రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మిష‌న్ సాగ‌ర్ః కొచ్చికి చేరుకున్న‌ఐఎన్ఎస్ నౌక కేస‌రి


Posted On: 28 JUN 2020 1:36PM by PIB Hyderabad

 

కోవిడ్‌-19 నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ‘మిషన్ సాగర్’లో భాగంగా దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో 55 రోజుల పాటు మోహరింప‌బ‌డిన‌ భారత ‌నౌకాదళానికి చెందిన‌ నౌక‌ కేసరి ఈ రోజు కొచ్చికి చేరుకుంది. 'కోవిడ్ రిలీఫ్ మిషన్'‌లో భాగంగా కేస‌రి నౌక‌ను దక్షిణ హిందూ మహాసముద్రంలోని వివిధ దేశాల‌కు స‌హాయం అందించేందుకు పంపారు. కోవిడ్ నేప‌థ్యంలో 580 టన్నుల ఆహార ప‌దార్థాలు, అవ‌స‌ర‌మైన ప‌లు వైద్య ప‌రిక‌రాల్ని సామ‌గ్రిని కేసరి మాలే (మాల్దీవులు), పోర్ట్ లూయిస్ (మారిషస్), అంట్సి రానానా (మడగాస్కర్ ), మొరోని (కొమొరోస్ దీవులు) మరియు పోర్ట్ విక్టోరియా (సీషెల్స్) త‌దిత‌ర నౌకాశ్ర‌యాల‌కు చేర‌వేసింది. సాగ‌ర్ ప్రాంతంలోని ఆయా దేశాల‌లో‌ని స్థానిక అధికారుల‌కు అవ‌స‌ర‌మైన స‌రుకుల్ని చేర‌వేసేందుకు గాను ఐఎన్ఎస్ కేస‌రి విశేష సేవ‌ల్ని అందించింది. 14 మంది సభ్యుల నావికా ద‌ళం వైద్య స‌హాయ బృందం ఒక్కొక్కటి దాదాపు 20 రోజులు మారిషస్ మరియు కొమొరోస్‌ల‌కు పంపారు. పరస్పరం త‌మ‌ అనుభవాల్ని పంచుకోవడం ద్వారా కోవిడ్‌-19ను ఎదుర్కోవటానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడంలో స్థానిక ప్రభుత్వాలకు సహాయం చేసేలా ఈ బృందం త‌న సేవ‌ల‌ను అందించింది.


భార‌త ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు ‘మిషన్ సాగర్’ లో భాగంగా అవసరమైన ఔషధాలు మరియు వైద్య సహాయ బృందం రవాణా హిందూ మహాసముద్ర ప్రాంతంలోని (ఐఓఆర్‌) దేశాల భద్రతా భాగస్వామిగా భారతదేశం యొక్క పాత్రను పునరుద్ఘాటించింది. ఈ చ‌ర్య ఐఓఆర్ ప్రాంతంలోని సముద్ర పొరుగు మరియు భాగస్వామ్య దేశాల‌తో కలిసి పని చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతనూ ప్రతిబింబించింది. చాలా కఠినమైన సముద్ర మార్గాల్లో క‌ష్ట‌మైన వేళ‌ల్లో కూడా భార‌త్ కేస‌రి నౌక‌ ద్వారా అవసరమైన వైద్య సహాయాన్ని అందించడాన్ని ప్ర‌స్తుతిస్తూ మారిషస్ ప్రధాని గత నెల టెలిఫోన్‌లో భార‌త ప్ర‌ధానితో మాట్లాడుతూ వ్యక్తిగతంగా త‌న కృతజ్ఞతలు తెలియ‌జేశారు. కేస‌రి ద్వారా సకాలంలో సహాయం అందించినందుకు గాను వివిధ దేశాధినేతలు ఆయా దేశాల సీనియర్ ప్రముఖులు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘సాగర్’ ప్రాంత‌పు వృద్ధి మ‌రియు భ‌ద్ర‌త‌కు సంబంధించి ప్రధాన మంత్రి దృష్టికోణానికి అనుగుణంగా మిష‌న్ సాగ‌ర్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డ‌మైంది. తన పొరుగు దేశాలతో సంబంధాలకు భారతదేశం ఇస్తున్న ప్రాముఖ్యతను, ప్ర‌స్తుతం ఉన్న బంధాన్ని మ‌రింత‌గా బ‌లోపేతం చేసుకునేందుకు చూపుతున్న ఆస‌క్తిని ఇది ఎత్తిచూపింది. భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ ఇతర ఏజెన్సీల వారి సన్నిహిత సమన్వయంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగింది. 

*******

 

 

 



(Release ID: 1635239) Visitor Counter : 165


Read this release in: English