PIB Headquarters
గాంధీ మహాత్ముని బోధనలు నేటికీ అనుసరణీయం
Posted On:
01 OCT 2018 5:11PM by PIB Hyderabad
గాంధీ మహాత్ముని 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనం లోని రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఈ రోజు ‘‘స్వచ్ఛత హీ సేవా’’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ భరద్వాజ్ మాట్లాడుతూ, బాపు బోధనలు నేటికీ అనుసరణీయమైనవేనని పేర్కొన్నారు. సత్యసంధత, అహింస, నిర్భీతి, కరుణ, ఇంకా సమానత్వం ల వంటి అత్యంత పవిత్రమైనటువంటి గుణాలు మహాత్మ గాంధీ లో మూర్తీభవించాయని ఆయన చెప్పారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్)ల వంటి ప్రపంచం లో అత్యున్నత నాయకుల ను సైతం మహాత్ముడు ప్రభావితం చేశారని శ్రీ భరద్వాజ్ అన్నారు. స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఆయన చెబుతూ, పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవడం అనేది స్వాతంత్య్ర సాధన కన్నా మిన్న అయినటువంటి విషయమని ఒకసారి సూచించారని గుర్తుకు తెచ్చారు.
అంతకు ముందు రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ టి.వి.కె. రెడ్డి మాట్లాడుతూ, మహాత్మ గాంధీ 150వ జయంతి ని స్మరించుకొంటూ,ఏడాది పొడవునా జరుపుకొనే ఉత్సవాలకు ప్రారంభ సూచకంగా నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించు కొంటున్నట్లు తెలిపారు. గాంధీ మహాత్ముని ఆదర్శాలు దేశ ప్రజలకు మార్గదర్శక సిద్ధాంతాలుగా ఉండి తీరాలని ఆయన అన్నారు. ముఖ్యంగా మన దేశ యువతీ యువకులు వీటిని శిరోధార్యంగా పరిగణించవలసిన అవసరం ఉందని శ్రీ రెడ్డి స్పష్టం చేశారు. ఐఒసిఎల్ జనరల్ మేనేజర్ (మానవ వనరుల విభాగం) శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ సభికుల చేత ‘స్వచ్ఛత’ ప్రతిజ్ఞ పాఠాన్ని చదివింప చేశారు.
ఇదే కార్యక్రమం లో భాగంగా ఆర్ఒబి కి చెందిన గేయ, నాటక విభాగం (ఎస్&డిడి) కళాకారులు బాపూజీ బోధనలను ఆధారంగా తీసుకొని ఒక చక్కని రూపకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), ప్రచురణల విభాగం సిబ్బంది కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1548363)
Visitor Counter : 244