సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహిళల సాధికారతకై మన ఆలోచన విధానం మారాలి - అనురాధ మెడోజీ
ఆడపిల్లల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది- ఎమ్మెల్యే ముఠా గోపాల్
Posted On:
24 JAN 2020 7:17PM by PIB Hyderabad
ఈ రోజు మహిళలు ప్రతి రంగంలోనూ, వృత్తిలోనూ వేగంగా దూసుకుపోతూ, అన్ని రంగాలలో ముందుకెళ్తూ, ఉన్నత పదవులలో ఉన్నారని, కాని ఆడపిల్ల ఒక బాధ్యత మరియు మగ బిడ్డ ఒక ఆస్తి అనే కొద్ది మంది మనస్తత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ అనురాధ మెడోజీ అన్నారు. రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘బేటి బచావో బేటి పఢావో’ (బిబిబిపి) పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముషీరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీమతి అనురాధ మెడోజీ మాట్లాడుతూ, "మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లింగ నిష్పత్తిని పరిష్కరించడానికి, దేశంలో ఆడపిల్లలను శక్తివంతం చేయడానికి ‘బేటి బచావో బేటి పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం సమాజంలో హక్కుల గురించి అవగాహన కల్పించడం. ఆడపిల్లల సామాజిక, ఆర్థిక అభివృద్ధికై వారికి కొత్త అవకాశాలను కల్పించడం.
ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ మాట్లాడుతూ ఆడపిల్లల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా సాధికారత, ఆడపిల్లల విద్య కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికి కళ్యాణ లక్ష్మి పథకం సహాయ పడుతుండగా, ఆరోగ్య లక్ష్మి గర్భిణీ స్త్రీలకు పోషకమైన ఆహారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, షాదీ ముభారక్, ఆరోగ్య లక్ష్మి రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం అమలు చేసిన విజయవంతమైన కార్యక్రమాలు అని శ్రీ గోపాల్ అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె. లక్ష్మణ్, ముషీరాబాద్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్, పిఎమ్-కిసాన్, పిఎంఎవై వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రయోజనాలను పొందాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను కోరారు.
తెలంగాణలో మహిళలకు భద్రత కల్పించాలనే నినాదంతో రాష్ట్రంలో ‘షీ టీమ్స్’ ను ప్రవేశపెట్టినట్లు ఎసిపి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ఒబి నిర్వహించిన విజేతల వ్యాస రచన పోటీకి సర్టిఫికెట్లు, బహుమతులు పంపిణీ చేశారు. అంతకుముందు, ముఖ్య అతిథులు షీ టీమ్స్, 1098, సఖి, న్యూట్రిషన్ స్టాల్ నిర్వహించిన స్టాల్స్ ను సందర్శించారు, మహిళల భద్రత మరియు అభివృద్ధిపై ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ హరి బాబు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఒబి, సిల్వియా ఫెర్నాండెజ్ అసిస్టెంట్ డైరెక్టరు ఎన్ఐఎన్, శ్రీ వెంకట్ రెడ్డి ఎసిపి షీ టీమ్స్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్, రామ్నగర్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఆర్డి ఎన్ జిఒ, మహిళలు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముషీరాబాద్ విద్యార్థులు పాల్గొన్నారు.
***
(Release ID: 1600490)
Visitor Counter : 155