలిటికల్ కమిస్సార్ సీనియర్ కెప్టెన్ న్గుయెన్ హుమిన్లతో ఐఎన్ఎస్ సాగర్ధ్వని కమాండింగ్ ఆఫీసర్ సమావేశమయ్యారు. భారత్-వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సముద్ర తీర భద్రతలో పరస్పర సహకారం, వృత్తిపరమైన సంబంధాలు, శిక్షణ, శాస్త్రీయ రంగాల్లో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయటంపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఫిబ్రవరి 2026లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-26, మిలన్ 26 విన్యాసాల్లో వియత్నాం పీపుల్స్ నేవీ (వీపీఎన్) నౌక పాల్గొంది.
వృత్తిపరమైన మార్పిడిలో భాగంగా వియత్నాం నావికాదళ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ సీనియర్ కెప్టెన్ హోథాన్ హోవాతో కమాండింగ్ ఆఫీసర్ సమావేశమయ్యారు. నావికాదళ శిక్షణ, విద్యా రంగాల్లో సహకార విస్తరణపై చర్చలు జరిపారు. అకాడమీ అధికారులు, ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారు కూడా నౌకను సందర్శించి.. దాని కార్యాచరణ, సామర్థ్యాలపై అవగాహన పెంచుకున్నారు.
భారత నౌకాదళం, వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది నౌకాశ్రయంలో ఉన్న సమయంలో స్నేహం, సోదరభావాన్ని చాటుతూ.. వాలీబాల్ పోటీలు, యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సముద్ర శాస్త్ర అధ్యయనాల్లో సహకార బలోపేతానికి డీఆర్డీవోకు చెందిన ఎన్ఓపీఎల్ (నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ) శాస్త్రవేత్తలు, న్హా ట్రాంగ్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిశోధకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సముద్ర శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధన సహకారం, జ్ఞాన మార్పిడి, సామర్థ్య నిర్మాణంపై దృష్టి సారించారు. నేషనల్ ఓషనోగ్రాఫిక్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా నౌకను సందర్శించారు.
ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సముద్రయాన భాగస్వామ్యానికి, శాస్త్రీయ సహకారానికి ఈ పర్యటన నిదర్శనంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2259833)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7