ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో టీబీ విముక్త మున్సిపాలిటీల కోసం 'స్వస్థ నగరం' నమూనా కార్యక్రమం ప్రారంభం
టీబీని త్వరగా గుర్తించి నివారించేందుకు గానూ ముందస్తు మాలిక్యూలర్ పరీక్షలతో పాటు డిజిటల్ యాప్ ద్వారా చురుగ్గా టీబీ పరీక్షలు నిర్వహించడంపై ప్రధాన దృష్టి
Posted On:
23 JUL 2024 3:47PM by PIB Hyderabad
టీబీ విముక్త మున్సిపాలిటీల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీ కలిసి చేపట్టిన 'స్వస్థ నగరం' నమూనా కార్యక్రమం మంగళవారం(23, జూలై, 2024) హైదరాబాద్లోని ఐసీఎంఆర్ - జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్)లో ప్రారంభమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఈ స్థానిక సంస్థలు, తెలంగాణ ఎన్టీఈపీ నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్ర టీబీ సెల్, కేంద్ర టీబీ విభాగం, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఇండియా, ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ టీబీ, లంగ్ డిసీజ్(ది యూనియన్) వధ్వని ఏఐ, యూఎస్ఏఐడీ ఇండియా సంయుక్తాధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఎండీ ఆర్.వి.కర్ణన్ 'స్వస్థ నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ... టీవీ విముక్తి కోసం చొరవ తీసుకునేలా ఈ నమూనా కార్యక్రమం స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో టీబీ సేవల లభ్యత, నాణ్యతపై సమాచారాన్ని పంచుకునేందుకు ఇది బహిరంగ వేదిక అవుతుందని అన్నారు.
అంతర్గత వలసలు, మురికివాడలు పెరగడం వంటి కారణాల వల్ల టీబీ వ్యాప్తి పెరుగుతోందన్నారు. కేంద్ర టీబీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర పీ జోషి మాట్లాడుతూ... పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా టీబీ వ్యాధిని నగరాల ఆవల కూడా నియంత్రించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నమూనాగా చేపట్టేందుకు, తదుపరి హైదరాబాద్ ఆవల ఉన్న పట్టణ ప్రాంతాల్లో అమలు చేయడానికి కేంద్ర టీబీ విభాగం సహకరిస్తుందని ఆయన తెలిపారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ టీఎస్వీఎన్ త్రిల్లేశ్వరరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, టీబీ నిర్మూలనలో చురుకైన భాగస్వామిగా కొనసాగుతుందని తెలిపారు.
ది యూనియన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి జాజు మాట్లాడుతూ... వ్యాధిగ్రస్థులకు ఉచిత వైద్య సేవలు అందించడం, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో ఈ కార్యక్రమం టీబీపై పోరాటంలో ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
టీబీ వ్యాధి పెరగడానికి సామాజిక అంశాలు ప్రధానంగా ప్రభావం చూపే పట్టణ ప్రాంతాల్లో దీనిని నిర్మూలించడానికి, టీబీ విముక్త మున్సిపాలిటీలుగా మార్చడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పర్యవేక్షణ, నియంత్రణ, టీబీ చికిత్సలో నాణ్యత ఉండేలా చూడటం వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. మూడేళ్ల పాటు పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీలో ఈ నమూనా కార్యక్రమం అమలు చేస్తారు. టీబీ వ్యాప్తిని మూడింట ఒక వంతుకు తగ్గించడం, టీబీ సంబంధ కారణాలతో మరణాలను, వ్యాధి బాధితులు చికిత్స కోసం వెచ్చించే ఖర్చును తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యాలు.
వ్యాధి నివారణ కోసం వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించేందుకు గానూ మాలిక్యూలర్ పరీక్షలను పెంచడంతో పాటు డిజిటల్ యాప్ను ఉపయోగించి, ఎక్స్-రే ద్వారా టీబీని త్వరగా గుర్తించడంపై ఈ కార్యక్రమం ప్రధాన దృష్టి ఉంటుంది. వలసల కారణంగా వ్యాధి వ్యాప్తి చెందే సమస్య, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యంకరమైన అలవాట్లను పెంపొందించడం, డిమాండ్కు తగ్గట్టుగా సేవలు అందించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
'స్వస్థ నగరం'లో భాగంగా వ్యాధి వ్యాప్తి ఉన్న ప్రాంతాలను గుర్తించడం, టీబీ చికిత్స అందించే వారితో చర్చలు, బాల్యంలోనే టీబీని గుర్తించడం, టీబీకి అన్ని రకాల సంపూర్ణ చికిత్స అందించడం, గాలి ద్వారా ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడం, టీబీ చికిత్స అందించే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వారిలో సామర్థ్యాన్ని పెంపొందంచడం, వివిధ రంగాలతో సమన్వయం, పని ప్రదేశాల్లో అవగాహన కోసం పరిశ్రమలు, సంస్థలతో మాట్లాడటం, టీబీ బాధిత కుటుంబాలకు సామాజిక మద్దతు కల్పించడం, వ్యాధిపై పరిశోధన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీబీ విభాగం జేడీ డాక్టర్ ఏ రాజేశం, యూఎస్ఏఐడీ ఇండియా టీబీ, అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ అమర్ షా, డబ్ల్యూహెచ్ఓ ఇండియా టీబీ కన్సల్టెంట్ డాక్టర్ మహేశ్, డబ్ల్యూహెచ్ఓ ఇండియా పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్సిప్స్ నేషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ డాక్టర్ శిబు బాలకృష్ణన్, డబ్ల్యూహెచ్ఓ ఎన్టీఈపీ రిజనల్ టీమ్ లీడ్ శాంత ఆచంట, టీబీ, అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ అమర్ షా, ప్రాజెక్ట్ డైరెక్టర్ అనీశా సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2035789)
Visitor Counter : 31