గనుల మంత్రిత్వ శాఖ
“ఇదే సమయం, ఇదే సరైన సమయం”: భారత కీలక ఖనిజాల వృద్ధి వేగవంతం లక్ష్యంగా రోడ్షో నిర్వహించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
ఖనిజ ఉత్పత్తిని పెంపొందించేందుకు గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నాం: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 5:41PM by PIB Hyderabad
'కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల 7వ విడత'... 'అన్వేషణ లైసెన్స్ బ్లాకుల 2వ విడత'కు సంబంధించి తెలంగాణలోని గచ్చిబౌలిలో గల హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి... తెలంగాణ గనుల శాఖ మంత్రి శ్రీ జి. వివేక్ వెంకటస్వామి... గనుల మంత్రిత్వ శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
72S6.jpeg)
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి, భారత అపార ఖనిజ సంపదను వెలికితీయడానికి మైనింగ్ రంగంలో చేపడుతున్న పరివర్తనాత్మక సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించారు. నిరంతర విధానపరమైన సంస్కరణలు, పారదర్శక వేలం విధానాలు, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించడం... ఈ రంగంలో వృద్ధిని ప్రోత్సహిస్తూ, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్లు శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుత విడతలో టంగ్స్టన్, లిథియం, తగరం, రాక్ ఫాస్ఫేట్ వంటి ఖనిజాలు సహా 19 కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాక్లు ఉన్నాయనీ... రెండో విడత కింద అన్వేషణ లైసెన్స్ బ్లాక్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవి దేశీయ సరఫరా వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడం, స్వయం సమృద్ధ భారత్ సాధన సహా ప్రపంచంతో పోటీపడే మైనింగ్ శక్తిగా భారత్ను నిలపాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ... "ఇదే సమయం, ఇదే సరైన సమయం" అని శ్రీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... పారదర్శక విధానాలు, వ్యాపార నిర్వహణ సౌలభ్యం, సమర్థ అనుమతులతో పెట్టుబడిదారులకు అనుకూలమైన మైనింగ్ వ్యవస్థను ప్రోత్సహించడంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రంగం వృద్ధిలో భాగస్వాములు చురుగ్గా పాలుపంచుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం, మొత్తం మైనింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా పారదర్శక ప్రక్రియలను, ఖనిజాల బ్లాక్లలో సకాలంలో కార్యాచరణను మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తోందని స్పష్టం చేశారు.
ఈ రోడ్షోకు భాగస్వాముల నుంచి మంచి స్పందన లభించింది. ఇది బిడ్డర్లలో ఆసక్తిని పెంపొందిస్తుందనీ... తద్వారా ప్రభుత్వ వికసిత్ భారత్ దార్శనికతకు దోహదపడుతుందని... ప్రపంచ మైనింగ్ రంగంలో విశ్వసనీయ, సమర్థ శక్తిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2251657)
సందర్శకుల సూచీ సంఖ్య : : 118