PIB Headquarters

రేప‌టి నుంచి 20వ అంత‌ర్జాతీయ బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వం 2017 మీడియా సెంట‌ర్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ‌ తలసాని శ్రీ‌నివాస యాద‌వ్‌

Posted On: 07 NOV 2017 5:57PM by PIB Hyderabad

హైదరాబాద్, నవంబర్ 07, 2017

 

20వ అంత‌ర్జాతీయ బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వం 2017 రేప‌టి నుంచి ప్రారంభం కానుంది.  ఈ చ‌ల‌న చిత్రోత్స‌వ ప్రారంభ, ముగింపు వేడుక‌లకు శిల్ప‌క‌ళావేదిక ఆతిథ్య‌మివ్వ‌నుంది.  ఇందుకు సంబంధించి  ప‌త్రికా ప్ర‌తినిధుల కోసం ప్ర‌సాద్ ఐ మ్యాక్స్ థియేట‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్‌ను  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ‌ తలసాని శ్రీ‌నివాస యాద‌వ్‌ ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ20వ అంత‌ర్జాతీయ బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వం 2017 కు సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్త‌య్యాయ‌ని తెలిపారు.

 

ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ బాల‌ల చల‌న చిత్రోత్స‌వాల‌కు 93 దేశాల నుంచి 1402 ఎంట్రీలు వచ్చాయి.  వీటి నుంచి 50 దేశాల‌కు చెందిన 300 చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపిక చేశారు.  తెలంగాణ రాష్ట్రం నుంచి 50 మంది బాల బాలిక‌లు చైల్డ్ డెలిగేట్స్ గా ఈ చిత్రోత్స‌వాల‌లో పాల్గొన‌నున్నారు. ఇత‌ర రాష్ట్రాల లోని విద్యాశాఖ త‌ర‌పున వివిధ విద్యాల‌యాల నుంచి 30 మంది చైల్డ్ డెలిగేట్స్ ఈ చ‌ల‌న చిత్రోత్స‌వంలో పాల్గొన‌నున్నారు.  వీరితో పాటుగా న‌వోదయ పాఠ‌శాల‌ల నుంచి 30 మంది చైల్డ్ డెలిగేట్స్ కూడా పాల్గొంటున్నారు.  ఈ చిత్రోత్స‌వంలో 12 మంది లిటిల్ డైర‌క్ట‌ర్స్ పాల్గొన‌నున్నారు. 

 

 

ఈ చిత్రోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్న వ‌ర్క్ షాప్ లో రెసిడెన్షియ‌ల్‌, ఇత‌ర ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన 120 మంది బాల‌బాలిక‌లు ఫిల్మ్ మేకింగ్‌, స్టోరీ టెల్లింగ్‌, యానిమేష‌న్ విభాగాల్లో పాల్గొన‌నున్నారు.  హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లోని ఎంపిక చేసిన 10 సినిమా థియేట‌ర్ల‌లో ఈ చిత్రోత్స‌వాల్లోని చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుంది.  దివ్యాంగులైన చిన్నారుల కోసం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఒక ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు చేస్తున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 27 థియేట‌ర్ల‌ల‌లో సైతం ఈ చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శిస్తారు.  జ్యూరీ ప్ర‌ద‌ర్శ‌న‌ను హోట‌ల్ పార్క్‌, హోట‌ల్ ప్లాజా, ఎఫ్‌డిసి థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుంది.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎఫ్ఎస్ఐ  సిఇఒ శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ, లిటిల్ డైర‌క్ట‌ర్స్ కాంపిటేష‌న్ సెక్ష‌న్ కు 31 దేశాల నుంచి చిత్రాలు వ‌చ్చాయ‌న్నారు.  ప్రదర్శించనున్న చిత్రాల్లో 8 తెలుగు చిత్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు.  వేడుక‌ల ప్రారంభోత్స‌వం రోజున‌ ‘‘స్కూల్ ఛ‌లేగా’’ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున‌న్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐ & పిఆర్ క‌మిష‌న‌ర్‌, న‌వీన్ మిట్ట‌ల్ తదితరులు పాల్గొన్నారు.

 

***

 

పిఐబి/ హైదరాబాద్ /



(Release ID: 1508540) Visitor Counter : 110


Read this release in: English