PIB Headquarters
తెలంగాణలో 2600 కి.మీ. ల రోడ్లను నిర్మించిన కేంద్రం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్
- బయ్యారంలో ఉక్కు కర్మాగారం, వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్
-రామగుండంలో మూతపడ్డ యూరియా కర్మాగారాన్ని రైతుల ప్రయోజనార్థం తిరిగి తెరిపిస్తాం
-పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ కల్పన .. ఇవి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ లో భాగం
-అవినీతి రహిత, పారదర్శక, బాధ్యతాయుత పాలనను అందించిన ఎన్ డిఎ సర్కారు
-మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారత దిశగా పలు పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
-నల్గొండ లో విజయవంతంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ కార్యక్రమం
Posted On:
06 JUN 2017 8:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేదరిక నిర్మూలనకు, యువతీయువకులకు ఉద్యోగావకాశాల కల్పనకు అగ్ర ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండలో ఈ రోజు జరిగిన ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ కార్యక్రమానికి తరలివచ్చిన సభికులను ఉద్దేశించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్ ప్రసంగిస్తూ, కేంద్రంలో గత మూడేళ్ల ఎన్ డిఎ హయాంలో పారిశ్రామిక ఉత్పాదకత పలు రెట్లు పెరిగిందని తెలిపారు. దేశంలోన నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ లు’ వంటి పలు నూతన పథకాలను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. నైపుణ్యాల అభివృద్ధికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలు, ఆడ పిల్లల సాధికారత దిశగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ (‘ఆడపిల్లను కాపాడండి- ఆడపిల్లను చదివించండి’) పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించినట్లు శ్రీ అహిర్ వెల్లడించారు. ముద్రా బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి తీసుకువచ్చిన ‘జన్ ధన్ యోజన’ ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బాట వేసిందన్నారు. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఒక కోటి బ్యాంకు ఖాతాలను తెరిపించినట్లు వివరించారు. ఎన్ డిఎ ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శక, బాధ్యతాయుత పాలనను అందిస్తోందని మంత్రి చెప్పారు.
రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’, వ్యవసాయ దిగుబడుల కోసం యూరియా లభ్యత, ఎన్ టి పిసి ద్వారా విద్యుత్తు ఉత్పాదనను పెంచడం, సౌర శక్తి, జల విద్యుత్తు కు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్ చెప్పారు. రైతాంగం మేలు కోసం సేద్యపు నీటి పారుదల సదుపాయాలను పెంచామని తెలిపారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ రైతులకు సంబంధించిన సామాజిక, బీమా రక్షణ పథకం అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం పేదలలోకెల్లా పేదల ప్రభుత్వం, సమాజంలోని చివరి వరుస లోని వ్యక్తికి కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని ఆయన అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను గురించి ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి చొరవలు అభినందనీయమన్నారు. శ్రీ కుల్ భూషణ్ జాదవ్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయ స్థానం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా శ్రీ జాదవ్ జీవితాన్ని కాపాడేందుకు ప్రధాన మంత్రి కృషి చేశారని శ్రీ అహిర్ అన్నారు. భారతదేశ ప్రజలకు అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గొప్ప సేవ చేశారని శ్రీ అహిర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
తెలంగాణ లోని బయ్యారంలో ఒక ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్ ప్రకటించారు. వరంగల్ లో త్వరలో ఒక టెక్స్ టైల్ పార్కు ను ప్రారంభిస్తాం. తెలంగాణలో జాతీయ రహదారుల ను కలుపుతూ 2600 కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ కు నైపర్, సిపెట్ వంటి వాటిని అందించాం. గత మూడు సంవత్సరాలలో దిగుమతులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. ఇది ఆర్థిక వృద్ధికి ఒక సూచిక అని కేంద్ర మంత్రి శ్రీ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్ వివరించారు.
ఈ సందర్బంగా శాసనసభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పురోగతి కోసం పలు చరిత్రాత్మక చర్యలు చేపట్టారన్నారు. వాటిలో నల్లధనాన్ని వెలికితీయడానికి గాను పాత పెద్ద నోట్ల చలామణి రద్దు, వస్తువులు-సేవల చట్టం (జిఎస్ టి), జాతీయ బి సి కమిషన్ కు రాజ్యాంగ బద్ధత కల్పన, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి కొన్ని మాత్రమే అని డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ అధికారులు శ్రీ ఆలోక్ కుమార్, శ్రీ జె.వి.ఎస్.ఆర్. శేఖర్ కుమార్, శ్రీమతి బి.బి. సరోజిని లతో పాటు పలువురు ఎల్ పిజి డీలర్లు, పలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో సాధించిన విజయాలను వివరించే ఒక చిత్రాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
***
(Release ID: 1492012)
Visitor Counter : 66