సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కన్హా వెల్నెస్ సెంటర్లో రికార్డు స్థాయిలో
3400 మందికి పైగా దివ్యాంగుల సామూహిక యోగా సాధన
Posted On:
21 JUN 2025 4:12PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన వికలాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూడీ) ఆధ్వర్యంలో.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేగూర్ కన్హా వెల్నెస్ సెంటర్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 19కి పైగా రాష్ట్రాల నుంచి 3400 మందికి పైగా దివ్యాంగులు (పీడబ్ల్యూడీలు) పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. ఒకే వేదికపై అత్యధిక సంఖ్యలో దివ్యాంగులు ప్రదర్శించిన అతిపెద్ద యోగా ప్రదర్శనగా ఇది నిలిచింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. డీఈపీడబ్ల్యూడీ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి రిచా శంకర్ సహా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం సమ్మిళిత యోగాలో సరికొత్త రికార్డును సృష్టించిందన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 కింద గుర్తించిన 21 రకాల వైక్యలంగల దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేయడంలో, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రోత్సహించడంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. యోగాను "సమ్మిళిత తత్వశాస్త్రం"గా ప్రస్తావించిన ఆయన.. ఎవరూ వెనుకబడిపోకుండా, ప్రతి వ్యక్తి అంతర్గత సామర్థ్యానికి గుర్తింపు దక్కేలా చూసుకోవడానికి ఈ యోగా దినోత్సవ వేడుకలకు మించి స్ఫూర్తిని కొనసాగించాలని సమాజానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం కుమారి జెడ్ అన్వి విజయ్భాయ్ అద్భుత యోగా ప్రదర్శనతో ప్రారంభమైంది. ఈ ప్రదర్శన ద్వారా ఆమె యోగా చేయడంలో అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాది, దివ్యాంగులు అయిన శ్రీ తేజస్వి శర్మ యోగా ప్రదర్శన ఈ దివ్యాంగుల సామూహిక యోగా ప్రదర్శనకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
విశాఖపట్నంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత, కన్హా శాంతి వనంలో దివ్యాంగులు సామూహిక యోగా ప్రదర్శనను నిర్వహించారు. ఇది సరికొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది. ఇక్కడ ఒకే చోట అత్యధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా సాధన చేసిన రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండూ ధ్రువీకరించాయి.
ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాత్మక ప్రతిభను, ఆశయ స్ఫూర్తిని ప్రదర్శించిన దివ్యాంగుల ప్రదర్శనలు.. ఉద్యోగ మేళాతో ఈ వేడుకలు ముగిశాయి. 20 స్టాళ్లలో వినూత్న ఉత్పత్తులు.. సేవలను ప్రదర్శించారు. 10 ఇంటరాక్టివ్ గేమ్లున్న గేమింగ్ జోన్ కార్యక్రమం ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించింది.
***
(Release ID: 2138408)