సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టెలివిజన్ ను అందరికీ అందుబాటులోకి తేవాలి: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, శ్రీ అమిత్ ఖరే మొదటి బ్రాడ్కాస్ట్ కాంక్లేవ్ ప్రారంభం
Posted On:
18 MAR 2019 7:08PM by PIB Hyderabad
సాంకేతికను అభివృద్ధి పరచుకుంటూ, టీవీ ప్రసారాలను అందరికీ అందుబాటులోకి తేవడం, దూరదర్శన్ ముందున్న సవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, శ్రీ అమిత్ ఖరే అన్నారు. మన దేశంలో ఉన్న భిన్నత్వాన్నీ, సామాజిక, ఆర్థిక వైవిధ్యాలను పబ్లిక్ బ్రాడ్కాస్టర్ గా దూరదర్శన్ తన కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయాలని, ఆయన అభిప్రాయపడ్డారు. ప్రసార కార్యక్రమాలలో ‘స్పెక్ట్రమ్’ ను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని శ్రీ ఖరే సూచించారు. విశాలమైన మన దేశంలో ‘స్పెస్ట్రమ్’ ను విద్యా వ్యాప్తి కి ఉపయోగించాలని ఆయన సూచించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రసార భారతి ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల కాంక్లేవ్ లో బ్రాడ్కాస్టింగ్ రంగంలోని సవాళ్ళనూ, అవకాశాలనూ ఈ రంగం యొక్క భవిష్యత్తునూ ఈ కాంక్లేవ్ లో చర్చించనున్నారు. సింగపూర్, మలేసియా, బంగ్లాదేశ్ మొదలైన దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, సాంకేతికను అభివృద్ధి పరచుకుంటూ ప్రసార భారతి ‘పబ్లిక్ బ్రాడ్ కాస్టర్’ గా తన బాధ్యతను నెరవేరుస్తోందని, ప్రసార భారతి ఛైర్మన్, శ్రీ సూర్య ప్రకాశ్ అన్నారు. ఈ రోజు మొదటి ‘ఇండియా ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్ట్ కాంక్లేవ్’ ను ప్రారంభిస్తూ, ఒకప్పుడు రేడియో, టీవీ లు మాత్రమే ప్రసార సాధనాలనీ, ప్రస్తుతం సమాచారం అనేక విధాల డిజిటల్ పద్ధతులలో లభ్యమవుతోందని అన్నారు. మన దేశం లో ఏటా మీడియా, వినోద రంగాలు 13.4 శాతం అభివృద్ధి చెందుతున్నాయనీ, ఒక అంచనా ప్రకారం 2021 నాటికి 33.6 బిలియన్ డాలర్ల రంగం గా అభివృద్ధి చెందుతాయనీ అన్నారు. ఫిక్కీ - ఫ్రేమ్స్ నివేదిక ప్రకారం టీవీ - వినోద రంగంలో అగ్ర స్థానాన ఉన్నా, 2019 లో డిజిటల్ మాధ్యమాలు దీనిని దాటేస్తాయని అన్నారు. ప్రసార మాధ్యమాలకు ‘కంటెంట్’ ఎంతో ముఖ్యమనీ, సమాజంలో జరిగే సంఘటనలను ప్రసార సాధనాలు తమ కార్యక్రమాలలో చూపించాలని ఆయన అన్నారు.
దూరదర్శన్ డి.జి, శ్రీమతి సుప్రియా సాహు, దూరదర్శన్ న్యూస్ డిజి. శ్రీ మాయాంక్ అగర్వాల్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, శ్రీ అతుల్ తివారీ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
***
(Release ID: 1569027)