రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నౌకాదళంలోకి సరికొత్త స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్
Posted On:
01 JUL 2025 8:04PM by PIB Hyderabad
ఐఎన్ఎస్ తమాల్ (ఎఫ్ 71)ని మంగళవారం (2025 జులై1న) రష్యాలోని కలినిన్గ్రాడ్లో గల యంతర్ షిప్యార్డులో భారతీయ నౌకాదళంలోకి చేర్చుకొన్నారు. పశ్చిమ నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జీత్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యుద్ధనౌక ఉత్పత్తి, కొనుగోళ్ల కంట్రోలరు వైస్ అడ్మిరల్ రాజారాం స్వామినాథన్, రష్యా ఫెడరేషన్కు చెందిన బాల్టిక్ నౌకాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ సర్జీ లిపిన్తో పాటు భారతీయ, రష్యన్ ప్రభుత్వాల, నౌకాదళాల, పరిశ్రమలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ 1135.6 శ్రేణిలో ఎనిమిదో బహుళ విధులను నెరవేర్చే స్టెల్త్ తరహా యుద్ధనౌకల్లో ఐఎన్ఎస్ తమాల్ ఎనిమిదోది. అంతేకాదు, ఇది తుశీల్ శ్రేణిలోని అదనపు ఫాలో-ఆన్ నౌకల్లో రెండోది కూడా. తుశీల్ శ్రేణికి చెందిన ఒకటో నౌక (ఐఎన్ఎస్ తుశీల్)ను 2024 డిసెంబరు 9న గౌరవ రక్షణ మంత్రి సమక్షంలో నౌకాదళంలోకి చేర్చుకొన్నారు. ఇప్పటి వరకు చేర్చుకొన్న ఏడు నౌకలు పశ్చిమ నౌకాదళ కమాండ్లో భాగంగా భారతీయ నౌకాదళానికి చెందిన వెస్టర్న్ ఫ్లీట్ ‘ద స్వోర్డ్ ఆర్మ్’లో భాగమయ్యాయి. ఈ కార్యక్రమం భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ తమాల్ లాంఛన ప్రవేశానికి సూచికగా నిలిచింది. ఈ నౌకకు కెప్టెన్ శ్రీధర్ టాటా నాయకత్వం వహిస్తున్నారు. ఆయన శతఘ్ని ప్రయోగంలోనూ, క్షిపణి ప్రయోగంలోనూ నిపుణుడు.
నౌకను నడిపే సిబ్బందితో పాటు రష్యాకు చెందిన బాల్టిక్ నావల్ ఫ్లీట్ కు చెందిన సిబ్బంది ఒక చక్కని సంయుక్త గౌరవ వందనంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం మొదలైంది. యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎండ్రీ సర్గెయెవిచ్ పుచ్కోవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ, రష్యన్ నౌకాదళాల మధ్య నౌకావాణిజ్య సంబంధిత సాంకేతిక సహకారాన్ని గురించి, ఈ సహకారం ఇకమీదటా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను గురించి రష్యన్ ఫెడరేషన్కు చెందిన ఫెడరల్ సర్వీస్ ఫర్ టెక్నలాజికల్ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మిఖాయిలవ్ బేబిచ్ తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. తరువాత రష్యా ప్రభుత్వంలో సీనియర్ ప్రముఖులతో పాటు సీడబ్ల్యూపీ అండ్ ఏ వైస్ అడ్మిరల్ ఆర్. స్వామినాథన్ ప్రసంగించారు. తమాల్ జలప్రవేశ సన్నివేశాన్ని భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా ఉందని ఆయన అన్నారు. ఇది పరస్పర సహకార శక్తినీ, రెండు దేశాల టెక్నాలజీల ప్రదర్శన సామర్థ్యానికి కూడా ఉదాహరణ అని అన్నారు. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కాలపరీక్షకు తట్టుకొని నిలిచిందనీ, గత 65 సంవత్సరాల్లో ఈ సహకారపూర్వక కృషితో నిర్మాణం పూర్తి అయిన 51వ నౌక... తమాల్ అనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన అందరికీ, ముఖ్యంగా షిప్యార్డు కార్మికులు, భారతీయ ఓఈఎంలు, రష్యన్ ఓఈఎంలకు వారి శ్రేష్ఠమైన పనితనానికి గాను, అలాగే స్వదేశీ వ్యవస్థలను తిరుగులేని విధంగా అనుసంధానించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతికి భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు కూడా ఎంతో తోడ్పాటును అందించాయి.
దీనికి తరువాయి, డెలివరీ యాక్ట్పై కమాండింగ్ ఆఫీసర్ డిజిగ్నేట్, రష్యా నావల్ డిపార్ట్మెంటు డైరెక్టర్ జనరల్ శ్రీ సర్గెయి కుప్రియనావ్ సంతకం చేశారు. దీంతో నౌకను భారతీయ నౌకాదళానికి బదలాయించే లాంఛనం పూర్తి అయింది. తదనంతర కార్యక్రమంలో భాగంగా రష్యన్ నౌకాదళ ధ్వజాన్ని కిందకు దింపారు. కమాండింగ్ ఆఫీసరుకు కమిషనింగ్ వారంటును నావల్ స్టాఫ్ చీఫ్ జారీ చేశారు. భారతీయ నౌకాదళం ధ్వజాన్ని ప్రముఖ అతిథుల సమక్షంలో ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. సాంప్రదాయిక వందనం ‘కలర్ గార్డ్’ను నావిక సిబ్బంది సగర్వంగా ప్రదర్శించారు. దీంతో పాటే, నౌక కమిషనింగ్ ను సూచించే పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇది ఈ నౌక నౌకాదళ సేవలలో భాగం అయిందనడానికి ఒక సంకేతం. నౌక విధులను నిర్వర్తిస్తున్నంత కాలం, ఈ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది.
ముఖ్య అతిథి వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జీత్ సింగ్ తన ప్రసంగంలో…. భారతీయ నౌకాదళంలో తమాల్ చేరడం దేశ నౌకావాణిజ్య సంబంధిత రక్షణ సామర్థ్యాలు, భారత్-రష్యా సహకారం.. వీటిలో ఒక ముఖ్య ఘట్టమని అభివర్ణించారు. విశ్వసనీయతకూ, కౌశలానికీ పేరుతెచ్చుకొన్న తల్వార్, తేగ్, ఇంకా తుశీల్ శ్రేణికి చెందిన నౌకల్లో ఇప్పుడు తమాల్ కూడా చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభావవంతంగాను, జ్ఞాపకం పెట్టుకోదగ్గదిగాను నిర్వహించడంలో నావిక సిబ్బందినీ, యంతర్ షిప్యార్డుకూ వారు చేసిన కృషికి గాను సీఇన్సీ అభినందనలు తెలిపారు. యుద్ధనౌకను నిర్మించడంలో అలుపెరుగని రీతిలో ప్రయత్నాలు చేసినందుకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఎఫ్ఎస్ఎంటీసీ, రోసోబోరోన్ఎక్స్పోర్ట్, యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్, యంతర్ షిప్యార్డులతో పాటు యుద్ధనౌక పర్యవేక్షక బృందాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ‘‘ఐఎన్ఎస్ తమాల్ వంటి బహుముఖీన వేదికల చేరికతో భారతీయ నౌకాదళం విస్తృతి, ప్రతిస్పందనశీలత్వం, ఎలాంటి క్లిష్ట స్థితుల్లోనైనా దృఢత్వాన్ని కలిగి ఉండే స్వభావం.. ఇవి మరింత వృద్ధి చెందాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ నౌక జాతీయ నౌకావాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడం, నౌకావాణిజ్య సంబంధ భద్రతను పెంచుకొనే దిశగా మన యుద్ధ నిర్వహణ కార్యకలాపాల స్వరూపంలో బలాన్ని అంతకంతకూ మరింత పెంచుకొనే రీతిలో తన యోగ్యతను నిరూపించుకొంటుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన అన్నారు.
తమాల్కు దీని పూర్తి సంగ్రామ సామర్థ్యాన్ని సంతరించడంలో రష్యన్ నౌకాదళం, బాల్టిక్ ఫ్లీట్లు పోషించిన పాత్రను ముఖ్య అతిథి ప్రశంసించారు. అలాగే కమిషనింగ్ క్రూ చాటిన అంకితభావాన్ని, వృత్తినైపుణ్యాన్ని కూడా ఆయన అభినందించారు. రష్యాలో నిర్మాణం పూర్తయినప్పటికీ, ఈ నౌకలో బ్రహ్మోస్ దూరగామి క్రూయిజ్ క్షిపణి, హమ్సా-ఎన్జీ సోనార్ సిస్టమ్లు సహా 26 శాతం స్వదేశీ విడిభాగాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ శ్రేణికి చెందిన తరువాతి రెండు నౌకల నిర్మాణం భారత్లో చేపట్టనుండటం పరస్పర బలం, ఉమ్మడి సామర్థ్యాల సద్వినియోగంతో పాటు సమన్వయపరుచుకొనే అవకాశాలను మరింత పెంచనుందన్నారు. భారతీయ నౌకాదళం ఒక విశ్వసనీయ, సమర్ధ, పొందికైన, భవిష్యత్కాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏ సవాలుకైనా ఎదురొడ్డి నిలవడానికి తయారుగా ఉందని చెబుతూ ఆయన తన ప్రసంగాన్న ముగించారు.
ముఖ్య అతిథి నౌకలో కలియదిరిగే అవకాశాన్ని కమాండింగ్ ఆఫీసరు కల్పించారు. ఈ నౌక తన సహ నౌకలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంతో పాటు వెనుకటి శ్రేణి నౌకలతో పోలిస్తే చేసిన కొత్త మార్పులను గురించి కూడా కమాండింగ్ ఆఫీసరు వివరించారు. దీని తరువాత సందర్శకుల పుస్తకంలో సంతకం చేసే ముందు స్మృతి చిహ్నాలను ఇచ్చి పుచ్చుకొన్నారు. అనంతరం, ఆయన ‘హై టీ’ కార్యక్రమంలో అతిథులతోనూ, ప్రముఖులతోనూ సంభాషించారు.
సముద్రంలో శత్రుభయంకరమైన కదిలే కోటగా ఐఎన్ఎస్ తమాల్ను చెప్పుకోవచ్చు. దీనిని నాలుగు కోణాలు అంటే వాయు, ఉపరితలం, నీళ్ల కింద, ఇంకా విద్యుదయస్కాంత పార్శ్వాలన్నింటిలో నౌకాదళ యుద్ధంలో పూర్తి పరిధిలో నీలి జలాల్లో సమర నిర్వహణ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. నౌకను 2022 ఫిబ్రవరి 22న లాంచ్ చేశారు. ఇది 2024 నవంబరులో తన తొలి సముద్ర పరీక్షల నిమిత్తం బయలుదేరింది. మరి 2025 జూన్ కల్లా ఓడరేవులోనూ, సముద్రంలోనూ .. ఈ రెండింటిలో ఫ్యాక్టరీ ట్రయల్స్ స్టేట్ కమిటీ ట్రయల్స్తోపాటు ఇతర పరీక్షలను విజయవంతంగా ముగించుకొంది. ఈ నౌక తన అన్ని రష్యన్ ఆయుధ వ్యవస్థలను ప్రయోగాత్మకంగాను, ఫలప్రదంగాను పరీక్షించింది. దీనిలో ఉపరితలం నుంచి గాలిలోకి నిట్టనిలువుగా ప్రయోగించినప్పుడు దాడి చేసే తరహా శ్టిల్-1 క్షిపణి, ఫిరంగిదళ ఆయుధాలతో పాటు నౌకావిధ్వంసక ఆయుధాలు కూడా కలిసి ఉన్నాయి.
తమాల్ రెండు విధులను నిర్వహించగలిగిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, విస్తృత శ్రేణులను కలిగి ఉండి ఉపరితలం నుంచి గాలిలోకి నిట్టనిలువుగా ప్రయోగించడానికి వీలున్న దాడి చేయగల క్షిపణులు, ప్రామాణిక 30 ఎంఎం క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, 100 ఎంఎం మెయిన్ గన్.. వీటితో పాటు చాలా శక్తిమంతమైన ఏఎస్డబ్ల్యూ రాకెట్లు, ఇంకా హెవీవెయిట్ నౌకావిధ్వంసక ఆయుధాలతో కూడా ఈ నౌక పని చేయగలదు. తమాల్ నిర్మాణంలో భారతీయ టెక్నాలజీతో పాటు రష్యన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనిలో అత్యాధునిక కమ్యూనికేషన్, ఇంకా నెట్వర్క్ కేంద్రీకృత నిర్వహణ సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి. ఉన్నత ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, పురోగామి ఈఓ, ఐఆర్ సిస్టమ్స్ హంగులు కూడా ఈ నౌకకు కళ్లుగాను, చెవులుగాను పనిచేస్తాయి. అత్యంత వైవిధ్యభరిత యుద్ధ నిర్వహణ వ్యవస్థ అన్ని ఆయుధాలు, సెన్సర్లను ఒక ప్రభావవంత పోరాట యంత్రంలోకి అనుసంధానించారు. ఈ నౌక ఉన్నతీకరించిన జలాంతర్గామి నిరోధక, వాయుజనిత ముందస్తు హెచ్చరిక విధులను నిర్వర్తించే ‘కామోవ్ 28’ తో పాటు ‘కామోవ్ 31’ రకం హెలికాప్టర్లను కూడా మోసుకుపోగలుగుతుంది. ఈ సత్తాలన్నింటినీ పోగు చేసుకోవడంతో ఈ రక్షణ నౌక బలం ఇంతలంతలుగా పెరిగిపోయింది.
ఈ నౌకను పరమాణు, క్రిమి యుద్ధ సంబంధిత, రసాయనిక పరమైన సురక్ష కోసం సంక్లిష్ట ఆటోమేటెడ్ వ్యవస్థలతో తీర్చిదిద్దారు. నష్టాన్ని నివారించే పనులతో పాటు మంటల్ని ఆర్పే పనులను కూడా సురక్షిత పోస్టులలో నుంచి కేంద్రీయ తరహాలో నిర్వహించే సత్తా దీనికి ఉంది. దీనిలోని సంక్లిష్ట వ్యవస్థలు తీవ్రంగా గాయపడ్డ సైనికులకు అత్యవసర వైద్యసాయాన్ని అందించడంలో తోడ్పడి మరణాలను కనీస స్థాయికి పరిమితం చేయడం, యుద్ధ ప్రభావాన్ని శీఘ్రంగా పునరుద్ధరించడం, పోరాడే దక్షతను, ప్రాణాలతో మిగిలి ఉండే అవకాశాలను పెంచడంలో సాయపడనున్నాయి.
ఐఎన్ఎస్ తమాల్లో 26 మంది అధికారులతో పాటు దాదాపు 250 మంది నావికులను నియమించారు. వీరంతా సర్వత్ర సర్వదా విజయం అనే నౌక ఆదర్శవాక్యాన్ని శిరసావహిస్తారు. ఇది ప్రతి మిషన్లోనూ యుద్ధ నిర్వహణ కార్యకలాపాల్లో శ్రేష్ఠత్వానికి చెక్కుచెదరని నిబద్ధతను చాటిచెబుతుంది. అంతేకాకుండా, భారతీయ నౌకాదళ ఆదర్శ వాక్యమైన ‘యుద్ధ సన్నద్ధ, విశ్వసనీయ, పొందికైన, భావికాలాన్ని దృష్టిలో పెట్టుకొని తయారుగా ఉండే, జాతీయ నౌకావాణిజ్య ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే సంరక్షించడాన్ని’ కూడా నెరవేరుస్తుంది.
ఈ నౌక త్వరలోనే కర్నాటక లోని కార్వార్లో గల తన హోం పోర్టుకు తొలి యాత్రను మొదలుపెట్టనుంది. మార్గమధ్యంలో తమాల్ వేర్వేరు ఓడరేవులకు వెళ్లి, తన పోరాట సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది సమర సన్నద్ధ స్థితిలో భారత్కు చేరుకొంటుంది. నౌకావాణిజ్య మార్గాల్లో ఇది తన ఆధిపత్యాన్ని నిరూపించుకోనుంది.
***
(Release ID: 2141476)