లోక్సభ సచివాలయం
మన మహిళలు చదువుకుని, సాధికారిత పొందినపుడే సమ్మిళిత్వంతో అభివృద్ధి చెందిన భారత్ సాధ్యం: లోక్ సభ స్పీకర్ మహిళల నేతృత్వంలో అభివృద్ధి, పిల్లల అభివృద్ధి...
2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న దార్శనికతకు పునాది: లోక్ సభ స్పీకర్
నారీశక్తి వందన్ చట్టం కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన ఒక నిబంధన కాదు..
ప్రజాస్వామ్యంలో మహిళలకు దక్కాల్సిన సరైన స్థానాన్ని అందించే ఒక చారిత్రాత్మక అడుగు: లోక్ సభ స్పీకర్
భారత రాజ్యాంగం స్త్రీపురుష భేదం లేకుండా, సమానత్వానికి మూలస్తంభంగా
ఉండటానికి కారణం...రాజ్యాంగ సభలోని15 మంది మహిళా సభ్యులు: లోక్ సభ స్పీకర్
భారత నారి అంటే.. పురాతన కాలంలోని పండితుల నుంచి స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వరకూ గౌరవం: లోక్ సభ స్పీకర్
మహిళా సాధికారత ఓ నిరంతర ప్రక్రియ.. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు
కొత్త చట్టాలు, విధాన సంస్కరణలు, మహిళా భాగస్వామ్యం అవసరం: లోక్ సభ స్పీకర్
ఆలోచనలను పంచుకోవటంలో మహిళల సాధికారతపై పని చేస్తోన్న కమిటీల సమావేశం కీలకం...
సమగ్ర విధాన రూపకల్పనకు మార్గం సుగమం: లోక్ సభ స్పీకర్
మహిళా సాధికారతపై పని చేస్తోన్న కమిటీలకు సంబంధించిన
చరిత్రాత్మక తొలి జాతీయ సమావేశాన్ని తిరుపతిలో ప్రారంభించిన లోక్ సభ స్పీకర్
Posted On:
14 SEP 2025 5:47PM by PIB Hyderabad
వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలనే దార్శనికతకు మహిళా సాధికారత, పిల్లల సంక్షేమంతో ముడిపడి ఉన్న మహిళల నేతృత్వంలోని అభివృద్ధి... పునాది వంటిదని లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారు. మహిళా సాధికారతపై పని చేస్తున్న పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు సంబంధించిన కమిటీల తొలి జాతీయ సమావేశాన్ని ఆయన తిరుపతిలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆడబిడ్డలు విద్యావంతులై స్వావలంబన పొందినప్పుడే భారత్ సమ్మిళితత్వంతో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. ఈ సమావేశానికి 20 కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
"వికసిత్ భారత్ కోసం మహిళల నేతృత్వంలో అభివృద్ధి" అనే అంశంపై ఈ రెండు రోజుల సమావేశం జరుగుతోంది. ఇందులో ‘జెండర్ బడ్జెటింగ్’, ‘అధునాతన సాంకేతికతల సవాళ్లను ఎదుర్కొనేలా మహిళలకు సాధికారత కల్పించటం" అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయడం, పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం, సమ్మిళిత విధానాలు ఉండేలా చూసుకోవటం, మహిళలను కేవలం లబ్ధిదారులుగానే కాకుండా జాతీయాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉన్న భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చింనున్నారు.
మహిళా సాధికారతపై పనిచేస్తోన్న కమిటీల జాతీయ సమావేశం మొదటిసారిగా జరుగుతోందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక కీలక ఘట్టమని లోక్ సభ స్పీకర్ అన్నారు. ఇటువంటి సమావేశాలు.. ఆలోచనలు, అనుభవాలను పంచుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయని, సమగ్ర విధాన రూపకల్పనకు మార్గం సుగమం చేస్తాయని ఆయన అన్నారు.
ఈ సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న చట్ట సభల సభ్యులు, విధాన నిర్ణేతలు, మహిళా నాయకులను ఒకచోట చేర్చింది. మహిళల నాయకత్వం, సమానత్వం, జీవితంలోని ప్రతి దశలోనూ మహిళలను కలుపుకొని వెళ్లటానికి సంబంధించిన వ్యూహాలను సమిష్టిగా రూపొందించనుంది.
‘మహిళా సాధికారత, శిశు సంక్షేమ సమస్యలు అలక్ష్యం చేయదగినంత చిన్నవి కావు. అవి జాతీయ పురోగతికి చెందిన పునాదితో ముడిపడి ఉన్నాయి’ అనే స్పష్టమైన, శక్తిమంతమైన సందేశాన్ని తిరుపతి సమావేశం పంపుతుందని లోక్ సభ స్పీకర్ అభిప్రాయపడ్డారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళా నాయకత్వం, సమ్మిళిత చట్టాలు, విధానాలు, ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం అనే అంశంపై దృష్టి సారించనున్న ఈ సమావేశం.. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో కీలక పురోగమన ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
మహిళా సాధికారత అనేది ఒకేసారి చేపట్టే కార్యక్రమం కాదని.. జీవితంలోని ప్రతి దశలోనూ మహిళల అవసరాలను తీర్చే సమగ్ర విధానాలను తయారుచేయాల్సిన నిరంతర ప్రక్రియ అని స్పీకర్ ప్రధానంగా చెప్పారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొన్న సవాళ్లు, అడ్డంకులను పరిష్కరించడంలో విధాన, చట్టాల రూపకల్పన మహిళల భాగస్వామ్యాన్ని పెంచటం అనేది ఉపయోగపడుతుందని అన్నారు. భారత్ అమృత కాలంలోకి అడుగుపెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాన్ని బలం, సమ్మిళితత్వం వైపు నడిపించే తిరుగులేని శక్తిగా నారీ శక్తి తయారతోందని అన్నారు.
దేశానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల సామర్థ్యం, నాయకత్వం, భాగస్వామ్యం అనేవి సమానత్వానికి సంబంధించిన అంశాలు మాత్రమే కావని.. సమ్మిళిత, సుస్థిర వృద్ధికి పునాది అని ఆయన వివరించారు. విద్య, శాస్త్రీయ విజ్ఞానం, పరిపాలన, సాంకేతికత, వ్యవస్థాపకత, ఆవిష్కరణలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు జాతీయ పురోగతి వేగాన్ని, స్వభావాన్ని .. మహిళలు పోషిస్తోన్న పాత్ర, వారి సురక్షితమైన భవిష్యత్తు అనేవి నిర్ణయిస్తాయని తెలిపారు.
మరింత సమానత్వ, సమ్మిళిత సమాజానికి బాటలు వేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు. ధైర్యవంతులైన ఈ మహిళలు అడ్డంకులను అధిగమించి మూస ధోరణులను అధిగమించి నాయకులుగా, వ్యూహకర్తలుగా, సంస్కర్తలుగా ఎదిగారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు.. న్యాయం, సమానత్వం కోసం పోరాటం అని కూడా వారు నిరూపించారు. విద్య, ఆరోగ్యం, దేశాభివృద్ధి, మహిళల హక్కులు వంటి రంగాల్లో వారు చేసిన కృషి స్వతంత్ర భారత్లో సమానత్వం, న్యాయానికి సంబంధించిన విలువలు సజీవంగా ఉండేలా చూసిందని అన్నారు.
రాజ్యాంగ సభలో కూడా 15 మంది మహిళా సభ్యులు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగమయ్యారు. భారత రాజ్యాంగాన్ని లింగ తటస్థంగా ఉండేలా వారి దార్శనికత, దృక్పథాలు ప్రభావితం చేశాయని అన్నారు. అవి మహిళలకు సమాన హక్కులు, అవకాశాలకు బలమైన పునాదిని వేశాయని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు. ఈ క్రియాశీల మహిళల భాగస్వామ్యం ఫలితంగానే రాజ్యాంగంలో స్వేచ్ఛా, సమానత్వాలు ఉన్నాయని ప్రధానంగా చెప్పారు.
ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా.. మహిళల నాయకత్వం గురించి ప్రస్తావించారు. గార్గి, అనుసుయ వంటి ప్రాచీన మేథావుల నుంచి రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి పరాక్రమవంతులైన నాయకుల వరకు ధైర్యం, విజ్ఞానం, త్యాగం ద్వారా భారతదేశ చరిత్రను మహిళలు రూపొందించారని ఆయన అన్నారు. భారతీయ మహిళలు నేడు అంతరిక్ష పరిశోధన నుంచి శాస్త్ర సాంకేతికతల వరకు, క్రీడల నుంచి సాహిత్యం వరకు, స్థానిక స్వపరిపాలన నుంచి జాతీయ నాయకత్వం వరకు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్కు మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, స్పీకర్లు, శాసనసభ్యులు ఉన్నారని.. ఇది చాలా గర్వకారణం అని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా నారీశక్తి వందన్ అభినియాన్ని ఆయన ప్రస్తావించారు. దీన్ని మహిళలకు సంబంధించిన పరివర్తనకు సంస్థగత రూపాన్నిచ్చే చారిత్రాత్మక రాజ్యాంగ సంస్కరణగా వర్ణించారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ను అందిస్తూ కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదించిన మొదటి బిల్లు ఇదేదని.. ఇదెంతో గర్వంచదగ్గ విషయమని అన్నారు. ఈ కీలక చట్టం కేవలం ప్రతీకాత్మకం కాదని.. మహిళలకు పరిపాలనలో సరైన స్థానాన్ని అందించేలా చూసుకుంటూ దేశ భవిష్యత్తును రూపొందించేందుకు కొత్త తరం మహిళా నాయకులను సిద్ధం చేయడానికి దోహదపడతుందని ఉద్ఘాటించారు.
ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందేలా చూసుకోవటం అనేది ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ను సాధించడంలో కీలకమన్న ప్రధానమంత్రి దార్శనికతను లోక్సభ స్పీకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నేడు నాయకులు, ఆవిష్కర్తలు, సంరక్షకులు, వ్యవస్థాపకులుగా మహిళలు లేని రంగం లేదని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలలోని క్షేత్రస్థాయి ప్రతినిధుల నుంచి శాస్త్ర సాంకేతికత, ప్రభుత్వ సంస్థలకు మహిళల నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. భారత్లో ప్రగతి చోదకులుగా, దేశ నిర్మాతలుగా మహిళలు ఎదగటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు.
ప్రారంభ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, మహిళా సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి డీ. పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ సీ. అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, శాసనసభ- శాసనమండలి సభ్యులు.. పార్లమెంటు - రాష్ట్ర- కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభల మహిళా సాధికారతకు సంబంధించిన కమిటీల చైర్పర్సన్లు, సభ్యులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు లోక్సభ స్పీకర్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. చాలా కాలంగా భక్తి, త్యాగం, మహిళల భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుపతిని అభివర్ణించారు. భారత అభివృద్ధి ప్రయాణంలో మహిళలు, పిల్లలను కేంద్రంగా నిలపాలనే జాతీయ సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి ఇది సరైన వేదిక అని లోక్సభ స్పీకర్ అన్నారు.
***
(Release ID: 2166654)
Visitor Counter : 11