సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మానవ నాగరికత ఉన్నతికి తోడ్పడే జియోస్పేషియల్ టెక్నాలజి: కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు
2030 కల్లా శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలలో భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి 3 దేశాలలో ఒకటిగా చేరుతుంది:
కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ
-హైదరాబాద్ లో ప్రారంభమైన జియోస్పేషియల్ వరల్డ్ ఫోరమ్ – 2017 సమావేశం
Posted On:
23 JAN 2017 8:14PM by PIB Hyderabad
కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం, సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ఈ రోజు హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జియోస్పేషియల్ వరల్డ్ ఫోరమ్ సమావేశాన్ని ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశంలో “జియోస్పేషియల్ + డీప్ లెర్నింగ్: షేపింగ్ స్మార్టర్ వరల్డ్’’ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. కేంద్ర మంత్రి సభను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేస్తూ, జియోస్పేషియల్ టెక్నాలజీని మానవ నాగరికత ఉన్నతికి ఉపయోగపడే సాంకేతిక విజ్ఞానంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. “మనం ఒక కొత్త శకంలో నూతన ఆకాంక్షలు, నవీన ఆవిష్కరణలు, నవకల్పనల అండదండలతో మనుగడ సాగిస్తున్నాం.. ఇవన్నీ మనను ఆకర్షణీయమైన భవిష్యత్తు వైపునకు తీసుకువెళుతున్నాయి. భారతీయ జియోస్పేషియల్ పరిశ్రమ 2025 కల్లా 20బిలియన్ డాలర్ల మార్కెట్ గా పురోగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. జిఐఎస్ సేవలకు గాను ప్రభుత్వ సంస్థలకు ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న బడ్జెట్ ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల వరకు ఉంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొనే పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించినట్లు శ్రీ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ సిటీస్ కార్యక్రమం, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం, డిజిటల్ ఇండియా, స్టార్ట్ అప్స్ తో పాటు, మేక్ ఇన్ ఇండియా వంటివి ఉన్నాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్ డిఎ ప్రభుత్వ హయాంలో రాజకీయాల గమనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధికి, వేగవంతమైన పాలనకు ఎన్ డిఎ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్ ఐ ఎస్ ఐ డి ఐ సి ఐ.. అంటే, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంకా క్లీన్ ఇండియా..పథకాలను అమలుచేస్తున్నట్లు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకు జియోస్పేషియల్ టెక్నాలజీ ప్రధానంగా తోడ్పడనుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జె ఎ ఎమ్ (ఇది జన్ ధన్, ఆధార్, మొబైల్.. ఈ మూడింటికి సంక్షిప్త రూపం) కార్యక్రమం జన్ ధన్ ఖాతాలు, మొబైల్ నెంబర్లు, ఆధార్ కార్డులను ముడిపెడుతూ పలు ఇతర కార్యక్రమాలకు పునాది రాయిగా మారిందని, ప్రభుత్వ సబ్సిడీలు దారి మళ్ళకుండా చూసేందుకు జె ఎ ఎమ్ సహకరించగలదని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు.
దేశంలో పట్టణీకరణ భారీ ఎత్తున చోటు చేసుకుంటోందని కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. ఇది ఎంతో సహజంగా జరుగుతున్న ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. నగరాలను మరిన్ని సౌకర్యాలతో నివాసయోగ్యంగా మార్చేందుకుగాను అనేక విధాలుగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని, పట్టణ జీవనాన్ని ఇదివరకటితో పోలిస్తే సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం ఈ పథకం ధ్యేయమని ఆయన చెప్పారు. భారతదేశంలో 2030కల్లా సుమారు 606 మిలియన్ మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో జీవించే పరిస్థితులు ఏర్పడగలవని ఒక అంచనా ఉందని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పట్టణ ప్రాంత జనాభాను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభాలో వీరు 11 శాతంగా లెక్కకు వస్తున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 13 శాతానికి చేరగలదని ఆయన వివరించారు. పట్టణాల సంబంధిత ప్రణాళికా రచన సమర్థంగా రూపుదిద్దుకోవలసిన అవసరం గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగిందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుత కాలంలో నగరాలు హైవేల వెంబడి నిర్మాణం అవుతున్నాయని, కాగా, భవిష్యత్ తరం నగరాలను చక్కని డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉండే ప్రదేశాలతో పాటు, ఆప్టికల్ ఫైబర్ హైవేల చూట్టూ నిర్మించడం జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
పట్టణాభివృద్ధి శాఖ చేపడుతున్న స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్ అభియాన్, అటల్ మిషన్ ఫర్ రిజూవనేషన్ & అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్(అమృత్), హెరిటేజ్ సిటీ డెవలప్ మెంట్ & ఆగ్ మెంటేషన్ యోజన (హృదయ్) వంటి కార్యక్రమాలు భారతదేశం రూపు రేఖలను మార్చివేయనున్నాయని శ్రీ వెంకయ్య నాయుడు వివరించారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒక కేంద్ర బిందువుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను అమలుచేయడంలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగం గురించి శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవలే గూగల్ టాయిలెట్ లొకేటర్ యాప్ ను ప్రవేశపెట్టిందని, ఈ యాప్ శుభ్రం చేయడం పూర్తి అయిన మరుగుదొడ్డిని అత్యంత వేగంగా గుర్తించడానికి వినియోగదారులకు ఉపయోగపడుతుందని తెలిపారు. పురపాలక సంఘాలు తమ సిబ్బందికి జియో ట్యాగింగ్ ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. జియోస్పేషియల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, ఈ రంగంలో 500 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులకు అవకాశం ఉందని, అంతేకాకుండా వేలాది ఉద్యోగాల కల్పనకు కూడా ఆస్కారం ఉందని ఆయన అన్నారు. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంపై వారి దృష్టిని కేంద్రీకరించాలని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) నివేదికలను బట్టి చూస్తే, భారతదేశం అత్యధిక స్థాయిలో విదేశీమారక ద్రవ్య నిల్వలను కలిగి ఉండడంతో పాటు భారతదేశంలో ద్రవ్యోల్బణం కూడా అతి తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నదని మంత్రి వివరించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కరించు, పనిచేయి, పరివర్తనకు దారితీయి (రిఫామ్, పెర్ ఫామ్ & ట్రాన్సాఫామ్) అనే 3 పదాలతో కూడిన మంత్రాన్ని సూచించారని కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. తాను సమాచార & ప్రసార శాఖ మంత్రిగా ఈ 3 పదాలకు తోడు తెలియజేయు (ఇన్ఫామ్) అనే మాటను కూడా జోడించానని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. MODI (మేకింగ్ ఆఫ్ డెవలప్ డ్ ఇండియా)ఉద్యమంలో చేరవలసిందిగా ప్రజలకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. నోట్ల చట్టబద్ధత రద్దును గురించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రస్తావిస్తూ.. సర్వే ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల చిరునామాను సూచించగలదో, ఈ నోట్ల చట్టబద్ధత రద్దు నిర్ణయం కూడా అదే విధంగా ‘నోట్ల సర్వే ’ ను గురించి సూచించిందన్నారు. ఇవాళ ప్రతి ఒక్క కరెన్సీ నోటు ఒక చిరునామాను.. జియో ట్యాగింగ్ మాదిరిగానే.. కలిగివున్నదని, ఇదే నోట్ల చలామణీ రద్దు నిర్ణయం సాధించిన అతి గొప్ప విజయమని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రభుత్వం అమలుచేసిన డిమానిటైజేషన్ కార్యక్రమం కరెన్సీ నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకొనేందుకు తోడ్పడినట్లు ఆయన చెప్పారు.
కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి, పురోగతికి,సమాజంలో పౌరుల జీవనానికి సర్వే ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలు అపారమైనవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని శ్రీ దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. భూమి రికార్డుల వ్యవస్థను జియోస్పేషియల్ టెక్నాలజీతో సమన్వయపరచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటో రోజు నుంచి ‘ కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన ’ సూత్రాన్ని అనుసరిస్తోందనీ,ఇందుకోసం సాంకేతిక విజ్ఞానాన్ని, ప్రజల ప్రాతినిధ్యాన్ని కలబోసి ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. సేవలను ప్రజలకు అందజేయడంలో మానవ ప్రమేయాన్ని తగ్గించాలన్నదే ఈ సూత్రంలోని ముఖ్యోద్దేశమని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. 2030 కల్లా శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలలో ప్రపంచంలోకెల్లా అగ్రగామిగా ఉండే 3 దేశాల సరసన భారతదేశం నిలుస్తుందని కూడా శ్రీ దత్తాత్రేయ అన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగానికి బడ్జెట్ ను ప్రస్తుత ఎన్ డిఎ ప్రభుత్వం 17 శాతం మేర పెంచి, రూ. 2,682 కోట్లకు చేర్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచస్థాయిలో శాస్త్ర సంబంధ ప్రచురణల వృద్ధి 4 శాతంగా ఉండగా, భారతదేశంలో శాస్త్ర సంబంధ ప్రచురణలు 14 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని ఆయన తెలిపారు. హ్యాకింగ్, సైబర్ నేరాలు వంటి విధ్వంసక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉండవలసిందని ప్రజలకు మంత్రి సూచించారు. సాంకేతికపరమైన నవకల్పనలతో ఈ పెడ పోకడలను నియంత్రించాలని ఆయన సూచించారు.
ఈ ఫోరమ్ సమావేశాలకు సర్వే ఆఫ్ ఇండియా ఆతిథ్యాన్నిస్తోంది. ఈ సంవత్సరంతో సర్వే ఆఫ్ ఇండియా 250వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కాగా, కేంద్ర మంత్రులు ‘ గ్లోబల్ జియోస్పేషియల్ ఇండస్ట్రీ అవుట్ లుక్ నివేదిక ’ ను విడుదల చేశారు. ఆ తరువాత వారు సర్వే ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ స్టాండ్ ను కూడా ప్రారంభించారు. 100 దేశాలకు చెందిన 300 మంది నిపుణులు, భారతదేశం మరియు విదేశాలకు చెందిన 3,000 మంది వృత్తి నిపుణులు, అనేక మంది ఉన్నతస్థాయి ప్రతినిధులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, సాంకేతిక విజ్ఞాన సరఫరా సంస్థలు, సొల్యూషన్ ప్రొవైడర్స్ తో పాటు ప్రపంచ జియోస్పేషియల్ సముదాయంతో సంబంధమున్న తుది వినియోగ వర్గాల వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1481060)
Backgrounder release reference
Geospatial World Forum -2017
This link will take you to a webpage outside this websiteinteractive page. Click OK to continue.Click Cancel to stop :
Geospatial World Forum -2017