రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిస్థితి, భారత రక్షణ సన్నద్ధతపై దాని ప్రభావం గురించి రక్షణ మంత్రి సమీక్ష
మన సన్నద్ధతను మెరుగుపరచుకోవడానికి కార్యాచరణ, సాంకేతిక పాఠాల అధ్యయనం అవసరం
ఆత్మనిర్భరతను నిర్ధారిస్తూ... నేర్చుకున్న పాఠాలు, సవాళ్లు, అవకాశాలను పరిగణిస్తూ... రాబోయే దశాబ్దం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి: రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 4:43PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పశ్చిమాసియాలోని పరిస్థితిని, భారత రక్షణ సన్నద్ధతపై దాని ప్రభావాన్ని న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సర్వీస్ చీఫ్లు, రక్షణ కార్యదర్శి, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి, డీఆర్డీవో ఛైర్మన్లు పాల్గొన్నారు.
ప్రపంచ, ప్రాంతీయ భద్రతా పరిస్థితి, కొనసాగుతున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చితే భారత్పై వాటి ప్రభావం, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి వల్ల ఎదురయ్యే సవాళ్లు, అవకాశాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. రక్షణ పరికరాల సమీకరణ, ఉత్పత్తికి సంబంధించిన సరఫరా గొలుసు నిర్వహణ, ఇప్పటికే ఉన్న పరికరాల నిర్వహణ, వినియోగ సామర్థ్యంపై ఈ పరిస్థితి ప్రభావాన్నీ వారు చర్చించారు.
భారత్ సంసిద్ధతను మెరుగుపరచడం కోసం, కొనసాగుతున్న ఘర్షణల నుంచి నేర్చుకున్న కార్యాచరణ, సాంకేతిక పాఠాలను నిరంతరం అధ్యయనం చేయాలని రక్షణ మంత్రి ఆదేశించారు. "నేర్చుకున్న పాఠాలు, సవాళ్లు, భవిష్యత్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ... అన్ని రంగాల్లో ఆత్మనిర్భరతను, కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారిస్తూ... రాబోయే దశాబ్దం కోసం ఒక సమగ్ర సమీకృత రోడ్మ్యాప్ను మనం అధికారికంగా రూపొందించుకోవాలి," అని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2244752)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6