భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: సాగర్ వాణి వ్యవస్థ
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 11:55AM by PIB Hyderabad
భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) పరిధిలోని ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్).. సముద్ర ఆధారిత ముందస్తు హెచ్చరికలు, సలహా సేవలను సమగ్రంగా అందిస్తోంది. ఈ సేవలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా అన్ని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 12 తీరప్రాంత జిల్లాల్లో (అనకాపల్లి, బాపట్ల, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం).. ఒడిశాలోని 6 తీరప్రాంత జిల్లాల్లో (బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్సింగ్పూర్, పూరీ, గంజాం) సముద్ర సమాచార సేవలు అందుతున్నాయి. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5 మత్స్య ల్యాండింగ్ కేంద్రాల (ఎఫ్ఎల్సీ) ద్వారా సేవలను విస్తరించారు. ఇవి సమీప గ్రామాలలోని మత్స్యకార వర్గాలకు తమ వేట పనులను ప్రారంభించడంలో తోడ్పడుతున్నాయి. అదేవిధంగా జగత్సింగ్పూర్ జిల్లాలో 11, పూరీ జిల్లాలో 20 మత్స్య ల్యాండింగ్ కేంద్రాల ద్వారా స్థానిక లబ్ధిదారులకు సముద్ర సమాచారాన్ని సులభంగా పొందేలా సౌకర్యం కల్పించారు.
భారత్లోని అన్ని తీరప్రాంత రాష్ట్రాలు, జిల్లాల్లో దాదాపు 8 లక్షల మంది మత్స్యకారులు.. ఇతర తీరప్రాంత లబ్ధిదారులు 'పొటెన్షియల్ ఫిషింగ్ జోన్' (పీఎఫ్జెడ్) సలహాలు, ఇతర ఇన్కాయిస్ సేవలను పొందుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,03,915 మంది, ఒడిశాలో 1,58,711 మంది వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్, సముద్ర మొబైల్ యాప్ వంటి వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా నేరుగా ఇన్కాయిస్ సేవలను అందుకుంటున్నారు. ఈ ప్రత్యక్ష మార్గాలే కాకుండా ఎన్జీఓలు, రిలయన్స్ ఫౌండేషన్, ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్, రాష్ట్ర మత్స్యశాఖల వంటి భాగస్వామ్య సంస్థల ద్వారా కూడా ఈ సేవలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా మరిన్ని ఎక్కువ మంది వినియోగదారులకు ఈ సమాచారం చేరుతోంది.
ఎస్ఎంఎస్, మొబైల్ ఫోన్లు, ఈమెయిల్, వెబ్సైట్, మొబైల్ యాప్లు, సామాజిక రేడియో, సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలు (జెమిని ప్లాట్ఫామ్, వీఓఐపీ ఫోన్లు) వంటి సమర్థవంతమైన మల్టీ-ఛానల్ కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా సముద్ర సంబంధిత హెచ్చరికలు, సలహాలను ఇన్కాయిస్ అందిస్తోంది. ఈ సమాచారం తీరప్రాంత వర్గాలు, మత్స్యకారులకు సులభంగా అర్థమయ్యేలా, వారు సమర్థవంతంగా వినియోగించుకునేలా చూసేందుకు 'పొటెన్షియల్ ఫిషింగ్ జోన్' సలహాలు, సముద్ర పరిస్థితి సూచనలను స్థానిక భాషలలో అందిస్తున్నారు. వీటితో పాటు 'కామన్ అలర్ట్ ప్రోటోకాల్' (సీఏపీ) ఆధారిత 'సచేత్' ప్లాట్ఫామ్ ద్వారా కూడా హెచ్చరికలను ఇన్కాయిస్ జారీ చేస్తోంది. ఇది సముద్ర సంబంధిత హెచ్చరికలను రాష్ట్ర, జిల్లా అధికారులకు సజావుగా చేరవేయడానికి.. తద్వారా వారు ప్రజలకు మరింత వేగంగా సమాచారాన్ని అందించడానికి వీలు కల్పిస్తోంది.
సముద్ర సమాచార సేవలను ఒకే వేదికపై అందించడానికి ఇన్కాయిస్.. బహుభాషా మొబైల్ యాప్ 'సముద్ర'ను (స్మార్ట్ యాక్సెస్ టూ మెరైన్ యూజర్స్ ఫర్ ఓషియన్ డాటా రిసోర్సెస్ అండ్ అడ్వైజర్స్) అభివృద్ధి చేసింది. ఈ యాప్ సునామీలు, తుపాను ఉద్ధృతి, భారీ అలలు, స్వెల్ సర్జ్ వంటి సముద్ర ప్రమాదాలపై ఎప్పటికప్పుడు తక్షణ హెచ్చరికలను జారీ చేస్తోంది. తద్వారా యాప్ వినియోగదారులు సకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతోంది. ఇది మత్స్యకారులు చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడేందుకు పీఎఫ్జెడ్ సలహాలను కూడా అందిస్తోంది. దీనివల్ల వేట సామర్థ్యం పెరగడమే కాకుండా వారి జీవనోపాధికి మద్దతు లభిస్తోంది. అదనంగా 'సముద్ర' యాప్ ఐదు రోజుల సముద్ర పరిస్థితి సూచనలను అందిస్తూ నావికులు, మత్స్యకారులు, తీరప్రాంత వర్గాలకు ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం, ప్రమాదాలను తగ్గించడం, సముద్ర భద్రతను పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాతో పాటు ఒడిశాలోని జగత్సింగ్పూర్, పూరీ జిల్లాల్లో ఈ కమ్యూనికేషన్ మార్గాలన్నీ విస్తృతంగా ఉపయోగమవుతున్నాయి.
మారుమూల తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు సముద్ర సలహాలను సమర్థవంతంగా చేరవేసే లక్ష్యంతో అన్ని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిరంతర అవగాహన, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక అధికారులు, విద్యా సంస్థలు, తీరప్రాంత భాగస్వాముల సహకారంతో అవగాహన సదస్సులు, వర్క్షాప్లు, శిక్షణా కార్యక్రమాలు, సునామీ మాక్ డ్రిల్స్, సునామీ సిద్ధత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ముఖ్యంగా సుదూర, తీరానికి దూరంగా ఉన్న జలాల్లో వేటకు వెళ్లే మత్స్యకారులు, తీరప్రాంత వర్గాల కోసం ఇన్కాయిస్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుల ముఖాముఖి వర్క్షాప్లు, శిక్షణా తరగతుల ద్వారా వారి సంసిద్ధత, కార్యాచరణ భద్రత, పరిస్థితిపై అవగాహన, ప్రమాదాల తీవ్రతను తగ్గించే నైపుణ్యాలను పెంపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా, ఒడిశాలోని జగత్సింగ్పూర్, పూరీ జిల్లాల్లో ఇటువంటి అవగాహన సదస్సులు, బీచ్ శుభ్రత కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 'సునామీ సంసిద్ధత' కార్యక్రమంలో భాగంగా ఒడిశాలోని జగత్సింగ్పూర్, పూరీ జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి ఐదు తీరప్రాంత గ్రామాలను యునెస్కో-ఐఓసి 'సునామీ సంసిద్ధ' సామాజాలుగా గుర్తించింది.
ఈ సమాచారాన్ని 2026 ఏప్రిల్ 1వ తేదీన లోక్సభలో కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2247983)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14