వ్యవసాయ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లో విత్తనాల గోదాం ప్రారంభోత్సవం, స్పీడ్ బ్రీడింగ్ సదుపాయానికి శంకుస్థాపన చేసిన ఐకార్ డీజీ డాక్టర్ మంగీ లాల్ జాట్
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 4:48PM by PIB Hyderabad
హైదరాబాద్లోని ఐకార్- భారత వరి పరిశోధన సంస్థలో (ఐకార్-ఐఐఆర్ఆర్) రూ. 12 కోట్ల విలువైన స్పీడ్ బ్రీడింగ్ సదుపాయానికి వ్యవసాయ పరిశోధన- విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. ఎల్. జాట్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. దీనితో పాటు రూ. 1.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక విత్తనాల గోదాంను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్సెస్) డాక్టర్ డీ. కే. యాదవ పాల్గొన్నారు.

అధిక దిగుబడి సామర్థ్యం, వాతావరణ మార్పులు- ఒత్తిళ్లను తట్టుకునే మెరుగైన వరి రకాల అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదుపాయాలను కొత్తగా ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రీడింగ్ సదుపాయం వల్ల నారు కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం తగ్గిపోతుంది. నాణ్యమైన విత్తనాలను సురక్షితంగా నిల్వ చేయటం, సకాలంలో పంపిణీ చేయడానికి ఈ ఆధునిక విత్తనాల గోదాం తోడ్పడుతుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మంగీ లాల్ జాట్.. వరి పరిశోధనకు ఐకార్-ఐఐఆర్ఆర్ అందిస్తోన్న శాస్త్రీయ సహకారాన్ని అభినందించారు. ఈ నూతన మౌలిక సదుపాయం అధునాతన పరిశోధనను సమర్థవంతమైన విత్తన వ్యవస్థలతో అనుసంధానించే దిశగా ఒక ముఖ్యమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ బ్రీడింగ్ సదుపాయం వరి అభివృద్ధిలో ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని, ఆధునిక విత్తనాల గోదాం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచేందుకు, పోషకాహార భద్రతను నిర్ధారించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. "వికసిత్ భారత్ కోసం వికసిత వ్యవసాయం" సంకల్పాన్ని సాకారం చేయటానికి పరిశోధన, విత్తన వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత సంస్థలోని శాస్త్రీయ, సాంకేతిక, పరిపాలనా సిబ్బందితో ఎం. ఎల్. జాట్ మాట్లాడారు. దేశంలో వరి పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంలో వారు అందిస్తోన్న సహకారాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఐకార్-ఐఐఆర్ఆర్ సాధించిన ప్రధాన విజయాలు, కొనసాగుతున్న పరిశోధనా కార్యక్రమాలు, భవిష్యత్తు దృక్పథాన్ని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్. ఎం. సుందరం ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.
NAL9.jpeg)
ఈ సందర్భంగా డాక్టర్ డీ. కే. యాదవ మాట్లాడుతూ.. పంట అభివృద్ధిని వేగవంతం చేయడానికి, రైతులకు నాణ్యమైన విత్తనాలు సులభంగా అందేలా చేయడానికి పరిశోధనా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. వరి పరిశోధన ద్వారా జాతీయ ఆహార భద్రతకు మద్దతునివ్వడంలో ఐకార్-ఐఐఆర్ఆర్ చేస్తున్న నిరంతర కృషిని కూడా ఆయన అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2258457)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13