గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మెట్రో అనుసంధానతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు
ఢిల్లీ మెట్రో కారిడార్ను నోయిడా సిటీ సెంటర్ నుంచి నోయిడా ,ఉత్తరప్రదేశ్ సెక్టర్ -62 వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం
Posted On:
16 MAY 2018 3:36PM by PIB Hyderabad
నొయిడాలో ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరిచేందుకు ,ఢిల్లీ మెట్రో కారిడార్ను నోయిడా సిటీ సెంటర్ నుంచి సెక్టర్ -62 నోయిడా ఉత్తరప్రదేశ్ వరకు సుమారు 6.675 కిలోమీటర్ల మేరకు 1,967 కోట్ల రూపాయల మొత్తం వ్యయంతొ చేపట్టేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భారతప్రభుత్వ బాధ్యత గ్రాంట్, సబార్డినేట్ డెట్ కింద 340.60 కోట్ల రూపాయలుగా ఉంటుంది.
వివరాలు :
ఢిల్లీ మెట్రో కారిడార్ను నోయిడా సెంటర్ నుంచి సెక్టర్ -62, నోయిడా, ఉత్తరప్రదేశ్ వరకు సుమారు 6.675 కిలోమీటర్ల మేర పొడిగించేందుకు అనుమతించడం జరిగింది.
మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు 1,967 కోట్ల రూపాయలు..
ప్రాజెక్టును భారత ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ప్రస్తుత స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్.పి.వి) అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పరేషన్ లిమిటెడ్ అమలు చేస్తుంది.
సెంట్రల్ మెట్రో యాక్ట్, మెట్రో రైల్వేస్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్స్) యాక్ట్,1978, మెట్రో రైల్వేస్ ( ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) యాక్ట్ 2002లకు సంబంధించి ఎప్పటికప్పుడు చేసే సవరణలకు అనుగుణంగా చట్టపరమైన ఫ్రేమ్ వర్క్కు లోబడి దీనిని చేపడతారు.
ప్రధాన ప్రభావం :
ఢిల్లీ మెట్రో కారిడార్ను నోయిడా సిటీ సెంటర్ నుంచి నొయిడా సెక్టర్ 62 వరకు పొడిగించడమంటే, ఢిల్లీ మెట్రోకి చెందిన ద్వారకా- నోయిడా సిటీసెంటర్ లైన్ పొడిగింపుగా చెప్పుకోవచ్చు.దీనితో ఢిల్లీ శివారు పట్టణాలకు ఎక్కువ మంది ప్రజలకు ప్రయాణ సౌకర్యం దీనితో అందుబాటులోకి వస్తుంది.దీనితో ఢిల్లీ లో రద్దీ తగ్గడానికి అవకాశం ఉంటుంది.ఫలితంగా మరిన్ని నివాస, వాణిజ్య కాంప్లెక్స్లు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయి. తక్కువ వ్యవధిలో , తక్కువ ఖర్చుతో, తక్కువ పర్యావరణ కాలుష్యంతో, తక్కువ శిలాజ ఇంధన వినియోగంతో గమ్యానికి చేరడానికి వీలుంటుంది.
ప్రస్తుతం పొడిగిస్తున్న మెట్రోరైలు కారణంగా నోయిడా ప్రజలు, దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎంతగానో ప్రయోజనం పొందుతారు.ప్రాజెక్టు స్థలం వద్ద సుమారు 800 మంది సిబ్బంది పనిచేస్తారు. వీరిలో ఇంజనీర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. ఇంకా ఈ కారిడార్ కార్యకలాపాలు చేపట్టడం, నిర్వహణకు డి.ఎం.ఆర్.సి 200 మంది ఉద్యోగులను నియమించే ప్రక్రియ ప్రారంభించింది.
సివిల్ పనులలో 81 శాతం పనులు పురోగతి సాధించగా, 55 శాతంపైగా ఆర్థిక పురోగతిని ఈ ప్రాజెక్టు సాధించింది.
నేపథ్యం :
నోయిడా సిటీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఉంది. దీనిని ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం కింద ఏర్పాటు చశారు.ఇక్కడ అన్ని అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఢిల్లీ శివార్లలో నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్.సి.ఆర్) ప్రాంతంలో అత్యంత అధునాతన ప్రాంతంగా ఇది రూపుదిద్దుకుంది.2011 జనాభా లెక్కల ప్రకారం నోయిడా జనాభా 6.42 లక్షలు. అందమైన పచ్చిక బయళ్లు, హరిత ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఢిల్లీకి , ఆ పరిసరాలకు చెందిన ఎంతో మంది నోయిడాలో స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు.
నోయిడాలో నగరీకరణ శరవేగంతో ముందుకుపోతోంది. ఎన్నో పారిశ్రామిక, సంస్థాగత యూనిట్లు ఈ నగరంలో ఏర్పాటయ్యాయి. నోయిడాకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రాంతాలు, హర్యానా రాష్ట్రంతో రోడ్ అనుసంధానత ఉంది. ప్రజలు పని కోసం ఇతర ప్రాంతాలనుంచి నోయిడా వస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు పనులకోసం వెళుతుంటారు. ఈ కారణాల వల్ల ట్రాఫిక్రద్దీ నానాటికీ పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల పర్యావరణహితకరమైన సమర్ధ సత్వర ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. నోయిడాకు మెట్రో రైలు అనుసంధానత ఉంది. మట్రోరైళ్లు నోయిడా సిటీ సెంటర్ ( సెక్టర్ 32 నోయిడా) వరకు నడుస్తున్నాయి. దీనిని నోయిడా సిటీ సెంటర్ నుంచి నోయిడా సెక్టర్ 62 వరకు సుమారు 6.675 కిలోమీటర్ల మేరకు ఆరు రైల్వే స్టేషన్లతో మెట్రో రైల్వే లైన్ను పొడిగించేందకు ప్రతిపాదింపబడింది. నోయిడాకు రైల్వే స్టేషన్ లేదు. దగ్గరి రైల్వే స్టేషన్ హజరత్ నిజాముద్దీన్. న్యూఢిల్లీ సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీప విమానాశ్రయం నోయిడా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ విమానాశ్రయం ఉంది . రాగల సంవత్సరాలలో నోయిడా రీజియన్లో జనాభా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది.
*****
(Release ID: 1532461)
Visitor Counter : 100