ఆర్థిక మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశంలో భాగంగా సామర్థ్య నిర్మాణంపై వర్క్ షాప్ నిర్వహణ
Posted On:
30 MAR 2023 3:07PM by PIB Hyderabad
భారతదేశం అధ్యక్షతన జీ-20 లో మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం 2023 మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జరిగింది. మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి రూపొందిన కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచిన భవిష్యత్తు నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణ అంశంతో పాటు వివిధ అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి.
వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా సదస్సులో పాల్గొన్న ప్రతినిధుల కోసం 2023 మార్చి 30న సామర్థ్య నిర్మాణం అంశంపై భారతదేశం, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిధుల సమీకరణ అంశంపై చర్చించడానికి వర్క్ షాప్ నిర్వహించారు. సమగ్ర, సంపూర్ణ, సుస్థిర అభివృద్ధి సాధించడానికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి స్థానిక సంస్థలకు అవసరమయ్యే నిధులపై వర్క్ షాప్ లో చర్చలు జరిగాయి. సమగ్ర అవగాహన కోసం రెండు విభాగాలుగా వర్క్ షాప్ ను విభజించి నిర్వహించారు. ప్రతినిధులు క్లాస్రూమ్ తరగతుల్లో పాల్గొని క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న పధకాలను సందర్శించారు. వివిధ ఆర్థిక పథకాల సహకారంతో వినూత్న విధానాలతో అమలు జరుగుతున్న పథకాలను ప్రతినిధులు పరిశీలించారు.
వర్క్ షాప్ మొదటి భాగంలో సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ భారతదేశానికి చెందిన నిపుణులు తమ దేశాల్లో నగరాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులు పెంపొందించడానికి అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారు.
సమగ్ర, సంపూర్ణ, సుస్థిర నగరాల అభివృద్ధికి సింగపూర్ అమలు చేస్తున్న విధానాలు, వ్యూహాలను సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్ లోహ్ వివరించారు. ప్రజలు జీవించడానికి అనువుగా ఉండే విధంగా అభివృద్ధి , వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య. అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర పట్టణ పరిపాలన విధానం సింగపూర్ లో అమలు జరుగుతుందని అన్నారు. అనంతరం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దక్షిణ కొరియాలో అమలు జరుగుతున్న విధానాలు, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఇతర దేశాలకు దక్షిణ కొరియా అందిస్తున్న సహకారంపై చర్చ జరిగింది.
సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, సవాళ్లను తగ్గించడానికి అనుసరించిన వివిధ పునరాభివృద్ధి పునరుద్ధరణ చర్యల వివరాలను సియోల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్హీ కిమ్, సియోల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హుయ్ షిన్ వివరించారు.
చివరగా జరిగిన కార్యక్రమంలో పట్టణ మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు సమీకరించడానికి అమలు చేసిన చర్యలను చైనా, రష్యా, యూరోపియన్ కమీషన్, భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధులు వివరించి వీటికి సంబంధించి అధ్యయన పత్రాలు సమర్పించారు.
తరగతి కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రతినిధులు విజయవంతంగా అమలు జరుగుతున్న మూడు ప్రాజెక్టులను సందర్శించారు. (i) నీటి సరఫరా మెరుగు పరిచి స్థిరమైన , సమ్మిళిత నీటి సరఫరా కోసం స్మార్ట్ యాజమాన్య విధానంలో నిర్మించిన వీసీఐసీడీపీ ప్రాజెక్టు (ii) పునరుద్ధరణ పనులు, పర్యావరణ పరిరక్షణ కోసం నిర్మించిన నీటిపై తేలియాడే 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను (iii)ఘన వ్యర్థాల యాజమాన్యం లో ప్రైవేట్ రంగ పాత్ర ప్రాధాన్యత తెలుసుకోవడానికి వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిర్మించిన కేంద్రాన్ని ప్రతినిధులు సందర్శించారు.
అనుభవాల నుంచి నేర్చుకోవడానికి, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని చేపట్టి అమలు చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అవగాహన పొందడానికి వర్క్షాప్ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. జీ-20 అధ్యక్ష భాద్యతలను భారతదేశం నిర్వర్తిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రతినిధులు, 2023 మౌలిక సదుపాయాల కార్యాచరణ ప్రణాళిక కింద స్వయంగా వివరాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన అధ్యయన యాత్రలు, చర్చల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వర్క్ షాప్ నిర్వహణతో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ముగిసాయి. గ్రూప్ తదుపరి సమావేశం ఉత్తరాఖండ్ లోని రుషికేశ్ లో 2023 జూన్ 26,27,28 తేదీల్లో జరుగుతుంది.
***
(Release ID: 1912259)
Visitor Counter : 160