కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
సామాజిక మరియు కార్మిక రంగాల లో సహకారానికి సంబంధించి బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) దేశాల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
24 OCT 2018 1:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సామాజిక మరియు కార్మిక రంగాల లో సహకారానికి సంబంధించి బ్రెజిల్, రష్యన్ ఫెడరేశన్, భారతదేశం, చైనా, ఇంకా దక్షిణ ఆఫ్రికా ల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ఎక్స్-పోస్ట్ ఫాక్టో ఆమోదాన్ని తెలిపింది. బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం 2018 వ సంవత్సరం ఆగస్టు నెల 3 వ తేదీన జరిగిన సందర్భం గా ఈ ఎంఒయు పై సంతకాలయ్యాయి.
వివరాలు:
ఈ ఎంఒయు లో కార్మిక చట్టాలు- ఆ చట్టాల అమలు, శ్రామికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి మరియు కార్మిక విపణి విధానాలు, వృత్తిపరమైన విద్య, నైపుణ్యాలు- శిక్షణ మరియు సామాజిక పరిరక్షణ ల వంటి ముఖ్య రంగాల లో అనేక కార్యక్రమాల ను నిర్వహించుకోవడం తో పాటు పరస్పరం సహకరించుకోవాలని భారతదేశం సహా సంబంధిత పక్షాలు అంగీకారాన్ని వ్యక్తం చేశాయి. సామాజిక భద్రత మరియు ఇతర కార్మిక సంబంధ అంశాల లో సహకరించుకోవడం కోసం సభ్యత్వ దేశాలు బ్రిక్స్ నెట్వర్క్ ఆఫ్ లేబర్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్స్ ను, ఇంకా బ్రిక్స్ సోషల్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఫ్రేమ్ వర్క్ ను ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఒప్పంద పత్రం ఒక అంతర్జాతీయ ఒడంబడిక ఏమీ కాదు. అలాగే, అంతర్జాతీయ శాసనం ఏలుబడి లో ఉన్న పక్షాల కు హక్కు లను, బాధ్యత లను ఇది నిర్దేశించదు.
ప్రభావం:
ఈ ఎంఒయు సమ్మిళిత వృద్ధి మరియు నూతన పారిశ్రామిక విప్లవం లో భాగం అయినటువంటి ఉమ్మడి సమృద్ధి అనే సాధారణ ధ్యేయం తో బ్రిక్స్ సభ్యత్వ దేశాల నడుమ సహకారానికి, సమన్వయానికి, ఇంకా గరిష్ఠ కలయికకు ఒక యంత్రాంగాన్ని సమకూర్చుతుంది. ఇది సభ్యత్వ దేశాలు జ్ఞానాన్ని పంచుకోవడానికి, సంయుక్త కార్యక్రమాల ను అమలు పరచడానికి బాటను పరుస్తుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ)కు చెందిన అంతర్జాతీయ శిక్షణ కేంద్రం తాలూకు నెట్ వర్క్ తో భారతదేశం లో వి.వి. గిరి నేశనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సహా బ్రిక్స్ దేశాల్లో కార్మిక సంస్థల నెట్ వర్క్ కు ఒక లంకె ను ఏర్పరుస్తుంది. తద్వారా యువజనుల ఉపాధి తో పాటు నూతన రూపాల లో ఉపాధి అనే అంశం పైన పరిశోధన మీద కూడా ప్రత్యేకం గా దృష్టి ని సారిస్తుంది. ఈ నెట్ వర్క్ నవీన జ్ఞానార్జన, నూతన సాంకేతికత లను కూడా అన్వేషిస్తుంది. సహకారాన్ని గాఢతరం చేసేందుకు వర్చువల్ నెట్ వర్క్ యొక్క సహాయాన్ని తీసుకొంటుంది; సమాచారాన్ని ఒక పక్షం నుండి మరొక పక్షానికి అందజేస్తుంది. సామర్ధ్య నిర్మాణం లో చేదోడు గా ఉంటుంది. బ్రిక్స్ దేశాల మధ్య సామాజిక భద్రత సంబంధ సహకారాన్ని బ్రిక్స్ సోశల్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఫ్రేమ్ వర్క్ బలోపేతం చేస్తుంది; సభ్యత్వ దేశాల నడుమ సామాజిక భద్రత వ్యవస్థ లను మరియు సామాజిక భద్రత ఒప్పందాలను మెరుగు పరచడం కోసం ఇతోధిక సహకారానికి బాట పరుస్తుంది.
పూర్వరంగం:
దక్షిణ ఆఫ్రికా అధ్యక్షతన దక్షిణ ఆఫ్రికా లోని డర్బన్ లో బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం 2018 వ సంవత్సరం జులై నెల 30 వ తేదీ నుండి ఆగస్టు 1 వ తేదీ వరకు; అలాగే బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల స్థాయి సమావేశాన్ని 2018 ఆగస్టు నెల 2వ, 3వ తేదీల లోను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక రంగం లో మరియు కార్మిక రంగం లో సహకారం గురించి బ్రిక్స్ దేశాల ముసాయిదా ఎంఒయు పైన చర్చలు, సంప్రదింపులు చోటు చేసుకొన్నాయి. కాగా, 2018 వ సంవత్సరం జులై నెల 30 వ తేదీ నుండి ఆగస్టు 1 వ తేదీ మధ్య జరిగిన బ్రిక్స్ ఇడబ్ల్యుజి సమావేశం లో దీని తుది రూపాన్ని ఖరారు చేసి, సభ్యత్వ దేశాల కు చెందిన కార్మిక మంత్రులు 2018 ఆగస్టు 3వ తేదీ నాడు దీని పైన సంతకాలు చేయడమైంది. ఎంఒయు యొక్క నిబంధనలు ఈ ఎంఒయు లక్ష్యాల ను స్పష్టం గా సూచిస్తున్నాయి. సామాజిక మరియు కార్మిక రంగాల లో విధానపరమైన చర్యల ను ఒక పక్షానికి మరొక పక్షం విజయవంతం గా వెల్లడి చేసుకోవడం; కార్యక్రమాల ఆదాన ప్రదానం; సంప్రదింపులు; నిపుణుల సమావేశాలు వంటి వాటిలో సహకరించుకోవడం ఆ లక్ష్యాల లో భాగం గా ఉన్నాయి.
**
(Release ID: 1550648)
Visitor Counter : 86