నౌకారవాణా మంత్రిత్వ శాఖ
భారతదేశ నౌకా నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించటానికి కేఓఐసీఏతో ఎంఓపీఎస్డబ్ల్యూ ఒప్పందం
సముద్ర రంగ కార్మిక శక్తి, పారిశ్రామిక పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు భారత్-కొరియా సహకారం
మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నౌకా నిర్మాణ వ్యవస్థ ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 2:22PM by PIB Hyderabad
భారత సముద్ర రంగ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కీలక ముందడుగులో భాగంగా కొరియా అంతర్జాతీయ సహకార సంస్థ (కేఓఐసీఏ)తో ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) ఏప్రిల్ 02, 2026న ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. భారత నౌకా నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిచేందుకు ఈ ఒప్పందం.
మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 ద్వారా నిర్దేశించిన ప్రతిష్ఠాత్మక లక్ష్యాలకు అనుగుణంగా.. 'భారతదేశ నౌకా నిర్మాణ, సముద్ర రంగం కోసం అభివృద్ధి వ్యూహాలను రూపొందించటం, నైపుణ్యం, వృత్తి నైపుణ్యాలు గల ప్రతిభావంతులను తయారుచేయటం' అనే ప్రాజెక్టు పేరుతో భారత ఆర్థిక వృద్ధికి, ప్రపంచ సముద్ర రంగంలో నౌకా నిర్మాణ రంగాన్ని వ్యూహాత్మకంగా కీలకమైన రంగంగా నిలబెట్టటమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా కేఓఐసీఏ, కొరియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇతర భాగస్వాముల మద్దతుతో భారత నౌకా నిర్మాణం, మెరైన్ ఇంజనీరింగ్ రంగాలపై సమగ్రమైన పరిశోధనను చేపట్టనుంది. ఈ కార్యక్రమం ప్రస్తుత సిబ్బంది నైపుణ్యాలను గుర్తించటం, నైపుణ్య లోపాల అంచనా, మానవ వనరుల అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికను, తగిన కార్యాచరణను రూపొందించటంపై దృష్టి సారిస్తుంది.
ఈ ఒప్పందంపై ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. "భారతదేశ సముద్రయాన ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకఘట్టం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల నౌకా నిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సముద్రయాన రంగాన్ని ఆర్థిక వృద్ధికి, వ్యూహాత్మక పటిష్టతకు కీలక శక్తిగా భారత్ మారుస్తోంది. ప్రపంచ నౌకా నిర్మాణ కేంద్రంగా భారత్ ఎదగటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం గల నవతరం నిపుణులను తీర్చిదిద్దడమే ఈ సహకార ముఖ్య ఉద్దేశం. మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 జాతీయ ప్రాధాన్యతలతో దక్షిణ కొరియా అధునాతన నైపుణ్యాన్ని అనుసంధానించటం ద్వారా శరవేగంగా మారుతున్న ప్రపంచ సముద్ర రంగ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని మేం సిద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా మన యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. పటిష్ఠమైన, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా గౌరవించే ఆత్మనిర్భర్ సముద్ర రంగాన్ని నిర్మించాలనే మా నిబద్ధతను స్పష్టం చేస్తుంది"
ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్, దక్షిణ కొరియా దేశాల్లో కార్మిక శక్తి అభివృద్ధిపై ద్వైపాక్షిక సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తమ పని విధానాలను పరస్పరం పంచుకోవటానికి, సహకారాన్ని మరింత బలోపేతం చేయటానికి ఈ సదస్సులు కీలక భాగస్వాములను, పరిశ్రమల అధినేతలను, విధాన రూపకర్తలను, విద్యా రంగ నిపుణులను ఒకచోట చేర్చుతుంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొరియా సాంకేతిక నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవటం ద్వారా భారతదేశపు నౌకా నిర్మాణ, సముద్ర రంగాల పురోగతికి ఈ భాగస్వామ్యం గణనీయంగా దోహదపడుతుంది. ఇది కార్మిక శక్తి విశ్లేషణను సులభతరం చేయడమే కాక, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుతుంది. అత్యున్నత నైపుణ్యం గల, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల సముద్రయాన కార్మిక శక్తిని అభివృద్ధి చేసే లక్ష్యంతో నిర్మాణాత్మక శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మద్దతునిస్తుంది.
ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ భారతదేశంలో 'నౌకా నిర్మాణ రంగ శ్రామిక శక్తి అభివృద్ధి, సాంకేతిక సహకార కేంద్రం' ఏర్పాటునకు సంబంధించి ఎంఓపీఎస్డబ్ల్యూ, కేఓఐసీఏ మధ్య తుది చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత కేంద్రం పరిశ్రమ అవసరాలకు తగిన వృత్తి విద్యా శిక్షణను అందించటం, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచటం, నౌకా నిర్మాణ రంగానికి అవసరమైన అధునాతన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉత్పాదకతను పెంచటంపై దృష్టి సారిస్తుంది.
నౌకా తయారీ, సముద్రయాన సేవల్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చే దిశగా ఈ ప్రయత్నం కీలక ఘట్టం. సామర్థ్య పెంపు, అంతర్జాతీయ సహకారం, స్థిరమైన సముద్రయాన వృద్ధి పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2248824)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23