వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ 2020-21లో ఎంఎస్‌పీ కార్యకలాపాలు

రూ.25,826.59 కోట్ల విలువైన 88,43,847 బేళ్ల పత్తి సేకరణతో 18,13,359 మంది రైతులకు లబ్ధి

Posted On: 27 JAN 2021 6:24PM by PIB Hyderabad

ప్రస్తుత 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో, 2020-21 ఖరీఫ్‌ పంట ఉత్పత్తుల సేకరణను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతమున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పథకాల ప్రకారం కనీస మద్దతు ధరల వద్ద రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తోంది. 

    ఈ ఖరీఫ్‌ సీజన్‌ వరి ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, ఛండీఘర్‌, జమ్ము&కశ్మీర్‌, కేరళ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఝార్ఖండ్‌, అసోం, కర్ణాటక, పశ్చిమబంగాల్‌లో 26.01.2021 నాటికి, 587.74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. గతేడాది ఇదే సమయానికి సేకరించిన 488.49 ల.మె.ట. కంటే ఇది 20.31 శాతం అధికం. ప్రస్తుత 587.74 ల.మె.ట. సేకరణలో, ఒక్క పంజాబ్‌ నుంచే 202.77 ల.మె.ట. ధాన్యం గోదాములకు చేరింది. దేశవ్యాప్త సేకరణలో ఇది 34.50 శాతం.

    కనీస మద్దతు ధర వద్ద, రూ.1,10,965.89 కోట్ల విలువైన వరి ధాన్యం సేకరణ ద్వారా దాదాపు 84.73 లక్షల రైతులకు ఇప్పటికే లబ్ధి చేకూరింది.
 
    రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు; ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌) ప్రకారం, ప్రస్తుత సీజన్‌లో 51.92 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరి సేకరణకు కేంద్రం అనుమతినిచ్చింది. 2020-21 రబీ మార్కెటింగ్ సీజన్‌లో, 2.50 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పీఎస్‌ఎస్‌ ప్రకారం, ఎఫ్‌ఏక్యూ రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండుకొబ్బరి సేకరణకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ  కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌ రేటు తక్కువగా ఉంటే, నమోదిత రైతుల నుంచి 2020-21 ఎంఎస్‌పీ ప్రకారం, రాష్ట్ర ప్రతిపాదిత సేకరణ కేంద్రాల ద్వారా కేంద్ర నోడల్‌ ఏజెన్సీలు నేరుగా పంటలను సేకరిస్తాయి.

    26.01.2021 వరకు; 1,62,352 మంది తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌ రైతులకు ప్రయోజనం కలిగిస్తూ, రూ.1,622.95 కోట్ల కనీస మద్దతు ధరతో, 3,01,581.08 మె.ట. పెసలు, మినుములు, కందులు, వేరుశనగ, సోయాబీన్‌ను నోడల్‌ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది. 

    అదేవిధంగా, 5,089 మె.ట. ఎండు కొబ్బరిని రూ.52.40 కోట్ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసింది. దీనివల్ల, 26.01.2021 వరకు తమిళనాడు, కర్ణాటకలోని 3,961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రధాన సేకరణ రాష్ట్రాల్లో ఎండుకొబ్బరి, మినుముల మార్కెట్‌ రేట్లు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి, పంటల రాక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సేకరణల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటకలో గింజ పత్తి (కపస్‌) సేకరణ కూడా సాఫీగా సాగుతోంది. 26.01.2021 వరకు, 18,13,359 మంది రైతుల నుంచి 88,43,847 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా రూ.25,826.59 కోట్ల రూపాయలు చెల్లించింది.

 

***



(Release ID: 1692762) Visitor Counter : 77