గనుల మంత్రిత్వ శాఖ
రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ, మైనింగ్, విలువను మెరుగుపరిచే చర్యలను వేగవంతం చేసిన భారత్
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 10:28PM by PIB Hyderabad
డీఏఈలో భాగమైన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎమ్డీ)... తీరప్రాంతాలు, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అలాగే దేశంలోని అనేక సంభావ్య భౌగోళిక ప్రాంతాల్లోని కఠినమైన రాతి భూభాగాల్లోనూ రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ, నిల్వల పెంపుదల పనులను నిర్వహిస్తోందని బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
28.01.2026 నాటికి, ఏఎమ్డీ అంచనా వేసిన రేర్ ఎర్త్ ఖనిజ వనరులు:
(i) తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని తీరప్రాంత బీచ్, టెరి /ఎర్ర మట్టి, లోతట్టు ఒండ్రు ప్రాంతాల్లో 13.15 మిలియన్ టన్నుల (Mt) మోనాజైట్ (థోరియం, రేర్ ఎర్త్ ఖనిజం) కలిగిన 136 బీచ్ ఇసుక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాల్లో సుమారు 7.23 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్ (ఈక్యూ.) రూపంలోని వనరులు ఉన్నాయి.
(ii) రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో గల కఠినమైన శిలల్లో రేర్ ఎర్త్ ఖనిజాల మూడు నిక్షేపాలు 1.29 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్ (ఈక్యూ.) రూపంలోని వనరులను కలిగి ఉన్నాయి.
రేర్ ఎర్త్ (ఆర్ఈ)ను కలిగి ఉన్న ధాతువు అయిన మోనజైట్ రేడియోధార్మిక మూలకాలైన యురేనియం, థోరియంతో సంబంధం కలిగి ఉండే పదార్ధాలున్నందున, దీని మైనింగ్, ప్రాసెసింగ్, శుద్ధి ప్రక్రియలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఆర్ఈ రంగంలో ప్లాంట్, టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి పరంగా ప్రపంచంలోనే ఈ సామర్థ్యం కలిగిన మూడు నుంచి నాలుగు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.
భారతీయ వనరులు గ్రేడ్ పరంగా గణనీయంగా తక్కువ గాఢత కలిగి ఉంటాయి. ఇవి రేడియోధార్మిక మూలకాలతో ముడిపడి ఉండటం వలన వెలికితీత ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది, ఖరీదైనదిగా ఉంటుంది. పైగా భారతీయ వనరులు ప్రధానంగా తేలికపాటి రేర్ ఎర్త్ మూలకాలను కలిగి ఉంటాయి.
రేర్ ఎర్త్ మూలకాల ఖనిజాలను వెలికితీసేందుకు, శుద్ధి చేయడానికి తగిన వనరులు, సామర్థ్యాలను భారత్ కలిగి ఉన్నప్పటికీ... తగినంత సాంకేతికత లేకపోవడం, ఆర్ఈఈ రంగంలో ఈ ముడి ఖనిజాన్ని అత్యాధునిక సాంకేతిక భాగాలు, తుది ఉత్పత్తులుగా మార్చే కీలకమైన, విలువను పెంచే సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఖనిజాల వాణిజ్య మైనింగ్, ప్రాసెసింగ్ పరిమితంగా ఉంది.
కీలక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ను పెంచడానికి ఎమ్ఎమ్డీఆర్ సవరణ చట్టం-2023 ద్వారా గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 [ఎమ్ఎమ్డీఆర్ చట్టం-1957]ను సవరించారు. ఈ చట్టంలోని మొదటి షెడ్యూల్ భాగము-డిలో పొందుపరచిన 24 కీలక, వ్యూహాత్మక ఖనిజాల కోసం బ్లాకులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించారు. అన్వేషణ లైసెన్స్ అనే కొత్త మైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా గనుల మంత్రిత్వ శాఖ రేర్ ఎర్త్ మూలకాలు సహా 46 కీలక ఖనిజాల బ్లాకులను ఆరు విడతల్లో విజయవంతంగా వేలం వేసింది. అదనంగా, కేంద్ర ప్రభుత్వం అన్వేషణ లైసెన్స్ గల 7 బ్లాక్లనూ విజయవంతంగా వేలం వేసింది. ఇందులో ఆర్ఈఈ బ్లాకులూ రెండు ఉన్నాయి.
కీలక ఖనిజాల (ఆర్ఈలు సహా) దీర్ఘకాలిక నిరంతర సరఫరాను నిర్ధారించడానికి... ఖనిజ అన్వేషణ, మైనింగ్ నుంచి మొదలుకొని విలువైన పదార్థాలను తిరిగి పొందేందుకు, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు నిరుపయోగ వస్తువులను (ఎలక్ట్రానిక్స్, వాహనాలు, సౌర ఫలకాలు వంటివి) నిర్వహించే క్రమబద్ధమైన, బహుళ-దశల విధానం వరకు అన్ని దశలను కలిగి ఉన్న భారత్…. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అవసరమైన ఖనిజాల (లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్) మొత్తం జీవితచక్రాన్ని సురక్షితం చేయడం, అభివృద్ధి చేయడం, స్వదేశీకరణ లక్ష్యంగా 2025 జనవరి 29న నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎమ్ఎమ్) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కీలక ఖనిజాల ప్రాజెక్టులకు సకాలంలో పర్యావరణ, అటవీ అనుమతులను సులభతరం చేయడం కోసం నియంత్రణ, విధానపరమైన సంస్కరణలు చేపట్టారు. క్షీణించిన అటవీ భూమిలో పరిహారంగా అటవీ పెంపకాన్ని అనుమతించడం, కీలక ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టులను బహిరంగ విచారణ అవసరం నుంచి మినహాయించడం మొదలైనవి వీటిలో భాగంగా ఉన్నాయి.
2025, నవంబరులో కేంద్ర మంత్రివర్గం రూ.7280 కోట్ల ఆర్థిక వ్యయంతో "సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్’’ తయారీ ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. దీని ద్వారా దేశంలో సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నుల (ఎమ్టీపీఏ) ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (ఆర్ఈపీఎమ్) తయారీని సాధించవచ్చు. తద్వారా స్వయం-సమృద్ధిని పెంచవచ్చు. ప్రపంచ ఆర్ఈపీఎమ్ మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషించవచ్చు.
****
(రిలీజ్ ఐడి: 2223110)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2