కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
షిల్లాంగ్లోని నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ (ఎన్ఈహెచ్యూ)లో 100వ ఎన్-జెన్ పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా
భావి అవసరాలకు సన్నద్ధమైన, పౌరులకు సేవలందించడమే ప్రధానంగా ఉన్న నెట్వర్కుగా ‘ఇండియా పోస్ట్’ మారిందన్న శ్రీ సింధియా
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 7:18PM by PIB Hyderabad
‘ఇండియా పోస్ట్’కు చెందిన 100వ ఎన్-జెన్ (నెక్స్ట్-జెనరేషన్) పోస్టాఫీసును కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డీఓఎన్ఈఆర్) శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా షిల్లాంగ్లోని నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ (ఎన్ఈహెచ్యూ)లో ఈ నెల 6న దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ పోస్టాఫీసును ఆధునిక రూపురేఖలతో యువత ప్రయోజనాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టిన తపాలా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ పోస్టాఫీసు విశ్వవిద్యాలయ క్యాంపసుకు చెందిన విద్యార్థులకీ, అధ్యాపకులకీ, విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతవాసులకీ సేవలను అందిస్తుంది.
(షిల్లాంగ్లోని నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో 100వ ఎన్-జెన్ పోస్టాఫీసు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతున్న శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా)
యువతతో అనుబంధాన్ని పెంచుకోవడంపై ‘ఇండియా పోస్ట్’ కనబరుస్తున్న శ్రద్ధకు ఎన్-జెన్ పోస్టాఫీస్ కార్యక్రమం ఓ నిదర్శనం. విద్యార్థుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడానికి ఆధునీకరించిన హంగులతో ఈ తపాలా కార్యాలయాల్ని విద్యాసంస్థల లోపలే ఏర్పాటు చేస్తున్నారు. ఇవి తపాలా సేవలను అందించడంతో పాటు పరస్పర అనుబంధాన్ని ప్రోత్సహిస్తాయి.
ఉచిత వై-ఫై, క్యూఆర్ కోడ్ ఆధారిత బుకింగులు, చెల్లింపు పద్ధతులు, విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేవా కౌంటర్లు, తగ్గింపు ధరలకు పార్సిల్, తపాలా సేవలను అందించడం వంటి ఆధునిక సదుపాయాలను ఈ తపాలా కార్యాలయాలు సమకూరుస్తాయి. ఉత్తరాలు రాయడమనే చిరకాల సంప్రదాయాన్ని పునర్నవీకరించడంతో పాటు, సాముదాయిక భావనను ప్రోత్సహిస్తాయి. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆదరించారు. వారి చురుకైన భాగస్వామ్యం ఈ కార్యాలయాలకో రూపును సంతరించింది. నవ తరం చెంతకు చేరుకొనేందుకు ఈ పోస్టాఫీసులు ఫలప్రద, ప్రభావవంత సాధనంగా రూపొందాయి.
ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి విద్యార్థుల్నీ, కార్యాలయ సిబ్బందినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఇండియా పోస్ట్’ దేశాభివృద్ధి పథంలో మున్ముందుకు పయనిస్తోందన్నారు. ఒక యువ, ప్రగతిశీల దేశం ఆకాంక్షలకు తగినట్లు ‘ఇండియా పోస్ట్’ మారుతోందని ఆయన తెలిపారు. సాంప్రదాయిక తపాలా కార్యాలయాలను చైతన్యశీల, యువ ఆకాంక్షల్ని తీర్చగల, డిజిటల్ పరంగా సమర్థ సేవాకేంద్రాలుగా మార్చాలన్న విస్తృత దృష్టికోణానికి ఎన్-జెన్ కార్యక్రమం అద్దంపడుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఎన్-జెన్ కార్యక్రమం ప్రస్తుతం పూర్తి దేశాన్ని చుట్టిందనీ, దీనిలో భాగంగా ఐఐటీలూ, ఐఐఎమ్లూ, ఎన్ఐటీలూ, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని సంస్థల్లో తపాలా కార్యాలయాల రూపురేఖల్ని గణనీయంగా మార్చారనీ మంత్రి వివరించారు. 6 నెలల కిందట ఢిల్లీలో ఐఐటీ హౌజ్ ఖాస్ పోస్టాఫీసుకు కొత్త మెరుగులు అద్దడంతో మొదలైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం 100వ ఎన్-జెన్ పోస్టాఫీసును ప్రారంభించడంతో ముఖ్య మజిలీకి చేరుకొందని ఆయన అన్నారు. దీనిని ‘‘మార్పు, ప్రాతినిధ్యాలతో కూడిన ఓ సుందర ప్రయాణం’’గా మంత్రి వర్ణించారు.
ఈ ప్రాజెక్టు ‘‘విద్యార్థుల కోసమే, విద్యార్ధుల భాగస్వామ్యంతో’’ అన్న భావనకు ప్రతీక అని కేంద్ర మంత్రి అన్నారు. దీనిలో డిజైను, కళాకృతులు, ప్రజాసంబంధాలు.. ఈ అంశాల్లో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం జత పడిందని ఆయన తెలిపారు. తపాలా కార్యాలయ నమూనానీ, దాని దృశ్యప్రధాన గుర్తింపునీ ఆవిష్కరించడంలో ఎన్ఈహెచ్యూలో విద్యార్థులు తమ వంతు తోడ్పాటును అందించారనీ, ఫలితంగా ఇది నిజానికి ఓ ఉమ్మడి ప్రయత్నంగా, సామూహిక గుర్తింపునకు నోచుకున్న ప్రాంతంగా మారిందనీ ఆయన అన్నారు.
నాలుగో సంవత్సరం విద్యార్థిని శాయంతికా నందీ మాట్లాడుతూ, సహ విద్యార్థులతో కలిసి డిజైన్ టీములో పాలు పంచుకోవడం తనకు సంతోషం కలిగించిందన్నారు. ఈ పోస్టాఫీసును ‘తదుపరి తరం’ (నెక్స్ట్-జనరేషన్) ఇతివృత్తం స్ఫూర్తిగా తయారు చేయడంలోనే కాక, దీనికి ఓ కొత్త రూపును ఇవ్వడంలో కూడా తమ బృందం సఫలమైందని ఆమె తెలిపారు. ఈ భావనకు శిల్లాంగ్లోని చైతన్యవంతమైన సంగీత నేపథ్యంతో విడదీయరాని బంధం ఉందనీ, శిల్లాంగ్ను తరచు ‘భారత రాక్ రాజధాని’గా కీర్తిస్తుంటారనీ ఆమె గుర్తు చేశారు. ఈ అనుభవం ఎంతో ఉత్సాహవంతంగా, అర్థవంతమైన కార్యక్రమంగా ఉందనీ, దీంతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం తనకు గర్వకారణంగా అనిపిస్తోందనీ శాయంతిక నందీ చెప్పారు. వాస్తుశాస్త్ర విభాగం మొదటి సంవత్సర విద్యార్థిని స్నేహ దాస్ మాట్లాడుతూ, ఈ కొత్త మార్పు.. పోస్టాఫీసును హుషారైన, ఆకర్షణీయ ప్రదేశంగా మార్చేసిందన్నారు. ఇక్కడ తాను తన స్నేహితురాళ్లతో కలిసి ఆటలు, సంగీతం, వెచ్చిస్తున్న కాలం తాలూకు పూర్తి ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతున్నానని ఆమె వెల్లడించారు.
ఎన్ఈహెచ్యూ కేంద్రం విశిష్టతలను కేంద్ర మంత్రి వివరిస్తూ, ఇది పూర్తిగా మహిళలే నిర్వహించే తపాలా కార్యాలయమన్నారు. ‘మాతృశక్తి’ సామర్థ్యాల్ని ఇది చాటిచెబుతోందనీ, ‘వికసిత్ భారత్’ దార్శనికతను ప్రోత్సహించడంలో మహిళల పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. వెదురు, ఎండుగడ్డి వంటి స్థానికంగా దొరికే స్వదేశీ వస్తు సామగ్రిని ఉపయోగించి శోభాయమానంగా ఈ పోస్టాఫీసును రూపొందించారనీ, ఇది పర్యావరణానుకూలంగా ఉండడమే కాకుండా దీనిలో మేఘాలయ సాంస్కృతిక శోభ అడుగడుగునా ఉట్టిపడుతోందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ఆధునికీకరణ, డిజిటల్ సమ్మిళితత్వం, పౌర ప్రయోజనాలకు పెద్ద పీటను వేసే పరిపాలనల పట్ల ప్రధానికున్న నిరంతర శ్రద్ధకు శ్రీ సింధియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ దార్శనికతలో భాగంగానే ‘ఇండియా పోస్ట్’ ఒక ఆధునిక సేవలు ప్రధానమైన, నవీనమైన రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్ నెట్వర్క్)గా అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రగతి ప్రస్థాన క్రమంలో.. ‘ఎన్-జెన్’ సంస్కరణల్ని దేశం నలు మూలలకీ విస్తరించాలన్న నిబద్ధతను తపాలా విభాగం దేశం పునరుద్ఘాటిస్తోందనీ, దీంతో తపాలా సేవలను అందరికీ అందుబాటులో ఉండేవిగా, సందర్భ శుద్ధిని కలిగి ఉండేవిగా, భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగానూ ఉండేవిగా మార్చుతోందనీ ఆయన అన్నారు.
(కొత్తగా ప్రారంభించిన ఇండియా పోస్ట్ ఎన్-జెన్ తపాలా కార్యాలయం. దీనిలో.. ఆధునికమైన, యువత అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించిన, సాంకేతికత- ఆధారిత తపాలా మౌలిక సదుపాయాల్ని సమకూర్చారు).
***
(రిలీజ్ ఐడి: 2258707)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10