హోం మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ భద్రతా పరిస్థితిని ఈ రోజు శ్రీనగర్ లో జరిగిన సమావేశంలో సమీక్షించిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొని రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశలు నెరవేరేలా చూసేందుకు పోలీసులు,

భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలి.. శ్రీ అమిత్ షా

హింసాత్మక కార్యకలాపాలను అరికట్టి శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేస్తున్న భద్రతా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన యంత్రాంగాన్ని అభినందించిన హోం శాఖ మంత్రి

తీవ్రవాదులు, వేర్పాటువాదులను పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి.. శ్రీ అమిత్ షా

తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఖచ్చితమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని భద్రతా బలగాలు మరియు పోలీసులను ఆదేశించిన హోంమంత్రి

సామాన్య ప్రజల ప్రయోజనాలు దెబ్బ తినేలా సాగుతున్న తీవ్రవాద-వేర్పాటువాద శక్తులను ప్రోత్సహించి, కొనసాగించడానికి సాగుతున్న ప్రయత్నాలను పూర్తిగా అరికట్టాలి.. శ్రీ అమిత్ షా

Posted On: 05 OCT 2022 4:46PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్ భద్రతా పరిస్థితిని ఈ రోజు శ్రీనగర్ లో జరిగిన సమావేశంలో  కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించారు.  జమ్మూ  కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా మరియు సైనిక, సిఏపిఎఫ్, జమ్మూ కాశ్మీర్  పోలీస్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారులు, కేంద్ర  సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొని రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశలు నెరవేరేలా చూసేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలని  శ్రీ అమిత్ షా సూచించారు. 

హింసాత్మక కార్యకలాపాలను అరికట్టి శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేస్తున్న భద్రతా  సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన యంత్రాంగాన్ని  హోం శాఖ మంత్రి అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా  నిర్వహించిన 'హర్‌ఘర్‌తిరంగా' కార్యక్రమం రాష్ట్రంలో ఘనంగా జరిగిందని శ్రీ అమిత్ షా అన్నారు. 

  తీవ్రవాదులు, వేర్పాటువాదులను పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని  శ్రీ అమిత్ షా ఆదేశాలు జారీచేశారు. భద్రతా వ్యవస్థ పనితీరును సమావేశంలో  శ్రీ అమిత్ షా సమీక్షించారు.భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు  గత సమావేశంలో ఆమోదించిన కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరును హోం శాఖ మంత్రి  సమీక్షించారు. తీవ్రవాద కార్యక్రమాలను తుదముట్టించి, వేర్పాటు వాద శక్తులను నిర్మూలించడానికి అమలు జరుగుతున్న చర్యల వివరాలను  శ్రీ అమిత్ షా కు అధికారులు వివరించారు.  

తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు  ఖచ్చితమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని  భద్రతా బలగాలు మరియు పోలీసులకు హోం శాఖ మంత్రి ఆదేశాలు జారీచేశారు.యుఏపిఐ కింద నమోదైన కేసుల పురోగతిని శ్రీ అమిత్ షా సమీక్షించారు. కేసులను మరింత సమర్థంగా దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు సంస్థలు తమ  సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని అన్నారు. 

సామాన్య ప్రజల  శ్రేయస్సు ను దెబ్బతీసేందుకు జరుగుతున్న  ఉగ్రవాద-వేర్పాటువాద ప్రచారానికి సహాయపడే, ప్రోత్సహించే మరియు కొనసాగించే అంశాలతో కూడిన ఉగ్రవాద  వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు.

 

***

 



(Release ID: 1865524) Visitor Counter : 129