ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలోని కోవిడ్ రోగులకు కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో 2105 ప‌డ‌క‌లు కేటాయింపు 1 మార్చి నుంచి ఢిల్లీ కోవిడ్ రోగుల‌కు 4 రెట్లు ప‌డ‌క‌ల పెంపు

Posted On: 20 APR 2021 8:27PM by PIB Hyderabad

ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్‌, ఆర్ఎంఎల్‌, ఎల్‌హెచ్ఎంసి, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ ఝజ్ఝార్‌, ఇసిఐసి ఓఖ్లా, ఝిల్‌మిల్‌, ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద‌, స‌రితా విహార్ స‌హా కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో 2105 ప‌డ‌క‌లు (1875 ఆక్సిజ‌న్ బెడ్లు, 230 ఐసియు బెడ్లు) ఆ ప్రాంతంలోని కోవిడ్ రోగుల చికిత్స కోసం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీనితో ఢిల్లీలోని కోవిడ్ రోగుల‌కు ప‌డ‌క‌ల సంఖ్య 1మార్చి 2021లో 510 ప‌డ‌క‌ల నుంచి 4 రెట్లు పెరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో కోవిడ్ ప‌డ‌క‌లు పెంచే ప్ర‌కియ‌ను నిరంత‌రం చేస్తోంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌) స‌హాయంతో క్షేత్ర‌స్థాయి ఆసుప‌త్రులు/  తాత్కాలిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో రానున్న రెండు వారాల్లో స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆసుప‌త్ర‌లో 46 అద‌న‌పు ప‌డ‌క‌లు, లేడీ హార్డింగ్ మెడిక‌ల్ కాలేజీలో 240 ప‌డ‌క‌లు అందుబాటులోకి రానున్నాయి. 
ఇందుకు అద‌నంగా, ధౌలాకువాన్‌లోని డిఆర్‌డిఒ స‌దుపాయంలో 19 ఏప్రిల్ 2021 నుంచి 250 ఐసియు ప‌డ‌క‌ల‌ను ఉప‌యోగానికి సిద్ధం చేశారు, మ‌రొక 250 ఐసియు ప‌డ‌క‌ల‌ను 21 ఏప్రిల్‌, 2021 నుంచి అందుబాటులోకి వ‌చ్చేలా సిద్ధం చేస్తున్నారు. ష‌కుర్ బ‌స్తీ స్టేష‌న్‌లో 16 ప‌డ‌క‌ల‌తో 50 కోచ్‌ల‌లో మొత్తం 800 ప‌డ‌క‌ల‌ను అందించేందుకు భార‌తీయ రైల్వేలు క‌ట్టుబ‌డి ఉన్నాయి. దీనిని ఢిల్లీ ప్ర‌భుత్వం ఐసొలేష‌న్ బెడ్ల‌గా ఉప‌యోగించ‌వ‌చ్చు. అంతేకాదు, 21 ఏప్రిల్ 2021 నుంచి ఆనంద్ విహార్ స‌దుపాయంలో మొత్తం 400 ప‌డ‌క‌లు అందుబాటులోకి వ‌చ్చేలా 16 బెడ్ల‌తో కూడిన 25 కోచ్‌ల‌ను రైల్వే శాఖ అందించ‌నుంది. 
ఈ రైల్వే కోచ్‌ల‌లో కోవిడ్ కేసుల‌ను సుర‌క్షితంగా, స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించేందుకు, ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని, రైల్వే కోచ్‌లలో అనుమానిత / ధృవీకరించబడిన కోవిడ్‌ కేసుల సరైన నిర్వహణపై మార్గదర్శక పత్రం’లోని స‌హేతుక‌మైన భాగాల‌ను అధ్య‌య‌నం చేయ‌వ‌ల‌సిందిగా సూచించారు. ఈ ప‌త్రాన్ని మే 2020లో పంపిణీ చేయ‌డం జ‌రిగింది. 
త‌న‌కు అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించి కోవిడ్ మ‌హ‌మ్మారిని పార‌దోలేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంది. కోవిడ్ 19 రోగుల‌కు త‌క్ష‌ణ‌, స‌మ‌ర్ధ‌వంత‌మైన చికిత్స‌ను అందించేందుకు వివిధ రాష్ట్రాల‌లోని ఆసుప‌త్రుల మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌డం కోసం మొత్తం ప్ర‌భుత్వం అన్న వైఖ‌రిని అమ‌లు చేస్తున్నారు. 

***



(Release ID: 1713246) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi