పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో అనుసంధానం ద్వారా సమావేశాలు/వెబినార్లు నిర్వహించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా గతంలో ప్రజా పరిపాలనలో అత్యుత్తమ పనితీరుతో పురస్కారాలు గెలుచుకున్న విజేతలను వారి అనుభవాలను మరింత వ్యాప్తి చేయడం, అనుసరించడం లక్ష్యంగా ప్రదర్శన ఇచ్చేందుకు ఆహ్వానించారు.
ప్రజా పరిపాలనలో అత్యుత్తమ పనితీరు పురస్కార పథకం కింద పురస్కారం గెలుచుకున్న నామినేషన్ల వ్యాప్తి, అనుసరణను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఏప్రిల్, 2022 నుంచి 35 జాతీయ సుపరిపాలన వెబినార్లను, ప్రతి నెలా ఒక వెబినార్ను డీఏఆర్పీజీ నిర్వహించింది. ప్రతి వెబినార్లో సంబంధిత విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర పరిపాలనా శిక్షణా సంస్థలు, కేంద్ర శిక్షణా సంస్థల నుంచి దాదాపు 1000 మంది అధికారులు హాజరవుతారు.
ఈ వెబ్నార్లు కార్యక్రమ సంస్థాగతీకరణ/సుస్థిరతల ప్రస్తుత స్థితిని ప్రదర్శించడమే కాకుండా, దాని అనుసరణ/విస్తరణ స్థితి గురించి అభిప్రాయాలను అందిస్తాయి.
35వ వెబినార్ ఈ రోజు జరిగింది. దీనిలో 'జిల్లాల సమగ్ర అభివృద్ధి' ఇతివృత్తంతో నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో 2023 సంవత్సరానికి ప్రజా పరిపాలన విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి పురస్కారం ప్రదానంతో పాటు వారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు భాగంగా ఉన్నాయి:
i. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కార్యక్రమం గురించి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి శ్రీ ప్రసన్న వెంకటేష్ వి. ప్రజెంటేషన్ ఇచ్చారు.
ii. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా కార్యక్రమం గురించి జమ్మూ కాశ్మీర్, కుల్గామ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ అథా అమీర్ ఖాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ వెబినార్ కు డీఏఆర్పీజీ అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ యాదవ్ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 740కి పైగా ప్రదేశాల నుంచి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సంస్కరణల విభాగాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయి-జిల్లాస్థాయి అధికారులు, కేంద్ర-రాష్ట్ర పరిపాలనా శిక్షణా సంస్థల అధికారులు ఈ వెబినార్కు హాజరయ్యారు.
***