ఆర్థిక మంత్రిత్వ శాఖ
జార్ఖండ్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశం, ఎడిబి $ 112 మిలియన్ రుణంపై సంతకం చేసింది
Posted On:
08 SEP 2021 7:55PM by PIB Hyderabad
జార్ఖండ్ రాష్ట్రంలోని నాలుగు పట్టణాలలో మెరుగైన నీటి సరఫరా కోసం నీటి సరఫరా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బిలు) సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) 112 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.
జార్ఖండ్ పట్టణ ప్రాంతంలో మంచినీటి సరఫరా మెరుగుపర్చేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా మరియు ఎడిబి భారతదేశ కంట్రీ డైరెక్టర్ శ్రీ టేకో కొనిషిలు సంతకాలు చేశారు.
ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మిస్టర్ మిశ్రా మాట్లాడుతూ " రాష్ట్రంలో పట్టణ సేవలను మెరుగుపరచడానికి జార్ఖండ్ ప్రభుత్వ ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయబడిందని మరియు రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు మరో మూడు పట్టణాలైన హుస్సేనాబాద్, జుమ్రి తలైయా, మరియు మేదినగర్లలో నిరంతర, శుద్ధి చేసిన పైపు నీటి సరఫరాను ఇది నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఇందులో మేదినగర్ ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉంది.
"ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎడిబికి చెందిన మొట్టమొదటి పట్టణ ప్రాజెక్ట్ మరియు నిరంతర నీటి సరఫరా కోసం ఒక నమూనాను స్థాపించడానికి సహాయపడుతుంది. స్థిరమైన ఆపరేషన్ కోసం పాలసీ సంస్కరణలతో పాటు దేశీయంగా జల్ జీవన్ మిషన్ కింద పట్టణ గృహాలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ఇతర తక్కువ-ఆదాయ రాష్ట్రాల ద్వారా దీన్ని నమూనాగా స్వీకరించవచ్చు" అని శ్రీ కొనిషి అన్నారు.
జాతీయ తాగునీటి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రాజెక్ట్ టౌన్లలో రోజుకు 275 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన నాలుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగ సభ్యులు మరియు ఇతర బలహీన వర్గాలతో సహా దాదాపు 115,000 గృహాలకు నిరంతర నీటి సరఫరా అందించడానికి ఈ ప్రాజెక్ట్ 940 కిలోమీటర్ల నీటి పంపిణీ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది.
సుస్థిరతను నిర్ధారించడానికి, ఈ ప్రాజెక్ట్ పట్టణ సేవల పంపిణీ మరియు పరిపాలనపై యుఎల్బిల సామర్థ్య నిర్వహణ వ్యూహం మరియు పట్టణ ప్రాజెక్టుల రూపకల్పన మరియు అమలుపై శిక్షణ ద్వారా అభివృద్ధి చేస్తుంది. నీటి శుద్ధి మరియు పంపిణీలో నీటి నష్టాలను తగ్గించడానికి వినూత్న సాంకేతికతలు ప్రవేశపెట్టబడతాయి. ఈ ప్రాజెక్టులో నీటి సరఫరా ఆపరేషన్ కోసం పర్యవేక్షణ నియంత్రణ మరియు డేటా సేకరణ వ్యవస్థ మరియు రాంచీలో భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత నిర్వహణ కూడా ఉన్నాయి.
తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ, సంపన్నమైన, స్థిరమైన మరియు సుస్థిరమైన ఆసియా మరియు పసిఫిక్ను సాధించడానికి ఎడిబి కట్టుబడి ఉంది. 1966 లో స్థాపించబడన ఈ సంస్థ 68 మంది సభ్యులు కలిగి ఉంది. వారిలో ఈ ప్రాంతానికి చెందిన సభ్యులు 49 మంది.
****
(Release ID: 1753386)