ఆర్థిక మంత్రిత్వ శాఖ

2023 మార్చి 28,29 తేదీల్లో విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం

Posted On: 27 MAR 2023 4:13PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం 2023 మార్చి 28,29 తేదీల్లో విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) లో జరగనున్నది. సమావేశానికి జీ-20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన దాదాపు 63 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారు. అధ్యక్ష హోదాలో పూణే లో 2023 జనవరి నెలలో మౌలిక సదుపాయాల రంగంపై భారతదేశం నిర్వహించిన వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశంలో చర్చించిన అంశాలను మరోసారి 2వ సమావేశంలో ప్రతినిధులు చర్చిస్తారు. 

మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన పెట్టుబడుల సమీకరణ, మౌలిక సదుపాయాలను ఒక ఆస్తిగా అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడులు ఆకర్షించడానికి వినూత్న విధానాలు రూపొందించడం లాంటి అంశాలు మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చకు వస్తాయి. మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాలను జీ-20 ఫైనాన్స్ ట్రాక్ పరిశీలించి మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలు ఖరారు చేస్తుంది. 

జీ-20 దేశాలకు భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో 'ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు' నినాదంతో పని చేయాలని పిలుపు ఇచ్చింది. దీనికి అనుగుణంగా జీ-20 మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి కార్యక్రమం రూపొందింది. పట్టణ ప్రాంతాల్లో సుస్థిర సంపూర్ణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను చర్చల ద్వారా రూపొందించాలన్న లక్ష్యంగా వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగుతుంది. 

భారతదేశం అధ్యక్షతన మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసే అంశంపై వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ' రేపటి నగరాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం: సమగ్ర, సంపూర్ణ, సుస్థిర అభివృద్ధి సాధించడం' అనే అంశానికి సమావేశంలో ప్రాధాన్యత ఇస్తారు. 2023 మౌలిక సదుపాయాల ప్రణాళికలో పొందుపరిచిన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వస్తాయి. 

రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులు అధికార సమావేశాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. విశాఖపట్నం వారసత్వం, ప్రకృతి అందాలు ప్రతినిధులు తెలుసుకోవడానికి వీలు కల్పించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మార్చి 27న ప్రతినిధుల కోసం విహార యాత్ర ఏర్పాటు చేశారు. 

ప్రధాన సమావేశానికి సమాంతరంగా మౌలిక సదుపాయాల సంబంధిత అంశాలను చర్చించడానికి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ సహకారంతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. సమావేశానికి యుఎన్ డి ఫై, ఓఈసీడీ , ఐఎంఎఫ్, ఏబిడి, ఈబిఆర్డి లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. 

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం, ఆంధ్ర రుచులు ప్రతినిధులకు పరిచయం చేయడానికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విందు చేస్తూనే చర్చలు సాగించేలా రాత్రి విందు ఏర్పాటు చేస్తారు. 

29వ తేదీన ప్రతినిధులు కోసం సముద్ర తీరంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తారు. దీనిలో ప్రతినిధులకు యోగ,ధ్యానం, సాత్విక ఆహారం పరిచయం చేస్తారు. 

రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత మార్చి 30న ప్రతినిధుల కోసం సామర్థ్య అభివృద్ధి వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్ లో కొరియా, సింగపూర్ దేశాలకు చెందిన నిపుణులు పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం అమలు చేయాల్సిన ఉత్తమ విధానాలపై ప్రసంగిస్తారు. 

జీ-20 సమావేశాల నిర్వహణకు ముందు ప్రజల భాగస్వామ్యంతో స్థానిక యంత్రాంగం 

పాఠశాలల్లో నమూనా జీ-20 సదస్సు, జీ-20 మారథాన్ నిర్వహించారు. ' నగరాల్లో ప్రైవేట్ ఆర్థిక వనరుల సమీకరణ' అనే అంశంపై ఆర్థిక వ్యవహారాల శాఖ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మార్చి 22,23 తేదీల్లో రెండు రోజుల ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ లో మున్సిపల్ కమిషనర్లు,మేయర్లు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి లకు చెందిన దాదాపు 70 ప్రతినిధులు హాజరయ్యారు. .

వినూత్న ఆలోచనలు , సమిష్టి కృషితో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేలా చూడాలన్న లక్ష్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ జీ-20 మౌలిక సదుపాయాల రంగం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 

 

***



(Release ID: 1911204) Visitor Counter : 176


Read this release in: English