ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: 50 రోజుల కౌంట్డౌన్ సందర్భంగా యోగా మహోత్సవంలో 6,000 మంది భుజంగాసనం.. ఆసియా రికార్డు నమోదు
యోగా మహోత్సవంలో ప్రపంచ దేశాల భాగస్వామ్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కౌంట్డౌన్లో చేరిన 20కి పైగా దేశాలు
‘‘2047 నాటికి ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణాయుత వికసిత భారత్ నిర్మాణానికి యోగా కీలక మార్గం’’: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి
‘‘యోగా, ఆరోగ్య సంరక్షణ రంగంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ కేంద్రంగా ఎదగాలి’’ : శ్రీ కిషన్ రెడ్డి
‘‘ఆరోగ్యం, శ్రేయస్సు విభాగాల్లో భారత్ గుర్తింపును యోగా ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేస్తోంది’’: కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్
‘‘యోగాను దైనందిన అలవాటుగా మార్చుకోవడానికి ‘యోగా 365’ ప్రచారం పౌరులను ప్రోత్సహిస్తుంది’’: శ్రీ ప్రతాపరావు జాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
02 MAY 2026 1:30PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు సంబంధించి 50 రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకుని ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్లో యోగా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం కన్హా శాంతి వనం వేదికైంది. వేలాది మంది యోగా ప్రేమికుల భాగస్వామ్యంతో ఈ ప్రాంగణం యోగమయంగా మారింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కన్హా శాంతి వనంలో సుమారు 6,000 మంది యోగా సాధకులు ఏకకాలంలో భుజంగాసనాన్ని ప్రదర్శించి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇంత భారీ స్థాయిలో ఒకే చోట ఈ ఆసనాన్ని ప్రదర్శించినందుకు గాను ఈ కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. సామూహిక భాగస్వామ్యం, అందరి ఆరోగ్యం అనే యోగా లక్ష్యాన్ని ఈ రికార్డు ప్రతిబింబించింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘యోగా కేవలం భారతీయ ప్రాచీన వారసత్వ సంపద మాత్రమే కాదు... మానవాళికి లభించిన ఒక అమూల్యమైన వరం. నేడు ప్రపంచవ్యాప్తంగా నాయకులు, నిపుణులు, ప్రజలు యోగా సాధన చేస్తూ దాని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు’’ అని అన్నారు.

దేశ నిర్మాణంలో యోగా పాత్రను వివరిస్తూ కిషన్ రెడ్డి ఇలా అన్నారు. ‘‘2047 నాటికి దేశం వికసిత్ భారత్గా అవతరించాలంటే మనం ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించుకోవాలి. నేటి ఆధునిక కాలంలో ఎదురవుతున్న ఒత్తిడి, అస్తవ్యస్త జీవనశైలి, కాలుష్యం వంటి సవాళ్లకు యోగా ఒక ఆచరణాత్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది’’. ఇప్పటికే ఆవిష్కరణలు, సాంకేతికతలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం రానున్న రోజుల్లో యోగా, సమగ్ర ఆరోగ్య సంరక్షణలో కూడా అంతర్జాతీయ కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ...‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో యోగా నేడు శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించే ప్రపంచ స్థాయి ఉద్యమంగా మారింది’’ అని కొనియాడారు. శ్రేయస్సు, ఆరోగ్య పర్యాటక రంగంలో భారత్ ఎదుగుతున్న తీరును ప్రస్తావిస్తూ... యోగా ద్వారా ప్రపంచవ్యాప్త శ్రేయస్సు కేంద్రంగా భారత్ తన గుర్తింపును మరింత బలోపేతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా ప్రారంభించిన ‘యోగా 365’ కార్యక్రమం గురించి వివరిస్తూ...‘‘ఆయుష్ మంత్రిత్వ శాఖ, హబిల్డ్, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ సంయుక్తంగా చేపట్టిన యోగా 365 ప్రచారం ద్వారా పౌరులందరూ యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం’’ అని తెలిపారు. జూన్ 21 వరకు కొనసాగే ఈ 100 రోజుల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో లక్ష మందికి పైగా భాగస్వామ్యం కల్పించడం, వారికి ‘యోగ్ మిత్ర’ ధ్రువీకరణ పత్రాన్ని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు సంబంధించి 25 రోజుల కౌంట్డౌన్ను సూచించేలా తదుపరి యోగా మహోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని ఖజురహోలో నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ఇది భారత సాంస్కృతిక వారసత్వం, అద్భుత కట్టడాలు, ఆరోగ్య సంప్రదాయాల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన ప్రపంచ ఎక్స్పో 2025 సందర్భంగా ఆరు నెలల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించిన హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూషన్, యోగా సర్టిఫికేషన్ బోర్డుల ప్రయత్నాలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్ మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ‘‘కన్హా శాంతి వనం, యోగా ద్వారా మనం సాధించాలనుకునే శాంతి, సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యం, ఐక్యత దిశగా దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలకడమే ఈ సమావేశం ఉద్దేశం’’ అని ఆమె తెలిపారు.
ఈ వేడుకలో హార్ట్ఫుల్నెస్ సంస్థ అధ్యక్షులు శ్రీ కమలేష్ డి పటేల్ (దాజీ), లోక్సభ ఎంపీ శ్రీమతి డీకే అరుణ, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేష్ కోటేచా సహా ఆయుష్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర యంత్రాంగం, ప్రముఖ యోగా సంస్థలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యోగా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కామన్ యోగా ప్రోటోకాల్ సామూహిక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎండీఎన్ఐవై డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) కాశీనాథ్ సమగండి, ఇతర శిక్షకుల నేతృత్వంలో ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం దాజీ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ యోగా కార్యక్రమం జరిగింది. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధమయ్యే క్రమంలో ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నాట్య యోగా ప్రదర్శనతో పాటు కొరియన్ బృందం సమర్పించిన యోగా ఫ్యూజన్ ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా అలరించాయి.
కజకిస్తాన్, లెసోతో, బల్గేరియా, క్యూబా, నమీబియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా సహా 20కి పైగా దేశాల రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు ఈ 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యోగా విస్తృతిని ప్రతిబింబిస్తుంది.
కన్హా శాంతి వనంలో జరిగిన యోగ మహోత్సవం, 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం దిశగా కీలక ముందడుగా నిలిచింది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు, సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ నిబద్ధతను ఇది మరోసారి చాటిచెప్పింది.


***
(రిలీజ్ ఐడి: 2257486)
సందర్శకుల సూచీ సంఖ్య : : 43